తిరుమలలో "నల్ల బంగారం" నయా రికార్డు - టీటీడీ లెక్కలు ఏం చెప్తున్నాయంటే!
తిరుమలలో వేసవిలో పెరిగిన భక్తుల రద్దీ - పకడ్బందీ ఏర్పాట్లు, నిరంతరాయంగా సేవలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 2, 2026 at 10:29 AM IST
Black Gold in Tirumala : తిరుమల తిరుపతిలో వేంకటేశ్వరస్వామికి తలనీలాల మొక్కు చెల్లించే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సంవత్సరంలో మే నెలలో తలనీలాలు అర్పించిన భక్తుల సంఖ్య తిరుమల చరిత్రలో కొత్త రికార్డులు నమోదు చేసింది. తిరుమలలో రద్దీ రోజుల్లో తలనీలాలు (నల్ల బంగారం) అర్పించే భక్తుల సంఖ్య సహజంగానే రోజుకు 50వేల వరకు ఉంటుంది. కానీ, ఆ సంఖ్య మే 23న 57,580కు చేరడం గమనార్హం. మొత్తంగా చూస్తే మే నెలలో 27వ తేదీ నాటికే దాదాపు 12లక్షల 43వేల 063 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తలనీలాలు మొదలుకుని, దర్శనం, అన్నప్రసాదం వరకు తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. సేవల విషయంలో అంతరాయం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంది.
తల నీలాలు అర్పించిన భక్తుల సంఖ్య
- 2024 మే : 10,65,729
- 2025 మే : 10,18,370
- 2026 మే (27వరకు) : 12,43,063

తిరుమల కొండపై టీటీడీ మరో "ఉచిత సేవ"- భక్తులు ఇకపై డబ్బు చెల్లించాల్సిన పన్లేదు!
తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడడం, రోడ్లు, రైల్వే, విమాన సర్వీసులు అందుబాటులో ఉండడంతో రాకపోకలు పెరిగాయి. దీనికి తోడు వేసవి సెలవులు, వారాంతపు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మే 18 నుంచి 23 వరకు వరుసగా ఆరు రోజుల పాటు నిత్యం 50 వేలకుపైగా భక్తులు తలనీలాలు సమర్పించినట్లు తెలుస్తోంది. అందులో రు. ముఖ్యంగా మే 23 (శనివారం) ఒక్కరోజే 57,580 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం విశేషం.
వివిధ ప్రాంతాల్లో కళ్యాణకట్టలు
తలనీలాలు సమర్పించాలనుకునే భక్తులకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పలు సౌకర్యాలు కల్పిస్తోంది. వేచిచూసే సమయం తగ్గించడంతో పాటు సౌకర్యవంతంగా తలనీలాలు సమర్పించేలా 11 మినీ కళ్యాణకట్టలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధాన కళ్యాణకట్టతో పాటు పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ-5, జీఎన్సీ, హెచ్వీసీ ఉన్నాయి. వీటికి తోడు సప్తగిరి, నందకం, కౌస్తుభం, శ్రీవేంకటేశ్వర, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహాల వద్ద మినీ కళ్యాణ కట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.
అడుగడుగునా పరిశుభ్రత
తిరుమలలో 1,152 మంది క్షురకులు పని చేస్తున్నారు. ఇందులో 269 మంది మహిళలున్నారు. ఒక్కొక్కరు రోజుకు 6గంటల పాటు షిఫ్టులో పనిచేస్తూ 40మందికి తలనీలాలు తీస్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో అదనంగా పనిచేస్తూ 50మంది వరకూ క్షర కర్మ చేస్తుంటారు. ఆయా స్థలాల్లో పరిశుభ్రతకు టీటీడీ పెద్దపీట వేసింది. తలనీలాలు తీయడానికి ఉపయోగించే బ్లేడ్లను ముందుగా సోడియం సొల్యూషన్ లో ముంచి ఆ తర్వాత డెటాయిల్ తో శుభ్రం చేయడం తప్పనిసరిగా అమలు చేస్తోంది. తలనీలాలను ఎప్పటికప్పుడు సేకరించి భద్రపరచడంతో పాటు ప్రతి కళ్యాణకట్టలో భక్తులకు స్నానపు గదులతో పాటు వేడి నీరు అందుబాటులో ఉంచుతోంది. తలనీలాల మొక్కు చెల్లించిన భక్తులకు చందనం బిళ్లలను కూడా టీటీడీ అందిస్తోంది.
భక్తులు తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు?
తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాల్లో భక్తులు తలనీలాలు అర్పించడం తెలిసిందే. అందుకు కారణమేంటంటే! మనిషి తెలిసీ తెలియక చేసిన పాపాలు జుట్టును అంటుకుని ఉంటాయని, అందుకే స్వామి సన్నిధిలో మొక్కుబడిగా తలనీలాలు సమర్పిస్తే పాపప్రక్షాళన జరుగుతుందని నమ్మతుంటారు. ముందుగా తల్లి గర్భం నుంచి తల బయటకు వస్తుందని, గత జన్మ వాసనలు పాపాల రూపంలో తలను అంటిపెట్టుకుని ఉంటాయని శాస్త్ర వచనం. అందుకే శిశువులకు ఏడాది లోపు పుట్టు వెంట్రుకలు తీయిస్తుంటారు. అందమైన జుట్టు ఉందన్న గర్వం, అహంకారం తొలగిపోవడానికి మొక్కుబడిగా తలనీలాలను సమర్పిస్తారని మరో వాదన.
శ్రీవారి భక్తులకు మరో శుభవార్త - 'శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్'తో బ్రేక్ దర్శనాలు
'ఆపదమొక్కులవాడా, అనాథ రక్షకా'! - రూపాయి ఫీజు లేకుండా కార్పొరేట్ వైద్యం!

