మలయాళీల "కేరళం" - అనేక రాష్ట్రాలు పేరు మార్చుకున్నాయని తెలుసా?
కేరళం అంటే 'కొబ్బరి చెట్ల భూమి' అనే అర్థం - ఆంధ్రప్రదేశ్ పూర్వ నామం తెలుసా?

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 25, 2026 at 4:00 PM IST
STATES AND CITYS OLD NAMES : వ్యక్తులు, సంస్థల పేర్లు తరచూ మారడం, మార్చుకోవడం తెలిసిందే. కానీ, పట్టణాలు, నగరాలతో పాటు రాష్ట్రాల పేర్లు కూడా మారాయని తెలుసా? ఆంధ్ర రాష్ట్రం 1956లో ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. అదే విధంగా మధ్య భారత్ మధ్యప్రదేశ్ గానూ, నాటి మద్రాస్ రాష్ట్రం తమిళనాడుగా పేరు మార్చుకున్నాయి. ఇవి మాత్రమే కాదు తాజాగా కేరళ రాష్ట్రం కూడా పేరు మార్చేసుకుంది. ఇకపై "కేరళం" అని పిలవాల్సి ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం మేరకు కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదించింది. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి అని అర్థం. ఇప్పటికే మలయాళీలు కేరళం అని పిలుచుకుంటున్నారు. తాజాగా చట్టం కూడా 'సరే' అనేసింది.
ఏటీఎం కార్డుపై రూ.20లక్షలు! - ఉచితంగా బీమా ఉందని మీకు తెలుసా?
రాష్ట్రాల పేర్లు మాత్రమే కాదు నగరాలు, పట్టణాల పేర్లు సైతం మారిపోయాయి. చారిత్రక, బౌగోళిక, స్థానిక అంశాలు పేర్ల మార్పులో కీలక భూమిక పోషిస్తున్నాయి. భాష గుర్తింపు, సాంస్కృతిక వారసత్వం, చరిత్రను ప్రతిబింబించేలా ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు పేరు మారిన, మార్చుకున్న రాష్ట్రాలు, ప్రముఖ నగరాల జాబితా చూద్దామా!
తూర్పు పంజాబ్ 1950లో పంజాబ్గా మారింది. అదే ఏడాదిలో యునైటెడ్ ప్రావిన్సెస్ ఉత్తర ప్రదేశ్గా పేరు మార్చుకుంది. 1956 వరకూ ట్రావెన్కోర్, కొచ్చిన్గా ఉన్న కేరళ తాజాగా 'కేరళం" అని మరోసారి మార్పును కోరింది. ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు కాగా, 1959లో మధ్య భారత్ మధ్యప్రదేశ్, 1969లో మద్రాసు రాష్ట్రం తమిళనాడుగా, నార్త్-ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ 1972లో అరుణాచల్ ప్రదేశ్గా పేరొందాయి. 1973 సంవత్సరంలో లక్కదీప్, మినికాయ్, అమిండివి దీవులను కలిపి "లక్షద్వీప్"గా మార్చేశారు.
కర్ణాటక పూర్వ నామం 1973 వరకు మైసూర్ కాగా, నేటి ఉత్తరాఖండ్ 2007 వరకు ఉత్తరాంచల్గా పిలవబడింది. 2011లో ఒరిస్సా ఒడిశాగా, 2006లో పాండిచ్చేరి పుదుచ్చేరిగా మారింది.
నగరాలు/పట్టణాలు కూడా
రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో నగరాలు, పట్టణాల పేర్లు కూడా మారిపోయాయి. భాష, చారిత్రక విషయాలు అందుకు ఊతమిచ్చాయి. మార్పునకు నాంది పలికాయి. వీటిల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు ప్రాంతాలను పరిశీలిస్తే నేటి గుంటూరుకు గర్తపురి అని పేరుండేది. అదే విధంగా హేళాపురి నుంచి ఏలూరు, కందనవోలు నగరం కర్నూలుగా, కాకినందివాడ/కోకనాడ నుంచి కాకినాడ, మత్స్యపురి/బందరు నుంచి మచిలీపట్నం ఆవిర్భవించాయి. నెల్లూరు గతంలో నెల్లియూరు/విక్రమసింహపురి అని పేరొందగా, ఆదిలాబాద్ ఎదులాపురం అని, నిజామాబాద్ ఇందూరుగా పిలిచేవారు. మెతుకుసీమ మెదక్ గతంలో గుల్షనాబాద్ కాగా, మహబూబ్నగర్ను పాలమూరుగా, నల్లగొండను నీలగిరిగా పిలిచేవారు. ఖమ్మం పూర్వ నామం కంభంమెట్టు/స్తంభాద్రి కాగా, బాంబే నుంచి ముంబయి, మద్రాస్ నుంచి చెన్నై, త్రివేండ్రం నుంచి తిరువనంతపురం, గుర్గావ్ నుంచి గురుగ్రామ్, కలకత్తా నగరాన్ని కోల్కతాగా మార్చడం తెలిసిందే.
ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? - ఈ ఆప్షన్ ఎంచుకుంటే బెర్త్ ఖాయం!
కొత్త "Aadhaar" యాప్ వచ్చేసింది - ఫోన్లోనే అడ్రస్, మొబైల్ నంబర్ ఛేంజ్ చేసుకోవచ్చు!

