ఛలో "చార్ధామ్" - ఏ ఆలయం ఎప్పుడు తెరుచుకుంటుందో తెలుసా? తేదీలు వచ్చేశాయి!
చార్ధామ్ యాత్రకు ఎదురుచూస్తున్న భక్తులు - ఆలయాల ప్రారంభ తేదీలు ఇవే!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 27, 2026 at 12:34 PM IST
Chardham Registration 2026 : చార్ధామ్ యాత్ర వెళ్లాలనేది చాలా మంది కోరిక. కానీ, హిమాలయాల్లో, ఎత్తైన మంచు పర్వత ప్రాంతాల్లో ఉండే ఈ ఆలయాలు ఏడాదిలో కొన్నాళ్లు మాత్రమే తెరుచుకుని ఉంటాయి. ఈ ఏడాదిలో మరి కొద్ది రోజుల్లో ఆలయాలు తెరుచుకోనుండగా యాత్ర కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను చార్ధామ్ (నాలుగు ఆలయాలు) అంటారు. ఈ ఆలయాల్లో ముందుగా యమునోత్రి, గంగోత్రి, ఆ తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్ తెరుచుకుంటాయి.
ట్రెయిన్ రిజర్వేషన్ టికెట్ వేరొకరికి బదిలీ చేసుకోవచ్చు - ఎలా సాధ్యమంటే!

ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు
గతేడాది చార్థామ్ యాత్ర ఏప్రిల్ 30న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరుచుకోవడంతో ప్రారంభమైంది. మే2న కేదార్నాథ్, 4న బద్రీనాథ్ ఆలయాలను ఓపెన్ చేశారు. అక్టోబర్ 22న గంగోత్రి, 23న యమునోత్రి ఆలయాలను మూసేయగా ఆ తర్వాత నెల రోజులకు అక్టోబర్ 23న కేదార్నాథ్, నవంబర్ 25న బద్రీనాథ్ ఆలయాన్ని మూసేశారు.

ఈ ఏడాదిలో
చార్థామ్ ఆలయాల్లో యమునోత్రి తలుపులు ముందస్తుగా తెరుచుకుంటాయి. ఏప్రిల్ 19న యమునోత్రి, గంగోత్రి, 22న కేదార్నాథ్, 23న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి. భక్తులు ముందుగా యమునోత్రిని దర్శించి ఆ తర్వాత వరుస క్రమంలో గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ దర్శించుకోవడం ఆనవాయితీ.
యమునానది జన్మస్థలం యమునోత్రి కాగా, ఇక్కడికి భక్తులు కాలినడకన చేరుకుంటారు. వయస్సు మళ్లిన వారు మాత్రమే గుర్రాలు లేదా పల్లకీల్లో వెళ్తుంటారు. రిషికేశ్ నుంచి ఇక్కడికి దాదాపు 210కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక గంగానది జన్మస్థలమైన గోముఖ్ గంగోత్రికి 19కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గోముఖ్లో జన్మించిన భాగీరథి దేవప్రయాగ్ సమీపంలో అలకనందతో సంగమంతో గంగగా మారుతుంది.
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం అత్యంత ఎత్తైన ప్రాంతం. ఇక్కడికి వెళ్లాలంటే ఎత్తైన కొండల్లో 18 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాలి. నడవలేని వారి కోసం పల్లకీలు, గుర్రాలు, హెలికాఫ్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి.
యమునోత్రి సమీపంలో రైతాల్, బార్సు, ఉత్తరకాశీ, హనుమాన్ ఛట్టీ, జానకీ చట్టీ, ఖర్సాలీ, బర్కోట్, డయారా బుగ్యాల్ ప్రముఖ దర్శనీయ స్థలాలు. అదే విధంగా గంగోత్రికి సమీపంలో భగీరథీ కొండ, దోడి తల్, కేధార్ తల్, గంగోత్రి ఆలయం, గంగోత్రి నేషనల్ పార్క్, గోముఖ్ తపోవన్ ట్రెక్, కేధార్ తల్ ట్రెక్ ఉన్నాయి. కేదార్నాథ్ ఆలయానికి సమీపంలో సోన్ ప్రయాగ్, గౌరీకుండ్, వాసుకీ తల్, శంకరాచార్య సమాధి, భైరవనాథ్ ఆలయం ఉన్నాయి. బద్రీనాథ్ సమీపంలో వసుధార జలపాతం, నరాడ్ కుండ్, సతోపంత్ ట్రెక్, హెమకుండ్ సాహిబ్, ఫ్లవర్స్ వ్యాలీ సందర్శించాల్సిన స్థలాలు.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి
చార్ధామ్ యాత్ర చేయాలనుకునే భక్తులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆధార్ లేదా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, ఫొటోలు, మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్ టూరిజం లేదా చార్ధామ్ యాత్ర పోర్టల్https://registrationandtouristcare.uk.gov.in/ క్లిక్ చేసి వివరాలు, పత్రాలు సమర్పించి పేరు నమోదు చేసుకుని తేదీలు ఎంచుకోవాలి. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ కోసం హరిద్వార్, రిషికేశ్తో పాటు నాలుగు యాత్ర ప్రారంభ ప్రదేశాల్లో ప్రత్యేకంగా కౌంటర్లున్నాయి.
మలయాళీల "కేరళం" - అనేక రాష్ట్రాలు పేరు మార్చుకున్నాయని తెలుసా?
ఏటీఎం కార్డుపై రూ.20లక్షలు! - ఉచితంగా బీమా ఉందని మీకు తెలుసా?

