దుబాయ్లో చిక్కుకుపోయిన సింధు- పరిస్థితి భయంకరంగా ఉందంటూ పోస్ట్!
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు- గల్ఫ్ గగనతలం మూసివేత- దుబాయ్ ఎయిర్పోర్టులో చిక్కుకున్న పీవీ సింధు

Published : March 1, 2026 at 9:53 AM IST
PV Sindhu Dubai Airport : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దుబాయ్ ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయింది. యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం విమాన సర్వీసులపై పడంతో గల్ఫ్ దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. తదుపరి నోటీసు వరకు అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం తమ టీమ్తో కలిసి ఇంగ్లాండ్ వెళ్తున్న సింధు దుబాయ్లోనే ఆగిపోయింది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా వేదికగా అక్కడి తాజా పరిస్థితిని షేర్ చేసింది.
ప్రస్తుతానికి తాను సురక్షితంగానే ఉన్నట్లు సింధు పేర్కొంది. దుబాయ్ ఎయిర్పోర్టు సిబ్బంది, ఇండియా హై కమిషన్ అధికారులు అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని తెలిపింది. 'ఈ కఠిన పరిస్థితులు కొనసాగుతునే ఉన్నాయి. ఇక్కడ గంట గంటకూ పరిస్థితి మరింత భయంకరంగా మారుతోంది. కొన్ని గంటల కిందటే, విమానాశ్రయంలో మేం చిక్కుకున్న ప్రదేశానికి సమీపంలో పేలుడు సంభవించింది. నా కోచ్కు దగ్గరలోనే ఆ పొగ, శిథిలాలకు పడడంతో ఆయన అక్కడ్నుంచి త్వరగా తప్పించుకున్నారు'
'మా అందరికీ ఇవి ఉద్రిక్తమైన, భయంకరమైన క్షణాలు. దుబాయ్ ఎయిర్పోర్ట్ సిబ్బంది, దుబాయ్ అధికారుల అవిశ్రాంత కృషికి థాంక్స్. మమ్మల్ని సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. ప్రస్తుతం మేం సేఫ్గా ఉన్నాం. మా పరిస్థితిని గమనిస్తూ, మమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి నిరంతరం కృషి చేస్తున్న దుబాయ్లోని భారత హైకమిషన్కు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రస్తుతానికి, మేం విశ్రాంతి తీసుకుంటున్నాం. త్వరలోనే పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నాం' అని సింధు తమ తాజా పరిస్థితిని వివరించింది

కాగా, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు శనివారం దాడికి దిగాయి. ప్రతీకారంగా గల్ఫ్ దేశాలు దుబాయ్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, సౌతా అరేబీయా, ఇరాక్, ఖతార్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతి దాడి చేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో గగనతలాన్ని మూసి వేశారు. దీంతో అనేక విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. వందలాది ఫ్లైట్లు రద్దు అయ్యాయి.
మోదీజీ నాకు హెల్ప్ చేయండి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ఆమె ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా ఆమెను భారత్కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు షేర్ చేశారు. 'ప్రధాని నరేంద్ర మోదీ జీ, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా నేను ప్రస్తుతం దుబాయ్లో చిక్కుకున్నా. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారంగా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. భారత్కు రిటర్న్ వచ్చేందుకు ఇప్పుడు సరైన మార్గం లేదు. నేను సేఫ్గా ఇండియాకు వచ్చేందుకు నాకు సహకారం అందించండి' అని సోనాల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు పెట్టారు. అయితే సోనాల్ ఇటీవల హాలీడే ట్రిప్ కోసం కొన్ని రోజులు దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది.

