మినప్పప్పు, వంటసోడా లేకుండానే "స్పాంజ్ దోశలు" - నాలుగు పదార్థాలతోనే సింపుల్గా రెడీ!
మరమరాలతో దూది లాంటి మెత్తని "దోశలు" - పిల్లలైతే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు!

Published : January 11, 2026 at 5:31 PM IST
Sponge Dosa Recipe in Telugu : "దోశ" మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీలలో పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే వాటిల్లో ఒకటి. ఈ క్రమంలోనే అమ్మలు అందరూ వారంలో రెండు, మూడు సార్లైనా దోశలు ప్రిపేర్ చేస్తుంటారు. అయితే, నార్మల్గా మనందరం ఆనియన్ దోశ, రవ్వ దోశ, మసాలా దోశ వంటివి ఎక్కువగా తయారు చేసుకుంటుంటాం. ఇంకా రుచికరంగా తినాలనిపిస్తే అప్పుడప్పుడు ఎగ్ దోశ వేసుకుంటుంటాం.
అయితే, ఎప్పుడూ అవే తింటే ఏం బాగుంటుంది? అందుకే మీకోసం ఒక స్పెషల్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, మరమరాలతో రుచికరమైన "స్పాంజ్ దోశలు". వీటి తయారీకి మినప్పప్పు, పెరుగు, బేకింగ్ సోడా, నూనె వంటివేమి అవసరం లేదు. పైగా ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. దూది లాంటి ఈ మెత్తటి దోశలను పిల్లలైతే ఒకటికి రెండు చాలా ఇష్టంగా తింటారు. మరి, లేట్ చేయకుండా ఈ సూపర్ టేస్టీ స్పాంజ్ దోశలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- మరమరాలు - మూడు కప్పులు
- బియ్యం - ఒకటిన్నర కప్పులు
- మెంతులు - అర టీస్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
కందిపప్పుతో పప్పు, సాంబార్ రొటీన్ - ఇలా "పచ్చడి" చేయండి! - టేస్ట్ సూపర్!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో బియ్యం, మెంతులను తీసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఆపై అందులో తగినన్ని నీళ్లు పోసి సుమారు 5 గంటల పాటు నానబెట్టాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. పిండి అనేది ఎక్కడా బరకగా లేకుండా వెన్నలా మృదువుగా ఉండాలి.
- తర్వాత మిక్సీ పట్టుకున్న పిండిని ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

- ఇప్పుడు మరో గిన్నెలో మరమరాలను తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆపై వాటిని వాటర్ లేకుండా బియ్యం పట్టుకున్న మిక్సీ జార్లో వేసుకుని అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆపై మరమరాల పేస్ట్ని ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యప్పిండిలో వేసి అవి రెండూ చక్కగా కలిసేలా చేతితో బాగా కలుపుకోవాలి.
- తర్వాత గిన్నెపై మూత ఉంచి 8 గంటల పాటు పులియబెట్టుకోవాలి.
- మీరు ఈ దోశలు మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు రాత్రి పిండిని సిద్ధం చేసుకుని పులియబెట్టుకుంటే సరిపోతుంది.
- నెక్ట్స్ డే మార్నింగ్ చక్కగా పులిసిన పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.(పిండి మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసి మిక్స్ చేసుకోవాలి)

- అనంతరం స్టవ్ మీద దోశ పెనం పెట్టి వేడి చేసుకోవాలి. పెనం కాస్త వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని ఒకట్రెండు గరిటెలు వేసి మందపాటి దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి.
- తర్వాత దానిపై మూతపెట్టి కొద్దిసేపు కాలనివ్వాలి. అది వన్ సైడ్ మంచిగా కాలిందనుకున్నాక గరిటెతో మరోవైపు తిప్పి కాసేపు కాల్చుకుని ప్లేట్లోకి తీసుకుంటే చాలు.
- అంతే, మరమరాలతో దూది లాంటి మెత్తని "స్పాంజ్ దోశలు" మీ ముందు ఉంటాయి!
- ఇక వీటిని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుని తిన్నారంటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.
- మరి, నచ్చితే మీరూ రెగ్యులర్ దోశలకు బదులుగా ఓసారి ఇవి ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు.

టిప్స్ :
- ఈ రెసిపీ కోసం మీరు నార్మల్ బియ్యం ప్లేస్లో రేషన్ బియ్యం లేదా ఇడ్లీ రైస్ వంటివి కూడా యూజ్ చేయొచ్చు.
- ఇక్కడ ముఖ్యంగా బియ్యాన్ని తీసుకున్న కొలతకు డబుల్ మరమరాలను తీసుకోవాలి.
- ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీలో ఈ దోశలు చేసుకోవాలనుకుంటే పదార్థాలను తగ్గించి తీసుకుంటే సరిపోతుంది.
చేపలతో నోరూరించే "కట్లెట్స్" - లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా అద్దిరిపోతాయి!
పిండి ఇలా కలిపి "కారప్పూస" చేయండి - స్వీట్ షాప్ స్టైల్ రుచితో కరకరలాడుతుంది!

