రాజధాని అమరావతిపై మిగిలి ఉన్న అక్కసు ఇవాళ జగన్ కక్కేశారు: కూటమి నేతలు
అమరావతిపై జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన కూటమి నేతలు - జగన్ చేపట్టింది రాయలసీమ తెఫ్ట్ ఇరిగేషన్ అంటూ ఆగ్రహం - అధికారంలో ఉండగా గుర్తుకు రాని రాయలసీమ ఇవాళే గుర్తుకొచ్చిందా అని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 10:31 PM IST
Alliance Leaders Fire on YS Jagan Comments: జగన్ చేపట్టింది రాయలసీమ తెఫ్ట్ ఇరిగేషన్ అని ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. జగన్ మాటలు వింటే వేదాలు వల్లించే దెయ్యాలు కూడా సిగ్గుపడతాయ్ అన్నారు. రాజధాని అమరావతిపై మిగిలి ఉన్న అక్కసు కూడా ఇవాళ జగన్ కక్కేశాడని మండిపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యేకు అధికారంలో ఉండగా గుర్తుకు రాని రాయలసీమ ఇవాళే గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. చేసిన పని చెప్పుకోవడం కూడా చంద్రబాబుకు రాదని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ద్వారా జగన్ చేస్తానని చెప్పింది ముచ్చుమర్రి ద్వారా చంద్రబాబు చేసి చూపించారని వెల్లడించారు. తన బాధను ప్రజల బాధగా ఎవ్వరూ చెప్పలేనన్ని అసత్యాలు జగన్ చెప్పాడని దుయ్యబట్టారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు డీపీఆర్ తయారు చేసేందుకు మాత్రమే పనులు చేస్తున్నట్లు ఎన్జీటీకి సీఎస్తో జగన్ అఫిడవిట్ దాఖలు చేయించారన్నారు. డీపీఆర్ తయారీ పేరిట రూ.900 కోట్లు నిధులు మళ్లించారని ఆరోపించారు. డీపీఆర్ స్కీం అని ఒకసారి, చెన్నైకి తాగునీరు ఇచ్చే స్కీం అని మరోసారి పొంతన లేని స్టేట్మెంట్లు ఇచ్చింది జగనే అని విమర్శించారు. 102 రాయలసీమ ప్రాజెక్టులు నిలుపుదల చేస్తూ గత ప్రభుత్వంలో ఉత్తర్వులు జారీ చేయలేదా అని నిలదీశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై కేసులు వేసింది జగన్ మిత్రులైన బీఆర్ఎస్ నేతలే అని తెలిపారు.
సీమలో ఒక్క ప్రాజెక్టు కూడా అడుగు ముందుకు కదలకుండా చేసిన జగన్ ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రెడిట్ చోరీ అంటున్న జగన్కు రాష్ట్రం పట్ల ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటని నిలదీశారు. ప్రజల కోసం పనిచేస్తే వారే క్రెడిట్ ఇస్తారని జగన్ గ్రహించాలన్నారు. భారతదేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయని జాతీయ మీడియా చెప్తుంటే, పరిశ్రమలు పారిపోతున్నాయ్ అని జగన్ చెప్పడం విడ్డూరమన్నారు. సొంత ప్రాంతంలో గండికోట బాధితుల వద్దకు వెళ్లే ధైర్యం జగన్కు ఉందా అని ప్రశ్నించారు.
రైతులను అవమానించింది జగనే: అమరావతిపై జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రులు కొల్లు రవీంద్ర, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తప్పుబట్టారు. గతంలో అమరావతికి మద్దతిచ్చి అధికారంలోకి వచ్చాక 3 ముక్కలాట ఆడారని ఇంక పాదయాత్ర చేస్తున్న మహిళా రైతులను అవమానించింది జగనేనని అన్నారు. రాజధాని రైతులకు సంకెళ్లు వేసి రోడ్లపై నడిపించి అవమానించారని జగన్ ఎన్ని డ్రామాలాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డలకు తన పేరు వేసుకున్నట్లు జగన్ తీరు ఉందని మంత్రి జనార్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాయలసీమకు జగన్ చేసిన ద్రోహాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టే గత ఎన్నికల్లో చెప్పాల్సిన బుద్ధి చెప్పారన్నారు. కమీషన్ల కోసం కుందు పనుల పేరిట రూ.1500 కోట్లు దుర్వినియోగం చేసారని మండిపడ్డారు.
విచ్చలవిడిగా ప్రజా ధనం దోపిడీ: రాయలసీమకు దుష్టశక్తిలా అడ్డుపడితే ప్రజలు నాలుకలు కోస్తారని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు. సీమ ప్రజల ఆశలను ఫణంగా పెట్టి జగన్ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడని మండిపడ్డారు. శవాల మీద చిల్లర ఎరుకున్నట్లుగా జగన్ తీరుందని విమర్శించారు. సీమ ప్రాజజెక్టుల పేరుతో విచ్చలవిడిగా ప్రజా ధనం జగన్ దోచేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఫ్ట్లకు విద్యుత్ బిల్లులు కూడా కట్టలేదని ధ్వజమెత్తారు.
జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు - అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి నారాయణ
వైఎస్సార్సీపీ కుట్రలను నేతలు సమర్థంగా తిప్పికొట్టాలి: మంత్రి లోకేశ్

