'క్రీడా శాఖలో టీ, బిస్కెట్లు తినడమే నా పని'- TMCపై మనోజ్ మళ్లీ ఆరోపణలు
తృణముల్ కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి మనోజ్ తివారి మరోసారి తీవ్ర ఆరోపణలు- ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని ఆ రోజే అనున్నాడట!

Published : May 6, 2026 at 9:09 PM IST
Manoj Tiwari : టీమ్ఇండియా మాజీ క్రికెటర్, తృణముల్ కాంగ్రెస్ మాజీ మంత్రి మనోజ్ తివారి ఆ పార్టీపై వరుసగా రెండో రోజూ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో తమ పార్టీ ఘోర ఓటమిని చవిచూసిన అనంతరం మనోజ్ టీఎంసీతో సంబంధాలు తెంచుకున్నాడు. తాజాగా ఆ పార్టీపై, గత ప్రభుత్వంపై మరిన్ని ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ తనకు ఎలాంటి గౌరవం దక్కలేదని, ఎంతో అవమానించారని పేర్కొన్నాడు. ఈ మేరకు తన ఫేస్బుక్లో ఓ వీడియో షేర్ చేశాడు.
అనేక ఆటంకాలు!
మమత హయాంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్లే తన పనికి అనేక విధాలుగా ఆటంకాలు కలిగించారని మనోజ్ అన్నాడు. 'గత ఐదేళ్లుగా నా పనికి ఎలా ఆటంకాలు ఎదురయ్యాయో ఈ వీడియోలో వివరించాలని అనుకుంటున్నా. అరూప్ బిస్వాస్ (టీఎంసీ నాయకుడు, మాజీ మంత్రి) నన్ను పని చేయకుండా అడ్డుకున్నారు. నేను స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చాను. అందుకే రాష్ట్రంలో క్రీడల కోసం ఎంతో చేయాలని అనుకున్నాను. కానీ నన్ను ఏ పనీ చేయనిచ్చేవారు కాదు. క్రీడా శాఖలో టీ, బిస్కెట్లు తినడం తప్ప నాకు చేయడానికి ఏ పనీ ఉండేది కాదు'
'ఏ కార్యక్రమాలకు కూడానన్ను ఆహ్వానించలేదు. డ్యూరాండ్ కప్ సమయంలో నేను మైదానంలోనే ఉన్నప్పటికీ, అరూప్ బిస్వాస్ నా ఇమేజ్ను సహించలేకపోవడంతో నన్ను వేదికపైకి ఆహ్వానించలేదు. ఆ ప్రభుత్వంలో పదేపదే నాకు అవమానమే జరిగింది. అందుకే నేను మెస్సీ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. ఏదో తీవ్రమైనది జరగబోతోందని నాకు అనిపించింది. రాష్ట్రంలోని క్రీడాభిమానులందరూ అరూప్ బిస్వాస్ తీరు వల్ల అవమానానికి గురవ్వడం మీరు చూసే ఉంటారు. కేవలం అరూప్ బిస్వాస్ కారణంగానే మెస్సీ 5-10 నిమిషాల్లోనే కార్యక్రమం నుంచి వెళ్లిపోయాడు గత ఐదేళ్లుగా క్రీడా శాఖలో నేను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నానో మీరు ఊహించగలరు'
'అయితే దేవుడు ఏది చేసినా అది మన మంచికే చేస్తాడని నేను భావిస్తాను. ఈ సంకుచిత మనస్తత్వం గల ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించారు. వాళ్లు ప్రజల కోసం కాకుండా తమ స్వార్థం కోసం పనిచేశారు. అయితే నా సొంత నియోజకవర్గం శివపుర్ కోసం చాలా చేయాల్సింది ఉందని, నేను క్యాబినెట్ సమావేశాల్లో పదేపదే గొంతు విప్పాను. ఈ విషయాన్ని ఒకరోజు ముఖ్యమంత్రితో ప్రస్తావించినప్పుడు, "నీకు చేయడానికి వేరే పనేమీ లేదా?" అని ఆమె నా ముఖం మీదే చెప్పేశారు. నేను చెప్పాలనుకున్నది వివరించడానికి ఆమె నాకు 20 సెకన్లు కూడా సమయం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అబద్ధపు వాగ్దానాలపై ఆధారపడి ఉంది. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని ఆ రోజే నేను గ్రహించాను' అని మనోజ్ వివరించాడు.
#WATCH | Former West Bengal Sports Minister Manoj Tiwary says, " in this video, i want to explain how my work has been hindered over the past five years. i want to share this. arup biswas (tmc leader and former minister) prevented me from working. i come from the sports world and… pic.twitter.com/isM4CMyRe1
— ANI (@ANI) May 6, 2026
రూ.5 కోట్లు డిమాండ్ చేశారు!
కాగా, తాజా ఎన్నికల్లో టీఎంసీ పార్టీ టికెట్ కోసం రూ.5 కోట్లు డిమాండ్ చేశారని మనోజ్ రీసెంట్గా చెప్పాడు. డబ్బులిచ్చేందుకు తాను నిరాకరించినందుకే పార్టీ అతడికి టికెట్ ఇవ్వలేదని అన్నాడు. అలాగే ఈ ఎన్నికల్లో పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించిన వాళ్లకే టికెట్లు ఇచ్చారని తెలిపాడు. కనీసం 70 - 72 మంది అభ్యర్థులు టికెట్ల కోసం దాదాపు రూ. 5 కోట్ల నగదు చెల్లించారని చెప్పాడు. అయితే మనోజ్ చేసిన ఆరోపణలపై తృణముల్ స్పందించలేదు.
2021లోనే ఎమ్మెల్యే!
కాగా, 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మనోజ్ టీఎంసీలో జాయిన్ అయ్యాడు. ఆ ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో హౌరా జిల్లా శివ్పుర్ స్థానంలో పోటీ చేశాడు. బీజేపీ అభ్యర్థి రతిన్ చక్రవర్తిపై 30వేలకు పైచిలుకు ఓట్ల మెజార్టీతో మనోజ్ విజయం సాధించాడు. అనంతరం మంత్రిగా అవకాశం దక్కింది. మమతా బెనర్జీ కేబినెట్లో క్రీడాశాఖ మంత్రిగానూ పని చేశాడు.
'టికెట్ కోసం రూ.5 కోట్లు డిమాండ్' - TMCని వీడిన మాజీ క్రికెటర్- దీదీపై సంచలన ఆరోపణలు!
బీజేపీ పార్టీ MLAగా మాజీ క్రికెటర్- TMC అభ్యర్థి క్లీన్ బౌల్డ్- బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు

