పల్లెటూరు "కాకా హోటల్ చట్నీ రెసిపీ" సీక్రెట్ ఇదే! - ఇడ్లీ, దోసెల్లోకి ఇది కమ్మగా ఉంటుంది!
స్పెషల్ పల్లీ చట్నీ రెసిపీ - ఈ చట్నీతో టిఫిన్ ఎక్కువే తింటారు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 12, 2026 at 12:47 PM IST
EASY CHUTNEY RECIPE : పల్లెటూరు కాకా హోటల్లో టిఫిన్ మాత్రమే కాదు! చట్నీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇడ్లీ, దోసెల్లోకి ఇచ్చే చట్నీ ఇంకాస్త తినాలనిపిస్తుంది. చట్నీ టేస్ట్ కోసం మరో ప్లేట్ ఇడ్లీ లేదా దోసెలు తినే ఉంటాం. సరిగ్గా అలాంటి చట్నీ మీరు కూడా కావాలనుకుంటున్నారా? ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. కాకా హోటల్ చట్నీ టేస్ట్ సీక్రెట్ ఏంటో చూసేద్దాం.
"కారం పొడులు" మీకు ఇష్టమా? - ఇలాంటి "పుదీనా కారం పొడి" సింపుల్గా చేసేయండి!

కావల్సిన పదార్థాలు :
- పల్లీలు - కప్పు
- నూనె - 1 టేబుల్ స్పూన్
- ఎండు మిర్చి - 12
- వెల్లుల్లి రెబ్బలు - ఐదారు
- కొబ్బరి ముక్కలు - కప్పు
- చింతపండు - కొద్దిగా

తాలింపు కోసం :
- నూనె - 1 స్పూన్
- ఆవాలు - అర స్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - 1 రెమ్మ
- ఇంగువ - చిటికెడు

తయారీ విధానం :
- ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కప్పు పల్లీలు వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పల్లీలు దోరగా, రంగు మారే వరకు బాగా కలుపుతూ వేయించాలి. ఇలా కాస్త సమయం పట్టినా సరే పల్లీలు రంగు మారే వరకు వేయించాక పక్కన పెట్టుకోవాలి.
- ఇపుడు అదే ప్యాన్లో కాస్త నూనె వేసి కారానికి సరిపడా ఎండు మిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు తీసుకున్న కప్పు కొలతతో కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకుండా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు.
- ఆ తర్వాత కొద్దిగా చింతపండు రెబ్బ వేసి ఎండు మిర్చి రంగు మారే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. రెండు మూడు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయిస్తే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి.

- ఇపుడు వేయించిన పల్లీలు పొట్టు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. పొట్టు తీసిన పల్లీల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు వేసుకుని పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకుని చట్నీలో కలుపుకుంటే సరిపోతుంది.
- ఇపుడు ఈ చట్నీలోకి తాలింపు పెట్టుకోవాలి. అదే ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని కొద్దిగా నూనె వేసి ఆవాలు వేసుకుని చిటపటలాడించి ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని కలిపితే చాలు. పోపు వేడి వేడిగా చట్నీలో కలిపితే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుంది.
ఇడ్లీ, దోసె ఏదైనా సరే - అద్దిరిపోయే "పల్లీ, టమోటా చట్నీ"!
కరకరలాడే "పెసర పునుగులు" - ఇంట్లోనే స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ పక్కా!

