గ్లోబల్ సౌత్లో మొదటిసారి - దేశ రాజధాని దిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్
భారత్లో దిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 - గ్లోబల్ సౌత్లో మొదటి ఏఐ సదస్సు, సర్వజన హితాయ,సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ అనే థీమ్తో జరుగుతోన్న ఏఐ సమ్మిట్

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 17, 2026 at 2:20 PM IST
Idi Sangathi Story on AI Impact Summit 2026: ప్రస్తుత ప్రపంచంలో ఏఐ గురించి తెలియనివారంటూ ఉండరు. మొబైల్ యూజర్ల నుంచి మొదలు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కృత్రిమ మేధ విరివిగా వాడేస్తున్నారు. అంతేనా ఐదేళ్ల చిన్నారులతో పాటు అవ్వతాతలు సైతం ఈ సాంకేతికత గురించి క్రమంగా తెలుస్తోంది అనడంలో సందేహం లేదు. చెప్పాలంటే సమస్య ఏదైనా సరే దానికి పరిష్కార మార్గం ఏఐ చూపిస్తోంది అనే స్థాయికి చేరుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం. ఈ నేపథ్యంలో ఏఐ వేగవంతమైన వృద్ధి, వివిధ రంగాల్లో దాని ప్రభావం, ఉద్యోగాల కల్పన తదితర అంశాల గురించి చర్చించడానికి ఏటా ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సారి భారత్ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరుగుతోంది. మరి, ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమేంటి? ఏయే కార్యక్రమాలు జరుగు తున్నాయి? ఏ దేశాల ప్రముఖులు పాల్గొంటున్నారు? సదస్సు ప్రత్యేకతలు వంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్: ప్రస్తుతం ఏఐ హవా నడుస్తోంది. అవసరం చిన్నదైనా, పెద్దదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తలపు తడుతున్న పరిస్థితి నెలకొంది. ఒకరకంగా చెప్పాలంటే అన్ని వ్యవస్థలపై ఏఐ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ తరుణంలో దేశ రాజధాని దిల్లీలోని భారత్ మండపం వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ప్రాధాన్యత సంతరించుకుంది. 16 నుంచి 20 వరకు జరుగుతున్న ఈ సమ్మిట్లో ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు.
అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏఐ రంగంలో పురోగతి సాధించాలని భావిస్తోంది భారత్. అందులో భాగంగానే వివిధ రంగాల్లో ఏఐ వినియోగంపై మన ప్రతిభను ప్రదర్శించడం, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు పెంచడం, విస్తృతం అవుతున్న అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
'సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ అనే థీమ్తో ఏఐ సమ్మిట్ జరుగుతోంది. అంటే అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందంమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వాతో పాటు అనేకమంది ప్రపంచ నాయకులు ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు హాజరు కానున్నారు. దాదాపు 45 దేశాల నుంచి మంత్రుల ప్రతినిధులు పాల్గొనున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి సహా అనేక అంతర్జాతీయ సంస్థల నుంచి ఉన్నతాధికార్లకు చెందిన ప్రతినిధులు సమ్మిట్కు వస్తున్నారు.
అంతేకాకుండా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్, డీప్మైడ్ టెక్నాలజీస్ సీఈవో డెమిస్ హస్సాబిస్, ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమొడె, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్స్మిత్తో పాటు ఇంకా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. మొత్తంగా 2.5 లక్షల మంది ఈ సదస్సులో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఏఐపై అంతర్జాతీయ ఆసక్తి, తీసుకొస్తున్న మార్పులు, ప్రభావం, అంకుర సంస్థలు ఏర్పాటు తదితర అంశాల గురించి ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది.
అన్నిరంగాలకు విస్తరించిన ఏఐ: ఏఐ వచ్చిరావడంతోనే అన్నిరంగాలకు విస్తరించి సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో 2023 నుంచి ఏటా ఏఐ సమ్మిట్ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్నది 4వ ఏఐ సదస్సు. గ్లోబల్ సౌత్లో నిర్వహిస్తున్న మొదటి ప్రధాన అంతర్జాతీయ ఏఐ సమిట్. అందులోనూ వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో ఈ సదస్సు నిర్వహించడం దేశానికే గర్వకారణం. అయితే, మొదట యూకే లోని బ్లెచ్లి పార్క్లో ఏఐ భద్రతా సమ్మిట్ నిర్వహించారు.
వేగవంతమైన వృద్ధికి నిదర్శనమన్న మోదీ: అనంతరం 2024లో దక్షిణ కొరియాలో సియోల్, 2025లో ఫ్రాన్స్లో పారిస్ సమ్మిట్లు జరిగాయి. వీటిలో సరిహద్దు ప్రమాదాలు, భద్రతా రక్షణలు, స్వచ్ఛంద నిబద్ధతలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. భారత్ వీటికి భిన్నంగా ఏఐ అభివృద్ధి ప్రభావం, ఆర్థికవృద్ధి, సామాజిక చేరికలపై ప్రధాన్యత ఇస్తూ ప్రపంచ దేశాల దృష్టి ఆకర్షించాలని భావిస్తోంది. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ ఏఐ సదస్సు భారత్ వేగవంతమైన వృద్ధికి నిదర్శనం అని పేర్కొన్నారు.
దీనివల్ల డిజిటల్ సదుపాయాల కల్పన, శక్తిమంతమైన స్టార్టప్ల ఏర్పాటు, అత్యాధునిక పరిశోధనలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భారత్ బాధ్యత మరింత పెరగనుందన్నారు. సదస్సు థీమ్పై మాట్లాడుతూ..ప్రపంచదేశాల పురోగతి కోసం ఏఐ ఉపయోగించుకోవడంలో ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది వివరించారు. 5 రోజుల పాటు జరిగే సదస్సులో ప్లీనరి సెషన్లు, సదస్సు ప్రధాన ఉద్దేశానికి సంబంధిత అంశాలు, అధికారిక చర్చలు, భారీ స్థాయి ఎగ్జిబిషన్లు సహా మొత్తంగా 700కు పైగా సెషన్లు జరిగే అవకాశం ఉంది.ఇందులో భాగంగా 500 పైగా ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటం గమనార్హం.
దీని ఆధారంగానే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్: వీటిలో ఏఐ భద్రత, పాలన, నైతిక వినియోగం, డేటా రక్షణతోపాటు సార్వభౌమ ఏఐపై భారత్ విధానం, వ్యూహాత్మక రంగాలకు స్వదేశీ పునాది నమూనాల అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, ఏఐ భవిష్యత్ పనిపై విస్తృతంగా చర్చించనున్నారు. దేశ ఏఐ నిబంధనావళి, ఆవిష్కరణల సమతౌల్యం, నియంత్రణ, ఇటీవల సవరించిన ఐటీ నిబంధనలు, ఏఐ సృష్టించిన కంటెంట్పై ఎలా వ్యవహరించాలి, డీప్ఫేక్లు, ఏఐతో తప్పుడు సమాచార వ్యాప్తి వంటి అనేక అంశాల పైన చర్చలు జరగనున్నాయి.
అంతేకాకుండా ప్రపంచంలోనే అతి పిన్న వయస్కులైన శ్రామిక శక్తి కలిగిన దేశాల్లో మనదేశం ఒకటి. అంటే దేశంలో 35 ఏళ్లలోపు వారు 65% మంది ఉన్నారు. వీరంతా ఏఐ నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే భారత్ తిరుగుండదు అనడంలో అతిశయోక్తి లేదు. దాంతో భారత్లో ఏఐ సమ్మిట్ జరగడం సానుకూలమైన అంశమని నిపుణులు చెబుతున్నారు.
మొత్తం 3 ప్రధాన సూత్రాలు, 7 అనుసంధానిత చక్రాల ఆధారంగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతోంది. 3 సూత్రాల్లో ప్రజలు, ప్లానెట్, పురోగతి ఉన్నాయి. అలాగే, మానవ మూలధనం, సామాజిక సాధికారత కోసం సమ్మిళితత్వం, సురక్షితమైన విశ్వసనీయమైన ఏఐ తో పాటు ఆవిష్కరణ సామర్థ్యం, సైన్స్, ఏఐ వనరుల ప్రజాస్వామీకరణ, ఆర్థిక వృద్ధి సామాజిక శ్రేయస్సు కోసం ఏఐ వంటి 7 చక్రాలు రూపొందించారు. అయితే, ఏఐ సమ్మిట్లో చివరి రెండు రోజులు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి.
సమ్మిట్ను ప్రారంభించనున్న మోదీ: ఇక నాలుగవ రోజు ప్రధాని మోదీ అధికారికంగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను ప్రారంభించనున్నారు. సమ్మిట్ను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత సదస్సులో ఏర్పాటు చేసిన ఎక్స్పోను సందర్శించనున్నారు. అనంతరం ఏఐ భవిష్యత్తుపై ప్రపంచ దేశాలు తీసుకోవాల్సిన బాధ్యత, వ్యూహాత్మక ప్రాధాన్యత, పెట్టుబడి మార్గాలు తదితర అంశాలపై దిగ్గజ కంపెనీల సీఈవో లు, ప్రభుత్వాధినేతలు, ఇన్వేస్టర్లతో ప్రధాని చర్చిస్తారు.
ఆ తర్వాత దేశంలో ఏఐ వృద్ధి, సంబంధింత అవకాశాలపై ప్రముఖులకు ప్రధాని మోదీ వివరిస్తారు. అయితే ఇప్పటికే ఏఐ వినియోగిస్తున్న దేశాల్లో భారత్ ముందు వరసలో ఉంది. దీంతో భారతదేశంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సు దేశాభివృద్ధిలో పెద్ద ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ నిపుణులు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు.
'ప్రపంచం భారత్కు వస్తోంది' -ఇండియా ఏఐ సమ్మిట్పై ప్రధాని మోదీ
ప్రత్యామ్నాయాల వైపు రైల్వే - హైడ్రోజన్, ఎల్ఎన్జీలతో చుక్చుక్

