ETV Bharat / offbeat

"పావురాలు" దారి ఎలా కనుక్కుంటాయి? - 'జీపీఎస్‌' మిస్టరీ తేల్చిన శాస్త్రవేత్తలు

పావురాలు గూడు ఎలా గుర్తిస్తాయి? - తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి!

Pigeon Navigation Mystery
Pigeon Navigation Mystery (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 3, 2026 at 12:27 PM IST

3 Min Read
Choose ETV Bharat

Pigeon Navigation Mystery : నేటి డిజిటల్ యుగంలో ఎవరికైనా ఏదైనా సమాచారం అందించాలంటే క్షణాల్లో పని. ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారితోనైనా సెకండ్స్ వ్యవధిలో మాట్లాడే రోజులివి. కానీ, సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో పావురాలే సమాచార సేవలను అందించేవి. ముఖ్యంగా ప్రాచీన కాలంలో(రాజుల పాలన) వీటి ద్వారానే సందేశాలను పంపించేవారు. నిర్దిష్ట చిరునామాలకు ఉత్తరాలు చేరవేసేవి. అలా సమాచార మార్పిడి కోసం పావురాలు నింగిలో వందల కిలోమీటర్లు ప్రయాణించినా తిరిగి తమ గూటికి అలవోకగా చేరుకునేవి. ఈ క్రమంలోనే చాలా మందికి ఒక సందేహం వస్తుంది. ఈరోజుల్లో మనం ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే జీపీఎస్‌ లేకుండా అడుగు వేయలేని పరిస్థితి! అలాంటిది పావురాలు ఎలాంటి జీపీఎస్ లేకుండానే వందల కిలోమీటర్లు ఎలా ప్రయాణిస్తాయి? దారిని ఎలా గుర్తిస్తాయి? తాజాగా జర్మనీ శాస్త్రవేత్తలు జరిపిన ఒక పరిశోధనలో అందుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ, ఆ పరిశోధనలో ఏం తేలిందో ఇప్పుడు తెలుసుకుందాం.

పావురాలు వందల కిలోమీటర్లు ప్రయాణించి, తిరిగి తమ గూటికి చేరుకునే సామర్థ్యం వెనుక ఉన్న మిస్టరీ దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు అంతుచిక్కకుండా ఉంది. ఇటీవల జర్మనీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధన అందుకు సమాధానాన్ని కనుగొంది. అయితే, ఏ మాత్రం ఊహించని రీతిలో పావురాల ప్రయాణ దిశానిర్దేశానికి(Navigation) సంబంధించిన రహస్యం వాటి "లివర్​"లో దాగి ఉండడం పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు "సైన్స్ జర్నల్​"లో ప్రచురితమయ్యాయి. జర్మనీలోని "మ్యాక్స్ ప్లాంక్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బిహేవియర్​"కు(Max Planck Institute of Animal Behavior) చెందిన శాస్త్రవేత్తలు ఈ రీసెర్చ్​ను నిర్వహించారు. అయితే, ఇప్పటివరకు పావురాలు, ఇతర వలస పక్షులు దిక్సూచి సాధనంగా భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి దారి కనుక్కుంటాయని శాస్త్రవేత్తలకు చాలాకాలంగా తెలుసు. కానీ, ఆ అయస్కాంత క్షేత్రాన్ని నిర్దిష్టంగా అవి ఎలా గుర్తిస్తాయి? అనే ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన జవాబు లభించలేదు.

ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు దీనిపై అనేక సూత్రీకరణలు చేశారు. కొందరు పరిశోధకులు ఈ పక్షుల కళ్లలో కాంతికి స్పందించే ప్రత్యేక కణాలు ఉంటాయని, వాటి ద్వారా అవి అయస్కాంత క్షేత్రాన్ని గుర్తిస్తాయని అభిప్రాయపడ్డారు. మరికొందరు శాస్తవేత్తలేమో ఈ విహంగాల ముక్కుల్లో చిన్నపాటి అయస్కాంత రేణువులు ఉంటాయని పేర్కొన్నారు. అయితే, వాటికి బలమైన ప్రయోగాత్మక ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో జర్మన్ పరిశోధకులు పావురాల శరీరంలో పలు అవయవాలను లోతుగా పరిశీలించారు. ముఖ్యంగా ఇమ్యునాలజీ, భౌతికశాస్త్రం, పక్షి వ్యవహారశైలికి సంబంధించిన అనేక అంశాలను శోధించారు.

"ఇక్కడ చేపలు ఎగురతాయి, అక్కడ మత్స్యాలు షాకిస్తాయి!" - ఈ జలపుష్పాల విశేషాలు తెలుసా?

అయస్కాంత సెన్సింగ్‌ ఎక్కడ జరుగుతోందన్నది గుర్తించేందుకు జర్మన్‌ శాస్త్రవేత్తలు పావురాల ముక్కు, కళ్లు, మెదడు సహా అనేక అవయవాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే కాలేయం, ప్లీహంలో అయస్కాంత లక్షణాలు ఉండొచ్చడానికి కొన్ని ఆధారాలను వారు గుర్తించారు. ఈ రెండు భాగాలు ఎర్రరక్త కణాలను విచ్ఛిన్నం చేసి, శరీరంలో ఐరన్‌ నిల్వ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నాయని కనుగొన్నారు.

జర్మన్ శాస్త్రవేత్తలు పరిశీలించిన కణజాలాలన్నింటిలో కాలేయంలోని(లివర్​) మ్యాక్రోఫేజెస్‌ అనే ప్రత్యేక ఇమ్యూన్‌ కణాల్లో ఐరన్‌ గాఢత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తద్వారా అవి సూపర్‌పారామ్యాగ్నెటిక్‌ లక్షణాలను సంతరించుకున్నాయని, భూ అయస్కాంత క్షేత్రానికి బలంగా స్పందిస్తున్నాయని తేల్చారు పరిశోధకులు. ఇదే క్రమంలో కొన్ని పావురాల శరీరంలో మ్యాక్రోఫేజెస్‌ అనే ప్రత్యేక ఇమ్యూన్‌ కణాలను తొలగించినప్పుడు అవి తమ గూటికి దారిని కనుగొనడానికి కష్టపడినట్లు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు శాస్త్రవేత్తలు.

నాలుగు గుడ్లు పెట్టిన "లాప్​వింగ్" - వర్షాల రాకతో వాటికి ఏం సంబంధం?

ఆ గ్రామంలో అందరూ కవలలే - పేర్లు పిలవాలంటే విజిల్‌ వేయాలి!