"శివరాత్రి" పూజా విధానం - ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఏం చేయాలంటే!
శివరాత్రి నాడు పరమేశ్వరుడిని ఎలా పూజించాలి? - జ్యోతిష, వేద పండితులు చెప్పిన నియమాలు మీకోసం!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 14, 2026 at 4:56 PM IST
Maha Shivaratri 2026 : హిందూ పండగల్లో మహా శివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది. రేపు అనగా (ఆదివారం ఫిబ్రవరి 15,2026) నాడు ఈ పర్వదినం. ఈ సందర్భంగా పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఉపవాసాలు, జాగారాలు చేస్తుంటారు. మరి ఈ రోజున ఈశ్వరుడిని ఎలా పూజించాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? ఏ మంత్రాలు చదువుకోవాలనే విషయాన్ని ప్రముఖ జ్యోతిష్యడు మాచిరాజు కిరణ్ కుమార్ తెలియజేశారు. ఇవి పాటిస్తూ శివ పూజ చేయడం వల్ల సంవత్సరం మొత్తం శివానుగ్రహం మీపై ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
శివ పూజ సమయం : శివరాత్రి రోజు ఏ సమయంలోనైనా శివుడిని పూజించవచ్చని తెలిపారు. అలాగే దేవాలయాలకు వెళ్లొచ్చని చెప్పారు. కానీ శాస్త్రాల్లో చెప్పిన దాని ప్రకారం ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం అంటే సోమవారం ఆరు గంటల వరకు అద్భుతమైన కాలమని పేర్కొన్నారు. ఇందులో కూడా ఇంకా బ్రహ్మండమైన సమయం ఉందని అదే లింగోద్భవ కాలమన్నారు. ఈ సమయం అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమై 12 గంటల 40 నిమిషాల వరకు ఉండనుంది. ఈ సందర్భంగా ఇంట్లోనైనా ఈశ్వరుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం కలుగుతుందని తెలియజేశారు.

శివపూజ చేసేందుకు నిమయమాలు :
- భస్మాధారణ (విభూది) ధరించాలి. ఇందుకోసం శివపురాణంలో దీనిని ఏయే చోట్ల ధరించాలో చెప్పారు. గృహస్తులు మోకాళ్లకు పై భాగంలో అంటే నుదురు, వక్షస్థలంలో, భుజాలకు, నాభి ప్రాంతంలో విభూదిని ధారణ చేయాలి. దీని వల్ల శివానుగ్రహం కలుగుతుంది.
- భస్మం అంటే గోమయాన్ని కాల్చిన దానిని భస్మంగా లేదా విభూదిగా పిలుస్తారు. ఇతర పదార్థాలతో కాల్చిన భస్మం అంటారు. అన్నింటికంటే ఆవు పేడను మండించినప్పుడు దాని నుంచి వచ్చిన భస్మాన్ని ధరిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
- ఈ రోజున ఒక్క బిల్వదళంను అయినా శివుడికి సమర్పిస్తారు. అయితే ఈ సందర్భంగా మారేడు చెట్టు దగ్గర కొన్ని విధివిధానాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మారేడు చెట్టు సమీపంలో ఒక శివ భక్తుడి అన్నదానం చేస్తే కోటి మందికి శివ భక్తులకు అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుంది.
- ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవారు మారేడు మొక్క సమీపంలో ఆవు పాలతో చేసిన పాయసాన్ని శివ భక్తుడికి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల జన్మజన్మల దరిద్రాలన్నీ పోతాయి. అలాగే చెట్టు కింద దీపం పెట్టడం, శివుడి ఫోటో ఉంచి పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.
- శివరాత్రి పూజలో తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. అదేవిధంగా తెల్ల పుష్పాలతో పూజిస్తే అనుగ్రహం ఎక్కువగా కలుగుతుంది. గురువులకు పాద నమస్కారం చేసినా పుణ్యం లభిస్తుంది.
శివరాత్రి వత్రం :
- సాయంత్రం ఆరు తర్వాత నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని అభ్యంగనం స్నానం చేయాలి. ఆ తర్వాత విభూది రేఖలను ధారణ చేయాలి.
- "శివరాత్రి వ్రతం కరిష్యే తన్మహ ఫలం నిర్విగ్న మస్తు తత్వ ప్రసాదత్ జగత్పతే" అనే మంత్రాన్ని జపించాలి.
- ఆ తర్వాత లింగోద్భావ సమయంలో ఇంట్లో పంచామృతాలతో అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు నమక్ చమక్ మంత్రంతో పూజించాలి. లేదంటే "శివాయ గురువే నమః" అనే మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేయాలి.
శివరాత్రి జాగరణ : జాగరణ పేరుతో వివిధ పనుల్లో ఉండరాదు. కేవలం శివ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూ జాగారం చేయాలి.
ఉపవాసం : శివుడి గురించి ఆలోచించడమే నిజమైన ఉపవాసం. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు శక్తిమేర ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండొచ్చు.
శివరాత్రి రోజు పఠించాల్సిన మంత్రాలు :
1. జ్వాలాయ నమః, జ్వాల లింగాయ నమః
2. ఆత్మాయ నమః, ఆత్మ లింగాయ నమః
3. పరమాయ నమః, పరమ లింగాయ నమః
పరిహారాలు : ఎర్రటి ప్రమిదల్లో దీపారాధన చేసి దారిద్ర్య దహన శివ స్తోత్రం చదివితే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడొచ్చు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మహాశివరాత్రి రోజు ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా?
మహాశివరాత్రి 'లింగోద్భవ కథ'- ఈ ఒక్క స్టోరీ వింటే చాలు సకల పాపాలు తొలగిపోతాయ్!

