ప్రజలెప్పుడూ బాధపడాలని జగన్ కోరుకుంటారు - అందుకే ఆ వ్యాఖ్యలు: ఎంపీ కేశినేని
వైఎస్ జగన్, సాక్షి పత్రిక చెప్పేవన్నీ అబద్ధాలేనన్న ఎంపీ - రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రూ.925 కోట్లను సొంత మనుషులకే కట్టబెట్టారని విమర్శించిన కేశినేని శివనాథ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 9, 2026 at 5:12 PM IST
MP Kesineni Chinni Fires on YS Jagan: అమరావతిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మండిపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్, అతని సొంత పత్రిక సాక్షి ఆంధ్ర ప్రజల కళల రాజధాని అమరావతిపై విషం కక్కుతున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.
జగన్, సాక్షి పత్రిక చెప్పేవన్నీ అబద్ధాలని ఎంపీ శివనాథ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మరని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రూ.925 కోట్లు జగన్ తన సొంత మనుషులకు కట్టబెట్టారని తెలిపారు. జగన్ హయాంలోనే ఆ పనులు నిలిచిపోయాయని శివనాథ్ పేర్కొన్నారు. ఏపీ రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యలో కట్టాలని జగన్ చెబుతున్నారని వివరించారు.
జగన్ మాట్లాడే మాటలు హాస్యాస్పదం: జగన్కు ప్రస్తుత రాజధాని విజయవాడ, గుంటూరుకి సమీపంలో కృష్ణానది తీరంలో ఉందన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ బాధపడాలని జగన్ కోరుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి, విజయవాడ, గుంటూరులను కలిపి మహా నగరం నిర్మించేందుకు సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారని కేశినేని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు.
25 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం? హైదరాబాద్ని అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ఎంపీ స్పష్టం చేశారు. చరిత్రలో అత్యంత హీనమైన ఓటమి వైఎస్సార్సీపీదని కేశినేని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ చరిత్ర ముగిసిపోయిందని ఎంపీ జోస్యం చెప్పారు. మరో 25 ఏళ్ల పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే అప్పటి వరకు చంద్రబాబు ఉంటారా? అని జగన్ అనడం సిగ్గుచేటని ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గించారని ఎంపీ శివనాథ్ తెలిపారు.
జగన్ మానసపుత్రిక సాక్షి: పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్రెడ్డి మాట్లాడిన మాటలు ఎంతో వికృతంగా ఉన్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. జగన్ మానసపుత్రిక సాక్షి పత్రికని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఆ పత్రికలో చెప్పేవన్నీ అబద్ధాలేనని కేశినేని శివనాథ్ ఆరోపించారు. కానీ ప్రజలు ఈ అవాస్తవాలను నమ్మే పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి గానీ, అమరావతి రాజధాని గురించి గానీ వైఎస్ జగన్ మాట్లాడే మాటలు ఎంతో దారుణంగా ఉన్నాయి. కానీ అతని మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరనే విషయాన్ని గ్రహించాలని గుర్తు చేశారు. ఇలాంటి వికృత మనస్తత్వం కలిగిన జగన్కు వీటిపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు.
"వైఎస్ జగన్, సాక్షి పత్రిక చెప్పేవన్నీ అబద్ధాలే. వైఎస్సార్సీపీ అధినేత జగన్ మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రూ.925 కోట్లు జగన్ తన సొంత మనుషులకు కట్టబెట్టారు. జగన్ హయాంలోనే ఆ పనులు నిలిచిపోయాయి. ఏపీ రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో కట్టాలని జగన్ చెబుతుండటం హాస్యాస్పదం". -కేశినేని శివనాథ్, విజయవాడ ఎంపీ
వరద బాధితులకు జగన్ ప్రకటించిన రూ. కోటి ఎక్కడ?: ఎంపీ కేశినేని శివనాథ్
కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్తో పాటు బాధ్యులందర్నీ అరెస్టు చేయాలి: ఎంపీ కేశినేని

