"పూజ" చేసేటప్పుడు నేల మీద కూర్చోకూడదంటారు ఎందుకు? - మరి ఎలా చేస్తే మంచి ఫలితాలు?
ఏ ఆసనం మీద కూర్చొని పూజ చేస్తే మంచిది? - ఆధ్యాత్మికవేత్త చిదంబరశాస్త్రి వివరిస్తున్నారిలా!

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 30, 2026 at 1:20 PM IST
Which Asanam is Good for Pooja : మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు, ఆలయాల్లో వ్రతాలు, హోమాలు చేసే సమయంలో ఆసనం మీద కూర్చోవడం ఆనవాయితీ. "ఆసనం" అంటే కూర్చోడానికి వాడే పీట, చాప లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే నేల మీద పరచుకునే వస్త్రాలు వంటివి. హిందూ సంప్రదాయం ప్రకారం ఏ దైవ కార్యక్రమాన్ని చేస్తున్నా, కటిక నేలమీద కూర్చోకూడదు. అందుకు బదులుగా ఏదో ఒక ఆసనం తప్పనిసరిగా వేసుకోవాలి. అంతేకాదు, ఆసనం లేకుండా చేసే పూజలు, జపతపాలు నిష్ఫలితాలిస్తాయంటున్నారు ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ అన్నదానం చిదంబరశాస్త్రి. అందుకే, ఏదో ఒక ఆసనం మీద కూర్చొని పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెబుతున్నారు. మరి, ఇంతకీ ఏ ఆసనంపై కూర్చొని పూజ చేస్తే మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయాల్లో పూజలో ఆసనానికి చాలా ప్రాధాన్యం ఉందంటున్నారు ఆధ్యాత్మికవేత్త చిదంబరశాస్త్రి. పురాణాలలో వివరించిన ప్రకారం అన్నింట్లోకీ "దర్భాసం" ఎంతో విశిష్టమైనదని చెబుతున్నారు. భూమ్యాకర్షణ శక్తి సాధకుడి ప్రాణశక్తిని గుంజుతుందని, అందువల్ల పూజా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు నేల మీద కూర్చోకూడదని, అందుకే తగిన ఆసనం మీద కూర్చోవాలని తెలియజేస్తున్నాయి ధర్మగ్రంథాలు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం, 'కేతువు' నవగ్రహాల్లో మోక్షకారకుడు. అందుకు కారణం కేతు గ్రహానికి బ్రహ్మదేవుడు అధిదేవత. కేతువు అనుగ్రహానికి సూచించిన సమిధ "దర్భ". అందుకే, దర్భలతో ఆసనాన్ని అల్లుతుంటారు. కాబట్టి, అలా అల్లిన దర్భాసనంపై కూర్చుని పూజ, జప, తప, ధ్యానాదులు చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుందంటున్నారు చిదంబరశాస్త్రి. అలా చేయడం వల్ల గ్రహదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయట. అలాగే, కేతువు అనుగ్రహంతో తపస్సు, మంత్ర కుశలత, బ్రహ్మజ్ఞానం, బుద్ధికుశలత వంటివి సిద్ధిస్తాయంటున్నారు. అయితే, కొన్నిసార్లు పూజాదికాలకు సిద్ధమైనప్పుడు ఆసనాలు అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కనీసం ఒక్క దర్భపుల్లనైనా నేలపై ఉంచి, దాని మీద శుభ్రని తెల్లని వస్త్రం పరిచి పూజకు ఉపక్రమించడం మంచిదంటున్నారు.
దర్భాసనంపై కూర్చుని స్త్రీలు పూజ చేయవచ్చా?
స్త్రీలు పూజ చేసేటప్పుడు దర్భాసనం ఉపయోగించకూడదని చెబుతుంటారు కానీ అది అపోహ మాత్రమే అంటున్నారు ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ అన్నదానం చిదంబరశాస్త్రి. అయితే, పూజా సమయంలో మహిళలు దర్భాసనం ఉపయోగిస్తున్నట్లయితే దాని మీద తప్పనిసరిగా మరో ఆసనం ఉండేలా చూసుకోవాలంటున్నారు. అంటే తెల్లటి వస్త్రం వంటిదాన్ని పరుచుకుని కూర్చోవాలని చెబుతున్నారు. ఇంట్లో మాత్రమే కాదు దేవాలయాలకు వెళ్లినప్పుడు కూడా ధ్యానం, పూజ వంటివి చేస్తున్నప్పుడు ఏదో ఒక ఆసనాన్ని వాడటం( కనీసం - వస్త్రం అయినా పరుచుకోవడం) తప్పనిసరి అంటున్నారు. అంతేకానీ, నేలమీద కూర్చుని జపతపాల్ని చేస్తున్నప్పుడు భూమి వాటిని ఆకర్షించడం వల్ల సరైన ఫలితాలు అందవని చెబుతున్నారు. అందుకే, ఎవరైనా పూజ, ధ్యానం ఏది చేస్తున్నా సరే ఏదో ఒక ఆసనం ఉండేలా చూసుకోవడం మంచిదని సూచిస్తున్నారు ఆధ్యాత్మికవేత్త అన్నదానం చిదంబరశాస్త్రి.
ముందురోజు పూజా సామగ్రిని శుభ్రం చేసి పెట్టుకోవచ్చా?
ఏ రోజుకారోజు పూజా సామగ్రిని శుభ్రం చేసుకోవాలని అంటారు. టైమ్ లేనప్పుడు ముందురోజు వాటిని శుభ్రం చేసుకుని పెట్టుకోవచ్చా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సమయం ఉంటే సరే, ఒకవేళ తగినంత టైమ్ లేనప్పుడు ముందురోజు పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవచ్చంటున్నారు ఆధ్యాత్మికవేత్త చిదంబరశాస్త్రి. అలాగే, పూజా సామగ్రి అంటే హారతి పళ్లెం, కుందులు వంటివన్నీ మర్నాటి పూజకు ముందే శుభ్రం చేసుకుని పెట్టుకోవచ్చని చెబుతున్నారు.
ముఖ్యంగా పండుగలు, వ్రతాల టైమ్లో అన్నీ ఇలా సిద్ధం చేసుకుంటే ఏ హడావుడీ, ఒత్తిడీ లేకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో పూజను పూర్తిచేసుకోవచ్చంటున్నారు. కాబట్టి, ఈ విషయంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదని సూచిస్తున్నారు. అలాగే, నిర్మాల్యం - అంటే పూజలో ఉపయోగించిన పూల మాలలూ, ఇతర పూలూ తప్పక తీసేయాలని చెబుతున్నారు. అవి ఎంత తాజాగా అనిపించినా అస్సలు ఉంచకూడదంటున్నారు. ఎందుకంటే, భగవంతుడికి నిర్మాల్యం శిరోభారంగా చెబుతారంటున్నారు ఆధ్యాత్మికవేత్త అన్నదానం చిదంబరశాస్త్రి.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం .
అభిషేకం చేస్తే నీలిరంగులో మారే పాలు- రాహు దోషాలను తొలగించే నవగ్రహ క్షేత్రం!
శివలింగంపై దర్శనమిస్తున్న "వేంకటేశ్వరుడు" - ఒక్కసారి దర్శిస్తే పాపాలు తొలగిపోతాయట!

