రైతుల ఖాతాల్లోకి 2వేల రూపాయలు! - ఈ నెల 19న పీఎం కిసాన్ నిధులు విడుదల
"పీఎం కిసాన్ సమ్మాన్ నిధి" 21వ విడుత నిధుల విడుదల - ఇలా తెలుసుకోవచ్చు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : November 17, 2025 at 5:21 PM IST
Pm kisan 21st installment date 2025 : వార్షాకాలం ఖరీఫ్ పంట చేతికొచ్చే టైంలో మెంథా తుపాన్ ఇబ్బంది పెట్టింది. పలు ప్రాంతాల్లో రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. కాగా, రైతులను ఆదుకునే ఉద్దేశం, పంట పెట్టుబడికి తోడు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మూడు విడతల్లో 6వేల రూపాయలు విడుదల చేయడం తెలిసిందే. ఈ క్రమంలో పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 20 సార్లు పీఎం కిసాన్ (PM Kisan) నిధులు విడుదల చేసింది. తాజాగా 21వ విడత నిధులు ఈ నెల 19న రైతుల ఖాతాల్లో జమకానున్నాయి.
కిసాన్ సమ్మాన్ నిధులు అర్హులైన రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తున్నారు. పీఎం నరేంద్ర మోదీ 2019 ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు 20 దఫాలుగా రైతుల ఖాతాల్లోకి డబ్బు జమైంది. గతంలో 19 విడుతల్లో 19.7 కోట్ల మంది రైతులకు రూ.3.68లక్షల కోట్లు లబ్ధి చేకూరింది.
ఆంధ్రప్రదేశ్లో "అన్నదాత సుఖీభవ"
కేంద్ర సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అదనంగా మరో రూ.14వేలు అందిస్తోంది. మొదటి, రెండో విడతల్లో రూ.5 వేలు, మూడో విడతలో రూ.4 వేలు అందిస్తోంది. ఇప్పటికే తొలి విడతలో 5వేల రూపాయలు ఆగస్టులో విడుదల చేయడం తెలిసిందే.
కేంద్రం తొలి విడతలో 2వేలు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం 5వేల రూపాయలు కలిపి మొత్తం రూ.7వేలు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సాయం అందుకోని రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు అధికారులు గతంలో 155251 టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులో ఉంచారు.
కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రూ.6వేలు రైతుల బ్యాంకు ఖాత్లాల్లో జమకానున్నాయి.
- మొదటి విడుత ఏప్రిల్ - జూలై
- రెండో విడత ఆగస్టు - నవంబర్
- మూడో విడత డిసెంబర్ నుంచి మార్చి
ఈ ఏడాది తొలి విడత నిధులు ఆగస్టులో రైతుల ఖాతాల్లో జమ చేశారు. తాజాగా రెండో విడత నిధులు నవంబర్ 19న జమచేయనున్నట్లు సమాచారం.
"పీఎం కిసాన్" డబ్బు ఖాతాలో పడిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు.
- ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లాలి.
- కుడి వైపున బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోవాలి.
- ఆధార్ లేదా ఖాతా నంబర్ నమోదు చేసి 'గెట్ డేటా' పై క్లిక్ చేయాలి.
- స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ పథకానికి దరఖాస్తు చేసి ఈ-కేవైసీ పూర్తి చేసి ఉంటే నేరుగా ఖాతాలో డబ్బు జమ చేస్తారు.
- అలాగే లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో కూడా ఇక్కడే తెలుసుకోవచ్చు.
- బెనిఫిషియరీ స్టేటస్ కింద బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే మరొక పేజీ వస్తుంది.
- రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్ ఎంచుకుని గెట్ రిపోర్ట్'పై క్లిక్ చేస్తే చాలు జాబితా, లబ్ధిదారుల పేర్లు కనిపిస్తాయి.
అరకులో "చలి ఉత్సవాలు" - వేడుకలు ఎప్పుడు, ఎలా ఉంటాయో తెలుసా?
"విజయవాడ టు తిరుపతి" కొత్తగా వందేభారత్ - నాలుగున్నర గంటల్లోనే చేరుకునే అవకాశం!

