ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఐపీఎల్ నుంచి రూ.2 కోట్ల క్రికెటర్ ఔట్! - ఆ జట్టుకు భారీ దెబ్బ
2026 ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన క్రికెటర్- ఒక్క మ్యాచ్లో కూడా బరిలో దిగకుండానే దూరం

Published : April 10, 2026 at 2:25 PM IST
Wanindu Hasaranga IPL 2026 : 2026 ఐపీఎల్లో రెండో విజయం నమోదు చేసిన లఖ్నవూ సూపర్ జెయింట్స్కు షాక్ తగిలింది. ఇప్పుడిప్పుడే జట్టు గాడిలో పడుతున్న సమయంలో ఆ జట్టు స్టార్ ప్లేయర్ ప్రస్తుత టోర్నీ నుంచి పూర్తిగా నిష్క్రమించాడు. ఈ విషయాన్ని లఖ్నవూ మేనేజ్మెంట్ ధ్రువీకరించింది. దీంతో ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఏ క్రికెటర్తో హసరంగ స్థానాన్ని రిప్లేస్ చేస్తారని ఆసక్తిగా మారింది.
కండరాల గాయం
ఈ ఏడాది ఫిబ్రవరిలో హసరంగాకు 'హామ్స్ట్రింగ్' (తొడ కండరాల) గాయం అయ్యింది. దీంతో తొలుత అతడు ఈ ఐపీఎల్లో ప్రారంభ మ్యాచ్తలకు దూరమయ్యాడు. అయితే త్వరలోనే కోలుకొని తిరిగి జట్టులోకి వస్తాడని మేనేజ్మెంట్ కూడా పూర్తి నమ్మకంతో ఉంది. కానీ తాజా అప్డేట్ ప్రకారం హసరంగ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతడు ప్రస్తుత టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు.
గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్- లఖ్నవూ సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా లఖ్నవూ ఫ్రాంచైజీ డైరెక్టర్ టామ్ మూడీ మీడియా బ్రాడ్కాస్టర్తో మాట్లాడుతూ,హసరంగ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. 'వానిందు హసరంగా ఇంకా జట్టులో చేరలేదు. మేం అతడి రిప్లేస్మెంట్ కోసం చూస్తున్నాం. రానున్న 48 గంటల్లో అతని స్థానంలో రిప్లేస్మెంట్ ప్రకటిస్తాం' అని అన్నాడు. దీంతో హసరంగా టోర్నీకి దూరమైనట్లు క్లారిటీ వచ్చేసింది. అలాగే రానున్న 2 రోజుల్లో హసరంగా స్థానాన్ని మరొక ఆటగాడితో భర్తీ చేసి అవకాశం ఉంది.
ఈ కారణాలు కూడా!
ఫిబ్రవరిలో హసరంగ గాయపడ్డాడు. అప్పట్నుంచి ఆటకు దూరంగా ఉంటున్నాడు. అంటే దాదాపు మూడు నెలలుగా అతడు మైదానంలో అడుగుపెట్టలేదు. దాంతోపాటు అతడు శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) కోసం తీసుకోవాల్సి ఉంది. దీని కోసం అతడు ఇంకా దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. అందుకే అతడిని వదులుకొని ఇంకొ ఆటగాడిని లఖ్నవూ తీసుకోవాలనే ఆలోచనలో పడింది.
ఇదిలా ఉండగా రాజస్థాన్ రాయల్స్ హసరంగను తమ జట్టులో నుంచి రిలీజ్ చేసింది. దీంతో గతేడాది జరిగిన మినీవేలంలో లఖ్నవూ జట్టు హసరంగాను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా అతను జట్టులో చేరలేకపోయాడు. ఫిబ్రవరిలో న్యూజిలాండ్తో జరిగిన టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో అతడు గాయపడ్డాడు. అదే అతడికి లాస్ట్ మ్యాచ్. ఇక
హసరంగా తన IPL కెరీర్లో 37 మ్యాచ్లు ఆడి, 24.32 సగటుతో 46 వికెట్లు పడగొట్టాడు. ఈ కాలంలో, అతను ఒకసారి 'ఐదు వికెట్ల ప్రదర్శన' (Five-Wicket Haul) నమోదు చేశాడు. గత సీజన్లో, అతను రాజస్థాన్ రాయల్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. 2021 నుంచి 2023 వరకు అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరపున ఆడాడు. ESPNCricinfo నివేదిక ప్రకారం, హసరంగా స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ జార్జ్ లిండేను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

