ETV Bharat / sports

వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం- నేరుగా సెమీఫైనల్‌లోకి ఎంట్రీ

వరల్డ్ కప్​ 2025- వెస్టిండీస్​పై భారత్​ విక్టరీ- ఇంటిముఖం పట్టిన వెస్టిండీస్​

India Vs West Indies
India Vs West Indies (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 10:56 PM IST

3 Min Read
Choose ETV Bharat

India Vs West Indies : ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్-8 కీలక పోరులో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి, భారత్ అధికారికంగా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో సంజూ శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

విండీస్​ను కట్టడి చేసిన బుమ్రా
టాస్ గెలిచిన భారత్​ బౌలింగ్​ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్​కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లు ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. ఓపెనర్లు షై హోప్, రోస్టన్ ఛేజ్ ఆరంభంలో మంచిగా రాణించారు. రోస్టన్ ఛేజ్ 40 పరుగులు చేయగా, షై హోప్ 32 పరగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన షిమ్రోన్ హెట్‌మయెర్ పరుగుల వేగాన్ని మరింత పెంచాడు. కేవలం 12 బంతుల్లోనే 27 పరగులు చేశాడు. ఈ సమయంలోనే వెస్టిండీస్ పరుగుల వేగానికి భారత్​ బౌలరు జస్​ప్రీత్ బుమ్రా బ్రేక్ వేశాడు. ఒకే ఓవర్​లో రెండు వికెట్లు తీసి ఆ జట్టును కట్టడి చేశాడు. షెర్ఫానె రూథర్‌ఫోర్డ్ 14 పరుగులు చేశాడు. ఇక చివరిలో జేసన్ హోల్డర్, రోవ్‌మన్ పావెల్ చెలరేగడంతో వెస్టీండిస్ 195 పరుగులు చేసింది. జేసన్ హోల్డర్ 37 పరుగులు చేయగా, రోవ్‌మన్ పావెల్ 34 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచారు. వరణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్య చెరో వికెట్ తీశారు.

సంజూ శాంసన్ విశ్వరూపం
అనంతరం 196 పరగుల లక్ష్యంతో టీమ్ఇండియా బరిలోకి దిగింది. ఆరంభంలోనే భారత్​కు ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ చెరో పది పరుగులే చేసి పెవిలియన్​కు చేరారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా నిరాశపరిచాడు. 18 పరుగలకే వెనుదిరిగాడు. భారత్​ స్కోరు 58 పరుగులే చేసింది. ఈ సమయంలో క్రీజులో ఉన్న సంజూ శాంసన్ తన బ్యాటింగ్​తో రెచ్చిపోయాడు. సంజూకు తిలక్ వర్మ జత కట్టాడు. జోరుమీదున్న ఈ జోడికి హోల్డర్​ బ్రేక్​ వేశాడు. తిలక్​ను పెవిలియన్​కు పంపించాడు. కానీ శాంసన్ మాత్రం తగ్గలేదు. హార్దిక్​తో కలిసి అప్పుడప్పుడు ఫోర్లు కొడుతూ జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. అయితే 19 ఓవర్​ రెండో బంతికి హార్దిక్​ కూడా ఔట్​ అయ్యాడు. దీంతో మ్యాచ్​ మరింత ఉత్కంఠగా మారింది.

చివరి క్షణాల్లో ఉత్కంఠ
ఆ ఓవర్​లో వచ్చిన దూబె రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో ఆఖరి ఓవర్​కు వచ్చే సరికి భారత్​కు ఏడు పరుగులు చేయాల్సి వచ్చింది. తొలి బంతిలోనే శాంసన్ సిక్స్​ కొట్టాడు. ఆ తర్వాత బంతిని కూడా బౌండరీకి తరలించి జట్టును సెమీస్​కు చేర్చాడు. శాంసన్ల కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్స్​లతో 97 పరుగులు చేశాడు.

సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో ఢీ
ఈ విజయంతో సూపర్-8 గ్రూప్ నుంచి భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో భారత్- ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ప్రదర్శన చూస్తుంటే, మరోసారి ప్రపంచకప్ ముద్దాడటం ఖాయంగా కనిపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

సూపర్ -8 గ్రూప్​-1లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడించిన ఆ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 6 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వెస్టిండీస్‌పై గెలిచిన భారత్‌ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. వెస్టిండీస్‌ (3 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లు), జింబాబ్వే (0) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.