లంచ్లోకి ఏం చేయాలో తోచనపుడు ఇలా ట్రై చేయండి - పిల్లలు, పెద్దలు టేస్టీగా తింటారు!
మధ్యాహ్న భోజనంలోకి సూపర్ ఫుడ్ - చాలా తేలికగా ఉంటుంది!
sambar_rice_recipe (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 17, 2026 at 10:19 AM IST
Sambar Rice Recipe : కొంతమంది మార్నింగ్ టిఫిన్స్, చట్నీలు ప్రిపేర్ చేసి అలసిపోతుంటారు. మధ్యాహ్న భోజనంలోకి రైస్, పప్పు, సాంబార్ లేదా రసం చేయడానికి టైం కూడా ఉండదు. అలాంటపుడు అన్నం వండేసి ఊరగాయలతో సరిపెడుతుంటారు. కానీ, మీకు టైం లేనపుడు ఇలాంటి రెసిపీ చేసుకోండి. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు.
ఘుమఘుమలాడే బెంగళూరు "దొన్నె బిర్యానీ" - ఇంట్లోనే ఇలా ట్రై చేయండి!

కావల్సిన పదార్థాలు :
- కందిపప్పు - 1 గ్లాసు
- రైస్ - 1 గ్లాసు
- చింతపండు - కొద్దిగా
- బంగాళాదుంప - 1
- క్యారెట్ - 1
- బఠానీ - పావు కప్పు
- టమోటా - 1
- బీరకాయ ముక్కలు - ఐదారు
- సొరకాయ ముక్కలు - ఐదారు
- వంకాయ ముక్కలు - ఐదారు
- బెండకాయ ముక్కలు - ఐదారు
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 స్పూన్
- జీలకర్ర - 1 స్పూన్
- వెల్లుల్లి రెమ్మలు - 6
- పచ్చిమిర్చి - 3
- ఉల్లిపాయలు - 1
- కరివేపాకు - 1 రెమ్మ
- ఇంగువ - పావు స్పూన్
- కారం - 2 స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- సాంబార్ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర - కొద్దిగా
- కసూరి మేతి - కొద్దిగా

తయారీ విధానం :
- ముందుగా కుక్కర్లోకి కందిపప్పు, రైస్ తీసుకుని నీళ్లు పోసుకుని శుభ్రం చేసుకోవాలి. 1 గ్లాసు రైస్ లోకి 1 గ్లాసు కందిపప్పు బాగుంటుంది. శుభ్రం చేసుకున్న తర్వాత 6 కప్పుల నీళ్లు పోసుకుని మూతపెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ఇవ్వాలి. ఇపుడు చింతపండు నానబెట్టుకోవాలి. బంగాళాదుంప, క్యారెట్, బఠానీ ఇలా మీకు నచ్చిన కూరగాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇపుడు కుక్కర్ ప్రెజర్ పోయాక మూత తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

- ఇపుడు ప్యాన్ స్టవ్ పై పెట్టుకుని నూనె వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు (సాంబార్ ఉల్లిపాయలు) సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి.

- ఆ తర్వాత టమోటా ముక్కలు, అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలు (బీరకాయ, సొరకాయ, వంకాయ, బెండకాయ) వేసుకుని బాగా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత కారం కొద్దిగా వేసుకుని కలపాలి.
- ఇపుడు చింతపండు రసం కూడా వేసుకుని మరిగించుకోవాలి. ఆ తర్వాత 3 గ్లాసుల నీళ్లు పోసుకుని రుచికి సరిపడా ఉప్పు, సాంబార్ పౌడర్ వేసుకుని కలపాలి. మీడియం ఫ్లేమ్లో మూతపెట్టుకుని ఉడికించాలి. 5 నిమిషాల పాటు కూరగాయ ముక్కలు ఉడికించుకుని మూత తీసుకుని ముందుగా కుక్ చేసుకున్న రైస్, పప్పు కూడా వేసి కలపాలి.

- ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో మరో 5 నిమిషాలు ఉడికించాలి. అంతే! ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కసూరి మేతి వేసుకుని కలపాలి. ఇలా రెడీ చేసుకున్న సాంబార్ రైస్ లోకి మీకు నచ్చితే కొద్దిగా పోపు వేసుకుని కలపాలి.
- పోపు కోసం మరో ప్యాన్ లో నూనె లేదా నెయ్యి వేసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఎండు మిర్చి వేయించి సాంబార్ రైస్ లో కలిపితే సరిపోతుంది.
నోటికి కొత్త రుచినిచ్చే "టమోటా మెంతి సోయా కర్రీ" - కొత్తవాళ్లైనా ఇలా సింపుల్గా చేసేయొచ్చు!

