లక్షలు దానం చేస్తున్న "బిచ్చగాడు" - సీఎం సహాయనిధికి భారీగా విరాళం!
"రిచ్ బెగ్గర్" పూల్ పాండియన్ - ఆకలి తీర్చుకోవడానికి తప్ప దాచుకోడు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 27, 2026 at 12:34 PM IST
Bichagadu : "జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది" అంటున్నాడు ఆ బిచ్చగాడు. అందరూ ఉన్నా అనాథ జీవితాన్ని గడుపుతూ భిక్షాటన సొమ్ముతో పదిమందికి సాయపడుతున్నాడు. కడుపు నింపుకోగా మిగిలిన డబ్బంతా విరాళాలుగా అందిస్తున్నారు. పాఠశాలలు, ఆశ్రమాలకు, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇప్పటి వరకు లక్షల రూపాయలు అందించాడు.
'బిచ్చగాడు' సినిమాలో కథానాయకుడు యాచించిన డబ్బులో తన అవసరాలు తీర్చుకోగా మిగిలినదంతా హుండీలో వేస్తుంటాడు. తమిళనాడుకు చెందిన పూల్ పాండియన్ అనే వృద్ధుడిదీ అదే దారి. కాకపోతే హుండీలో వేయకుండా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు విరాళం ఇస్తుంటాడు. సీఎం సహాయ నిధి కోసం కలెక్టర్లకు అందజేస్తుంటాడు. ఇలా ఇప్పటి వరకు లక్షలాది రూపాయలను అందించాడు. పూల్ పాండియన్ కుటుంబ నేపథ్యం, ఆయన జీవనశైలి విశేషాలివీ.
'స్వామి వారి సేవ'లో పాల్గొనాలనుకుంటున్నారా? - ప్రముఖ ఆలయాల్లో అవకాశం!

తూత్తుకుడి జిల్లా సాత్తాన్కుళం వాసి పూల్పాండియన్(75) భిక్షాటన కొనసాగిస్తూ జీవితాన్ని గడిపేస్తున్నాడు. గతంలో ముంబైలో నివాసం ఉన్న పాండియన్ అక్కడే ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించారు. భార్య, ముగ్గురు పిల్లలే తన జీవితం. పిల్లలకు వివాహాలు చేసిన తర్వాత భార్య చనిపోవడంతో ఒంటరయ్యాడు. దీంతో అక్కడి నుంచి 2019లో తమిళనాడు వచ్చేశాడు. ఈ క్రమంలో సంచారిగా గడుపుతూ సాధారణ సన్యాసి జీవితానికి అలవాటు పడ్డాడు. తన అవసరాల కోసం భిక్షాటన చేసేవాడు. ఆకలి తీరగా మిగిలిన డబ్బును పొదుపు చేసేవాడు. వారానికో, నెలకో కొంత మొత్తం సమకూరగానే ఆ ప్రాంతానికి చెందిన కలెక్టర్లకు అందించేవాడు. బెంగళూరులోనూ భిక్షాటన చేసి అక్కడి కలెక్టర్లకూ డబ్బు అందజేశాడు.
కొవిడ్ సమయంలో మదురై వచ్చిన పాండియన్ లాక్డౌన్ కారణంగా ఇక్కడే ఉండిపోయాడు. ఆ సమయంలో కొవిడ్ సహాయ నిధి కోసం జిల్లా కలెక్టర్కు రూ.50 వేలు అందించాడు. ఈ నెల 18న, 25న 10 వేల రూపాయల చొప్పున సీఎం సహాయ నిధికి అందించారు. ఒక్క వారంలో ఇంత సంపాదన ఎలా వచ్చిందని ప్రశ్నిస్తే భిక్షాటన ద్వారానే సేకరించగలిగానని చెప్పాడు. ఇప్పటివరకు లక్షలాది రూపాయలు అందించానని, ఆ విషయం తెలిసిన ఎంతో మంది తనకు నగదు ఇవ్వడానికి ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. పాండియన్ పలు పాఠశాలలకు కూడా ఆర్థిక సాయం అందించడం విశేషం.
అందరూ ఉన్నా అనాథలా!
ఫూల్ పాండియన్ స్వస్థలం తూత్తుకుడి జిల్లా అలంకినారు. తనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కూతురు. కొన్నేళ్ల కిందట భార్య మృతిచెందడం, బంధువులు ఆదరించకపోవడంతో సంచార జీవితానికి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో స్థిర నివాసం అంటూ ఏమీ లేక వివిధ నగరాలు, పట్టణాల్లో భిక్షాటన కొనసాగిస్తున్నాడు. భిక్షాటనలో సంపాదించిన డబ్బును పాఠశాలలకు, అనాథాశ్రమాలకు, సీఎం సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నాడు. కొవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా మధురైలో ఉండిపోవాల్సి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు 8సార్లు రూ.10వేల చొప్పున మదురై కలెక్టర్కు అందించారు.
తనకంటూ ఏమీ దాచుకోకుండా సాధారణ, సంచార జీవనం గడుపుతూ సామాజిక బాధ్యతల్ని పంచుకుంటున్న పాండియన్ను అభినందిద్దామా!
"హైదరాబాద్ టు తిరుపతి" - గుంటూరు వెళ్లకుండానే నల్లగొండ, కడప మీదుగా నయా ట్రైన్!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్న్యూస్! - ఒక్క ట్రైన్లోనే తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం!

