సండే స్పెషల్: పండుమిర్చితో "చికెన్ పచ్చడి" - చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది!
- పక్కా కొలతలతో నోరూరించే 'చికెన్ పచ్చడి' - ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు!

Published : February 21, 2026 at 2:08 PM IST
Spicy Pandumirchi Chicken Pachadi : నాన్వెజ్ పచ్చళ్లకు ఉండే క్రేజ్ వేరే లవల్. చికెన్, మటన్, ప్రాన్స్ ఇలా పచ్చడి ఏదైనా టేస్ట్ అద్భుతమే. అయితే మటన్, ప్రాన్స్తో పోలిస్తే మెజార్టీ పీపుల్ చికెన్ పచ్చడిని విరివిగా పెట్టేస్తుంటారు. అయితే చికెన్ పికిల్ను ఎప్పుడూ చేసేలా కాకుండా ప్రస్తుతం మార్కెట్లో లభించే పండుమిర్చి యూజ్ చేసి పెట్టండి. టేస్ట్ అద్దిరిపోతుంది. తయారు చేసుకోవడం కూడా సులువే. ఎండుకారం బదులు వీటిని వేసి చేయడం వల్ల నోటికి కొత్త రుచి తెలుస్తుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే అబ్బబ్బా అనాల్సిందే. మరి, సండే స్పెషల్ పండుమిర్చి చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
మసాలా పొడి కోసం:
- ధనియాలు - 2 టీస్పూన్లు
- జీలకర్ర - 1 టీస్పూన్
- దాల్చినచెక్క - 2 ఇంచ్లు
- యాలకులు - 6
- లవంగాలు - 8
- ఆవాలు - 2 చెంచాలు
- మెంతులు - అర టీస్పూన్
పచ్చడి కోసం:
- పండుమిర్చి - అర కేజీ
- చికెన్ - కేజీ
- నూనె - 2 కప్పులు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 6 టేబుల్స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- నిమ్మరసం - 5 టేబుల్స్పూన్లు

తయారీ విధానం:
- ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అనంతరం అందులోకి 1 టీస్పూన్ ఉప్పు, 1 టీస్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు పక్కన ఉంచాలి.
- అదే విధంగా పండుమిర్చిని శుభ్రంగా కడిగి తడి లేకుండా కాటన్ క్లాత్తో తుడిచి తొడిమలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, ఆవాలు, మెంతులు వేసి లో-ఫ్లేమ్లో దోరగా వేయించాలి.

- మసాలా దినుసులు చక్కగా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
- మిక్సీజార్లోకి చల్లారిన మసాలా దినుసులు వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి.
- అదే మిక్సీజార్లోకి పండుమిర్చి ముక్కలు వేసి మెత్తని పేస్ట్లా రుబ్బుకుని పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి.

- చికెన్ ముక్కల్లోని నీరు పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికి వాటర్ పోయిన తర్వాత తీసి గిన్నెలోకి వేసుకోవాలి.
- అదే స్టవ్ మీద మరో వెడల్పాటి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో ఉడికించిన చికెన్ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించాలి.
- ముక్క వేగి గోల్డెన్ కలర్లోకి మారినాక సిమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
- అల్లం పేస్ట్ మగ్గి పచ్చి వాసన పోయినాక రుబ్బిన పండుమిర్చి పేస్ట్ వేసి ఓ 5 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.

- పండుమిర్చి కూడా మగ్గి నూనె పైకి తేలినాక స్టవ్ ఆఫ్ చేసి పాన్ను దింపి పక్కన ఉంచాలి.
- అందులోకి రుచికి సరిపడా ఉప్పు, గ్రైండ్ చేసిన మసాలా పొడి వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- పచ్చడి చల్లారినాక నిమ్మరసం పోసి కలపాలి. అనంతరం తడి లేని గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేస్తే ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉండే పండుమిర్చి చికెన్ పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- చికెన్ ముక్కల్లోని నీరు పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించాలి. అదే విధంగా పండుమిర్చికి అస్సలు తడి ఉండకూడదు. ఏ మాత్రం తడిగా ఉన్న పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు.
- మీరు ఎక్కువ మొత్తంలో పచ్చడి పెట్టుకోవాలనుకుంటే అందుకు సరిపడా పదార్థాలను పెంచి తీసుకోవాలి.
- పచ్చడి చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం పోయాలి. వేడి మీద పోస్తే పచ్చడి చేదు వచ్చే అవకాశం ఉంటుంది.
- పండుమిర్చి వేసిన తర్వాత కూడా పచ్చడి ఘాటుగా లేదు అనిపిస్తే కాస్త కారంపొడి వేసుకోవచ్చు.
హైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ "రెడ్ చికెన్" - వీకెండ్ ఇలా చేస్తే ఇంట్లో పండగే!
పులావ్ టేస్టీగా ఉండాలా? - ఇంట్లోనే "మసాలా పౌడర్" చేసుకోండి! - రెండు నెలలు నిల్వ!

