టీ20 వరల్డ్కప్ చరిత్రలో 'ఒకేఒక్కడు'- మూడుసార్లు ఫైనల్ ఆడిన ఏకైక భారత క్రికెటర్
టీ20 వరల్డ్ కప్లో అరుదైన ఘనత- మూడు సార్లు ఫైనల్స్ ఆడిన ఏకైక భారత ఆటగాడిగా రికార్డ్

Published : March 1, 2026 at 10:41 AM IST
T20 World Cup Finals : క్రికెట్లో ఎన్నో రికార్డులు చూస్తుంటాం కానీ కొన్ని మాత్రం చాలా స్పెషల్గా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ముఖ్యంగా వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీలో ఏ ప్లేయరైనా ఫైనల్కు వెళ్లి టైటిల్ నెగ్గాలని అనుకుంటాడు. ఇలాంటి మెగా టోర్నీల్లో ఫైనల్ వరకు వెళ్లడం అనేది పెద్ద సవాలుతో కూడుకున్నది. అలాంటిది ఒక క్రికెటర్ ఒకటికాదు, రెండు కాదు ఏకంగా మూడుసార్లు తన కెరీర్లో టీ20 వరల్డ్కప్ పైనల్ ఆడాడు. అది కూడా భారత ప్లేయరే కావడం విశేషం.
2007లో ఈ పొట్టి ఫార్మాట్ మొదలైనప్పటి నుంచి టీమ్ఇండియా ఎంతో మంది దిగ్గజాలను చూసింది. కానీ ఇన్నేళ్లలో ఒక్కడంటే ఒక్కడే మూడుసార్లు ఫైనల్ మ్యాచ్ ఆడాడు. అందుకో రెండుసార్లు ట్రోఫీని ముద్దాడాడు. మరి ఈ అరుదైన ఘనత దక్కించుకున్న మన భారత క్రికెటర్ ఎవరో? ఆ జర్నీ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!
ఎంట్రీలోనే పాకిస్థాన్పై సూపర్ విక్టరీ
ఆ ఆటగాడు మరెవరో కాదు, మన 'హిట్మ్యాన్ రోహిత్ శర్మ'. తన కెరీర్ ప్రారంభంలోనే రోహిత్కు 2007 టీ20 వరల్డ్కప్ ఫైనల్ ఆడే అవకాశం వచ్చింది. సౌతాఫ్రికాలో జరిగిన ఆ టోర్నీలో దాయాది దేశం పాకిస్థాన్తో ఫైనల్ ఫైట్ జరిగింది. ఆ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో రోహిత్ మెరుపు ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. 16 బంతుల్లోనే 30 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ ఆ మ్యాచ్ గెలిచి తొలిసారి వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. యువ క్రికెటర్గా కెరీర్ తొలినాళ్లలోనే ప్రపంచ కప్పును ముద్దాడటం రోహిత్కు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉండిపోతుంది.
రెండోసారి ఫైనల్- ఈసారి మిస్!
ఏడేళ్ల గ్యాప్ తర్వాత 2014లో టీమ్ఇండియా రెండోసారి టీ20 ఫైనల్ చేరింది. ఈ జట్టులోనూ రోహిత్ శర్మ సభ్యుడే. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ అదరగొట్టి ఫైనల్ దాకా వెళ్లింది. అయితే అక్కడ శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియాకు నిరాశ ఎదురైంది. ధోనీ కెప్టెన్గా ఉన్నప్పుడు ఐసీసీ ఫైనల్లో భారత్ ఓడిపోయిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. రోహిత్ ఈ మ్యాచ్లో 26 బంతుల్లో 29 పరుగులు చేశాడు.
ఈసారి కెప్టెన్గా!
రోహిత్ శర్మ కెరీర్లోనే హైలైట్గా నిలిచిపో సందర్భం 2024 టీ20 వరల్డ్కప్. వెస్టిండీస్- అమెరికా సంయుక్త వేదికలుగా జరిగిన ఈ టోర్నీలో రోహిత్ కెప్టెన్గా భారత జట్టును నడిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్లో టీమ్ఇండియా ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో 18ఏళ్ల తర్వాత భారత్ మళ్లీ టీ20 వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. ఈ మ్యాచ్తో రోహిత్ శర్మ మూడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడిన ఏకైక భారతీయ క్రికెటర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
కోహ్లీ ధోనీకి కూడా సాధ్యం కాని రికార్డ్
ప్రపంచవ్యాప్తంగా చూస్తే, మూడు సార్లు టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడిన ప్లేయర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. మన దేశం నుంచి ఆ గౌరవం కేవలం రోహిత్ శర్మకు మాత్రమే దక్కింది. విరాట్ కోహ్లీ, ధోనీకి కూడా సాధ్యం కానీ ఈ అరుదైన ఫీట్ ను రోహిత్ సాధించడం విశేషం. ధోనీ (2007, 2014), విరాట్ (2014, 2024) రెండుసార్లే ఫైనల్స్ ఆడారు. అలా యువ ఆటగాడిగా అరంగేట్రం చేసి, అదే జట్టుకు కెప్టెన్గా వరల్డ్ ఛాంపియన్గా నిలబెట్టిన ఘతన హిట్మ్యాన్కే దక్కుతుంది.
సక్సెస్ఫుల్గా రిటైర్మెంట్
2024 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్్కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. 18ఏళ్ల సుదీర్ఘ టీ20 కెరీర్లో రోహిత్ 159 మ్యాచ్ల్లో 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండడం విశేషం. అలాగే రోహిత్ టీ20లకు గుడ్ బై చెప్పే నాటికి ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్గా అతడే టాప్లో ఉన్నాడు.

