గుడి లోపల గుట్టుగా బావి నిర్మాణం - తవ్విచూస్తే పంచలోహ విగ్రహాలు!
రాష్ట్రంలో తవ్వకాల్లో బయల్పడుతున్న విగ్రహాలు - వెలుగులోకి వరుసగా మూడు ఘటనలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2026 at 4:08 PM IST
Panchaloha Idols : మొన్న కడప జిల్లాలో పుట్టలో, నిన్న ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా నదిలో, తాజాగా పల్నాడు జిల్లాలోని ఆలయ బావిలో పంచలోహ విగ్రహాలు బయల్పడ్డాయి. ఎంతో చారిత్రక నేపథ్యం, పేరెన్నికగన్న కట్టడాలు, ఆలయాలు కలిగిన ఆంధ్రావనిలో ఇంకా వెలుగులోకి రాని ఇలాంటి ఘటనలు అనేకం ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు.
మెరిసేదంతా బంగారం కాదండీ! - ఆభరణాలు కొనేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే బెస్ట్!
పురాతన బావిలో దాచిన విగ్రహాలు
పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలోని ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు చేపట్టగా ఏడు పంచలోహ విగ్రహాలు వెలుగుచూశాయి. పురాతన శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం లోపల బావిని గమనించి పైన ఉన్న మందపాటి రాళ్లు తొలగించగా ఈ విగ్రహాలు బయల్పడ్డాయి. దీంతో దేవాదాయ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులకు సమాచారం అందించి వారి సమక్షంలో విగ్రహాలను వెలికి చేశారు. ఇవి పంచ లోహ విగ్రహాలుగా పలువురు పేర్కొంటున్నారు. కానీ, ఇంకా గుర్తించాల్సి ఉంది. పూర్వం దొంగల బారి నుంచి ఆలయాన్ని, విగ్రహాలను కాపాడుకోవడానికి బావి ఏర్పాటు చేసి విగ్రహాలను దాచిపెట్టారని కథనాలు వినిపిస్తున్నాయి. విగ్రహాలతో పాటు ఆలయంలో మరోచోట మూడు రాగి పలకలను గుర్తించారు. దేవాలయంలో దొరికిన విగ్రహాలను స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పరిశీలించారు.

కృష్ణానదిలో శ్రీరాముడు
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణా నదిలో శ్రీరాముడి పంచలోహ విగ్రహం లభ్యం కాగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వందలు, వేల ఏళ్ల చారిత్రక ప్రాశస్త్యం కలిగిన గుడిమెట్ల కొండల్లో వజ్రాలు కూడా దొరుకుతాయనే నమ్మకంతో తరచూ తవ్వకాలు చేస్తుంటారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో ఇక్కడ విగ్రహాలు బయల్పడ్డాయి. 20 ఏళ్ల కిందట రామన్నపేట కొండల్లో జరిపిన తవ్వకాల్లో పంచ లోహ లక్ష్మీదేవి విగ్రహం లభించగా అప్పటి సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో ప్రభుత్వానికి అప్పగించారు. నేటికీ వజ్రాల అన్వేషణకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఇక్కడకు వచ్చి తవ్వకాలు జరుపుతుంటారు. వర్షాకాలంలో జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో స్థానికంగా సందడి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో మే 1న గ్రామాల్లో తిరుగుతూ చీపుర్లు అమ్ముకునే వారు నదిలో స్నానానికి దిగిన సమయంలో శ్రీరాముడి పంచలోహ విగ్రహం లభ్యం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి వెళ్లి విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించారు.

వాల్మీకంలో లక్ష్మీనృసింహుడు
ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 3న వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కోనరాజుపల్లెలో పంచలోహ విగ్రహాలు లభ్యమయ్యాయి. ఎస్సీ కాలనీ శివారులోని పుట్టలో దేవతామూర్తుల పంచలోహ విగ్రహాలు ఉన్నట్లు పదో తరగతి విద్యార్థి బాలిపోగు హరికృష్ణ గుర్తించాడు. గ్రామస్థుల సహకారంతో పుట్ట వద్ద పూజలు చేసిన తర్వాత తవ్వకాలు చేపట్టడంతో లక్మీనరసింహ స్వామి, లక్ష్మీదేవి, పంచముఖ ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహాలు లభించాయి. విషయం తెలిసి సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చి దేవతామూర్తులను దర్శించుకుని పూజలు చేశారు.
పిడుగుపాటును ముందే పసిగట్టే "యాప్స్" - మీ ఫోన్లో ఉన్నాయా?
పొలిటికల్ గేమ్ ఛేంజర్ "ఫ్రీ బస్"! - కేరళ, తమిళనాడుల్లోనూ విజయఢంకా!

