పచ్చని కోనసీమలో బ్లో అవుట్స్ చిచ్చు - తరచూ గ్యాస్ లీకేజీలతో పెను ప్రమాదాలు
ఇరుసుమండ ప్రాంతంలో భారీ బ్లో అవుట్ - ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో ఒక్కసారిగా గ్యాస్ లీక్ - మరమ్మతులు చేసే క్రమంలోనే బ్లో అవుట్ - కృష్ణా-గోదావరి డెల్టా బేసిన్లో ఓఎన్జీసీ కార్యకలాపాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 6, 2026 at 12:23 PM IST
Gas Blowouts in Konaseema: పచ్చని పరిసరాలు, ప్రశాంత వాతావరణంలో ఉండే కోనసీమ. కానీ ఈ పచ్చని నేలలో ఎర్రని మంటలు ఎగిసి పడుతున్నాయి. ఎవరినో ఒకరిని పొట్టన పెట్టుకోవడమో లేదంటే భయ భ్రాంతులకు గురి చేయడమో చేస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి కాదు. తరచు ఇవే మంటలు, లీకేజీలు కలవరం కలిగిస్తున్నాయి. బ్లో అవుట్ల గురించే ఈ ప్రస్తావన అంతా. ఇరుసు మండ ప్రాంతంలో జరిగిన ఘటన అందుకు ఓ ఉదాహరణ. ఉన్నట్టుండి గ్యాస్ లీక్ కావడం, మంటలు ఎగిసి పడడం చాలా వేగంగా జరిగిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడమే కాస్త ఊపిరి పీల్చుకునే విషయం. కానీ క్రమం తప్పని ప్రమాదాలతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. అసలు ఈ ఘటనలకు కారణాలేంటి? అకస్మాత్తుగా ఈ తరహా విపత్తులు ఎందుకు ముంచుకొస్తున్నాయి?
భారీ శబ్దం, పెద్ద ఎత్తున మంటలు. తగలబడిపోయిన పచ్చని కొబ్బరి చెట్లు. అంతా గందర గోళం. కాసేపట్లోనే అక్కడ అలజడి. గ్రామం అంతా కాసేపట్లోనే ఖాళీ. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసు మండ గ్రామంలో తలెత్తిన పరిస్థితి ఇది. అక్కడి ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. ఆ క్షణం నుంచే అక్కడ అలజడి మొదలైంది. భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. అధికారులు అప్రమత్తమై వెంటనే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు చాలానే ప్రయత్నించారు.
ప్రాణనష్టం కలగకుండా ముందస్తు సూచనలు: నిజానికి ఇక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి. కాసేపటి వరకూ ఉత్పత్తిని నిలిపివేశారు. ఈ రిపేర్లు చేసే సమయంలోనే ఉన్నట్టుండి బ్లో అవుట్ అయింది. అంటే గ్యాస్ లీక్ అయింది. ఈ దెబ్బకు భారీగా గ్యాస్ బయటకు వచ్చింది. క్రూడ్ ఆయిల్తో కూడిన గ్యాస్ బయటకు రావడం వల్ల ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కాసేపట్లోనే పరిసరాలకు మంటలు వ్యాపించాయి. అటు గ్రామస్థులతో పాటు అధికారుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఎలాంటి ప్రాణనష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా అధికారులు లౌడ్ స్పీకర్స్లో సూచనలు చేశారు.
చుట్టు పక్కల ఉన్న 3 గ్రామాల ప్రజలు విద్యుత్ వాడకూడదని, స్విచ్లు ఆఫ్ చేయాలని సూచించారు. అంతే కాదు. స్టవ్లు వెలిగించకూడదని కూడా అప్రమత్తం చేశారు. ఆ వెంటనే గ్రామస్థులను ఇళ్లు ఖాళీ చేయించారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఓఎన్జీసీ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు ఓఎన్జీసీ కూడా ఓ లేఖ విడుదల చేసింది. గ్యాస్ లీక్ మారుమూల ప్రాంతంలో జరిగిందని, మంటలను అరికట్టేందుకు అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది.
కృష్ణా-గోదావరి డెల్టా బేసిన్లో విస్తృత కార్యకలాపాలు: ఇలా ఉన్నట్టుండి గ్యాస్ లీక్ అయ్యి మంటలు ఎగిసి పడడాన్ని టెక్నికల్గా బ్లో అవుట్ అని పిలుస్తారు. ఇది ఎలా జరుగుతుంది, కారణాలేంటి? అని తెలుసుకునే ముందు అసలు కోనసీమలో ఓఎన్జీసీకి సంబంధించిన ఆపరేషన్స్ గురించి తెలుసుకోవాలి. కృష్ణా-గోదావరి డెల్టా బేసిన్లో ఓఎన్జీసీ విస్తృత కార్యకలాపాలు జరుగుతుంటాయి.
రాజమహేంద్రవరంలోని లాలా చెరువు వద్ద ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. దీన్నే రాజమండ్రి ఆన్షోర్ అసెట్గా పిలుస్తారు. తూర్పు గోదావరి జిల్లాలో తాటిపాక, పసర్లపూడి, మోరి, కాట్రేనికోన, అమలాపురం వంటి ప్రాంతాలలో ప్రధాన చమురు, గ్యాస్ బావులు ఉన్నాయి. వీటి ద్వారా పెద్ద ఎత్తున గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అవుతోంది. వీటిని సముద్రంలో పైప్ లైన్స్ నెట్వర్క్ ద్వారా యానాం, మల్లవరం ప్రాంతాలకు సప్లై అవుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ చేసిన తరవాత గ్యాస్ను నేషనల్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్స్ కు సరఫరా చేస్తారు. క్రూడ్ ఆయిల్ను నిర్దేశిత ప్రాంతాలకు పంపించి రిఫైన్ చేస్తారు. ఇదీ క్లుప్తంగా ఇక్కడ జరిగే ప్రక్రియ.
2014 నాటి విషాదాన్ని మర్చిపోలేరు: ఈ తరహా ఘటనలు జరగడం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఇరుసుమండ ఘటనతో మరోసారి ఈ చర్చ మొదలైంది. తరచూ ఈ బెల్ట్లో ఇలాంటి బ్లో అవుట్స్ సంభవిస్తూనే ఉన్నాయి. వీటిలో కొన్ని తీరని ప్రాణనష్టం మిగిల్చాయి. కొన్ని జీవితాంతం వెంటాడే గాయాల్ని ఇచ్చాయి. అధికారుల నిర్లక్ష్యమో, ఇక్కడి ప్రజల దురదృష్టమో కానీ ఎప్పుడు భూగర్భం నుంచి బుడగలు వస్తాయో? ఎప్పుడు మంటలు ఎగిసి పడి ప్రాణాల్ని బూడిద చేస్తాయో తెలియక భయం భయంగా గడపాల్సి వస్తోంది. అసలు బ్లో అవుట్స్ అంటే ఏంటి? వీటిని ఎందుకు నియంత్రించ లేకపోతున్నారు? బ్లో అవుట్స్ గురించి ప్రస్తావించాల్సి వస్తే తప్పకుండా 2014 నాటి ఘోరాన్ని చెప్పు కోవాల్సిందే. తూర్పుగోదావరి జిల్లాలోని నగరం ప్రాంత ప్రజలు ఆ ఏడాది మిగిల్చిన విషాదాన్ని అసలు మర్చిపోలేరు.
2014 జూన్ 27వ తేదీన గెయిల్ పైప్లైన్ పేలి గ్యాస్ లీక్ అయ్యి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 22 మంది సజీవదహనమయ్యారు. పదుల సంఖ్యలో స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి బ్లో అవుట్ అనగానే ఇక్కడి ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది. అంతకు ముందు 1995లోనూ ఇదే తరహా బ్లో అవుట్ సంభవించింది.
అమలాపురం సమీపంలోని పసర్లపూడి- 19 వద్ద ప్రపంచంలోనే అతి పెద్ద బ్లో అవుట్ నమోదైంది. ఇక్కడ గ్యాస్ లీక్ కారణంగా 65రోజుల పాటు మంటలు ఎగిసి పడ్డాయి. అమెరికా నుంచి నిపుణు లు రంగంలోకి దిగాక కానీ మంటలు అదుపులోకి రాలేదు. కాకపోతే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించకపోవడం కాస్త ఊరటనిచ్చిన విషయం. 2017లో అమలాపురంలో గెయిల్ పైప్లైన్ పేలుడు ఘటనలో గాయపడిన 12 మందికి ఆసుపత్రిలో చికిత్స అందించారు.
అతి పెద్ద గ్యాస్ కలెక్షన్ స్టేషన్స్: 2014, 1995, 2026. ఇలా ఏడాది ఏదైనా కావచ్చు. ఈ ప్రమాదాలకు కారణమేంటని పరిశీలిస్తే మాత్రం ఒకటి బావుల వద్ద రెండు పాతబడిన పైప్లైన్స్ అనేది ప్రాథమికంగా వినిపించే మాట. అందుబాటులోని సమాచారం ప్రకారం కోనసీమ భూగర్భంలో గెయిల్ సంస్థకు చెందిన పైప్లైన్స్ 430 కిలోమీటర్ల మేర ఉన్నాయి. అదే ఓఎన్జీసీకి చెందిన పైప్లైన్స్ 120 కిలోమీటర్ల మేర ఉన్నాయి. రిలయన్స్ సంస్థవి 36 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వీటిలో అతి పెద్ద గ్యాస్ కలెక్షన్ స్టేషన్స్ తాటిపాక, అడవిపాలెం, పొన్నమండలో ఉన్నాయి.
వీటన్నింటిలో భూగర్భంలో ఉన్న పైప్లైన్స్ సుమారు 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినవే. అంటే ఎంత పాతవో అర్థం చేసుకోవచ్చు. వీటిలో ఏదైనా తేడా వచ్చినప్పుడు మరమ్మతులు చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం ఆలోచించడం లేదన్న విమర్శలున్నాయి. అందుకే తరచూ బ్లో అవుట్స్ జరుగు తున్నాయన్నది ఓ వాదన. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 150 గ్రామాల్లో ఈ పైప్లైన్స్ విస్తరించి ఉన్నాయి. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడం స్థానికులను భయపెడుతోంది.
స్థానికుల జీవితాల్లో అలజడి: 1980 ప్రాంతంలో కోనసీమలో చమురు, గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నప్పుడు ఈ ప్రాంత తలరాత మారిపోతుందని అందరూ భావించారు. ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థల రాకతో అభివృద్ధి ఊపందుకుంటుందని ఆశించారు. ఐతే, దశాబ్దాలు గడిచేసరికి ఆ ఆశలు అడియాసలు అయ్యాయి. నిక్షేపాలు బయటకు తీస్తున్న కొద్దీ, స్థానిక ప్రజల జీవితాల్లో అలజడి మొదలైంది.
ఇప్పుడు ఇరుసుమండలో జరిగిన ఘటనలో దాదాపు 100 అడుగులు ఎత్తులో మంటలు ఎగిసి పడినట్టు సమాచారం. అంటే బ్లో అవుట్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. అసలు బ్లో అవుట్ అంటే ఏంటి? తరచూ ఎందుకిలా సంభవిస్తాయి? బ్లో అవుట్ అంటే పైప్ లైన్ నుంచి నేచురల్ గ్యాస్ లేదా క్రూడ్ ఆయిల్ తీవ్ర ఒత్తిడికి గురై ఆ ప్రెజర్ కారణంగా పైప్ పగిలిపోయి బయటకు రావడం. బయటకు వచ్చినప్పుడు ఈ గ్యాస్ ప్రెజర్ను తగ్గించడం చాలా కష్టంతో కూడుకున్న పని. విపరీతమైన ఫోర్స్తో ఇది ఎగిసి పడుతుంది. భూగర్భంలో తేమ వల్ల ఈ పైప్లైన్లు తుప్పు పట్టి లీకేజీలకు కారణమవుతున్నాయి. గ్యాస్ ఒత్తిడిని తట్టుకునేలా పైప్లు బలంగా ఉంటే పరవాలేదు. కానీ అలా లేనప్పుడే సమస్యలు వస్తున్నాయి.
మంటలు అదుపులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు: ఇప్పటి వరకూ ప్రస్తావించిన దాన్ని బట్టి చూస్తే ఇది చాలా పెద్ద సమస్య. మరి పరిష్కారం మాటేంటి? నిజానికి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే వాటిని ఆర్పి అదుపులోకి తీసుకు రావచ్చు. కానీ ఇక్కడి ప్రమాదం తీరు పూర్తిగా భిన్నం. గ్యాస్ లేదా క్రూడ్ ఆయిల్ బయటకు ఎగజిమ్మినప్పుడు మంటలు విపరీతంగా వస్తాయి. వీటిని అదుపులోకి తీసుకురావడం చాలా శ్రమతో కూడుకున్న పని. కొన్ని సందర్భాల్లో ఇది అసాధ్యం కూడా.
నియంత్రణలోకి తీసుకు రాలేని ప్రెజర్తో ఇది ఎగజిమ్ముతుంది. పైగా ఇదంతా పరిసర ప్రాంతాల్లోకి విస్తరిస్తుంది. అక్కడ కూడా మంటలు వ్యాపిస్తాయి. సమీపంలో ఏవైనా కరెంట్ తీగలు ఉంటే మంటలు ఇంకాస్త ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. వీటినే జెట్ ఫైర్స్ అంటారు. ఈ గ్యాస్ ఎగజిమ్మినప్పుడు ఆ వేడి కనీసం 100 మీటర్ల వరకూ తీవ్రంగా ఉంటుంది. అంటే ఘటనా స్థలానికి దగ్గరగా వెళ్లి మంటలు అదుపులోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉండదు.
ప్రత్యేకమైన షీల్డింగ్ ఉంటే తప్ప ఇది కుదరని పని. ఇక ఇంత హై ప్రెజర్తో గ్యాస్ రిలీజ్ అయినప్పుడు విపరీతంగా శబ్దం వస్తుంది. దగ్గరగా వెళ్లి ఎక్కువ సమయం పాటు ఉంటే చెవులు పూర్తిగా వినిపించకుండా పోయే ముప్పు ఉంటుంది. మాన్యువల్గా వాల్వ్స్ను ఆఫ్ చేయడమూ కష్టమైన పనే. అందుకే బ్లో అవుట్స్ను హ్యాండిల్ చేయడం అంత సులభం కాదు అని చెబుతుంటారు విశ్లేషకులు.
తరచూ గ్యాస్ లీకులు: అల్లవరం, తాటిపాక, పశిపాలా, మామిడికుదురు వంటి మండలాల్లో తరచూ గ్యాస్ లీక్ వార్తలు వింటూనే ఉంటాం. పంట పొలాల్లోంచి గ్యాస్ బుడగలు రావడం ఇక్కడ సాధారణమైపోయింది. గ్యాస్ వెలికితీత ప్రక్రియ వల్ల అటు పర్యావరణానికీ భారీ నష్టం జరుగుతోంది. డ్రిల్లింగ్ సమయంలో విడుదలయ్యే రసాయనాలు భూగర్భ జలాల్లో కలిసి నీరు రంగు మారుతోంది. తాగడానికి, సాగుకు ఆ నీరు పనికిరాకుండా పోతోంది.
గ్యాస్ లీకైన ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పంటలు పండవు. కొబ్బరి, అరటి తోటలు ఎండిపోతున్నాయి. ఇక పైప్లైన్స్కు సంబంధించిన సేఫ్టీ ఆడిట్ కూడా సరిగ్గా చేయకపోవడం మరో సమస్య. ఇలా సమస్యలన్నీ ఒకటికి ఒకటి తోడై ఇలా బ్లో అవుట్ రూపంలో మంటలను ఎగదోస్తూ స్థానికులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కాకపోయినా కనీసం తాత్కాలిక ఉపశమన చర్యలు ఎప్పటికి అమల్లోకి వస్తాయో మరి.
ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో గ్యాస్ లీక్ - ఎగసిపడుతున్న మంటలు
పచ్చని కోనసీమ నిప్పుల కొలిమిగా - తరచూ భయపెడుతున్న బ్లోఅవుట్లు

