ఎండుమిర్చి వేసి "పల్లీ చట్నీ" చేయండి - సూపర్గా ఉంటుంది - 10 నిమిషాల్లో రెడీ!
-పల్లీ చట్నీని ఎప్పుడూ ఒకటే పద్ధతిలో చేస్తున్నారా? - ఇలా ట్రై చేయండి, కిర్రాక్గా ఉంటుంది!

Published : November 13, 2025 at 4:35 PM IST
Palli Chutney with Red Chilli: ఇడ్లీ, దోశ, వడ, బోండా ఇలా టిఫెన్ ఏదైనా అందులోకి పల్లీ చట్నీ కంపల్సరీ. వేడివేడి టిఫెన్ను ఈ చట్నీలో ముంచుకుని తింటుంటే ఆ టేస్ట్ వేరే లెవల్. అయితే పల్లీ చట్నీని చాలా మంది పచ్చిమిర్చి వేసి చేస్తుంటారు. కానీ ఎప్పుడూ అలానే కాకుండా ఎండుమిర్చి వేసి ఓసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. ఇక ఎక్స్ట్రాగా పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి వేసి చేస్తే ఆ రుచి మరింత బాగుటుంది. ఈ చట్నీని అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఎండుమిర్చి వేసి పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- నూనె - 1
- పల్లీలు - 1 కప్పు
- ఎండుమిర్చి - 10
- పుట్నాలపప్పు - పావు కప్పు
- పచ్చి కొబ్బరి ముక్కలు - పావు కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా

తాలింపు కోసం:
- నూనె - 2 టీస్పూన్లు
- ఆవాలు - అర టీస్పూన్
- జీలకర్ర - అర టీస్పూన్
- మినప్పప్పు - అర టీస్పూన్
- శనగపప్పు - అర టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - 2 రెమ్మలు

తయారీ విధానం:
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో పల్లీలు, ఎండుమిర్చి తుంపలు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి.
- పల్లీలు, ఎండుమిర్చి పర్ఫెక్ట్గా వేగిన తర్వాత పుట్నాలపప్పు వేసి మరో నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- పల్లీల మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్లోకి వేసుకోవాలి. ఆపై అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఓసారి గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం కొద్దికొద్దిగా వాటర్ పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

- పల్లీ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి.
- అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి.
- తాలింపు గింజలు వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపును పచ్చడిలో వేసి కలుపుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- పల్లీలు నూనెలో వేయించుకుంటాం కాబట్టి పొట్టు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు నూనెలో వేయించుకోవద్దు అనుకుంటే నార్మల్గా వేయించి పొట్టు తీసేస్తే సరి. అప్పుడు కేవలం ఎండుమిర్చి ఒక్కటే నూనెలో వేయించుకుంటే సరిపోతుంది.
- ఎండుమిర్చిని మీరు తినే రుచికి సరిపడేలా యాడ్ చేసుకోవాలి. ఎండుకారం కన్నా ఎండుమిర్చిని నూనెలో వేసి తీసుకుంటే పచ్చడి రుచి మరింత బాగుంటుంది.
బెల్లంతో జ్యూసీ జ్యూసీగా "ఉసిరికాయ మురబ్బా" - తయారీ చాలా సింపుల్, ఏడాది నిల్వ!

