సండే స్పెషల్ "మటన్ కీమా దమ్ బిర్యానీ" - సూపర్ టేస్ట్తో టమ్మీ ఫుల్ హ్యాపీ! - ప్రిపరేషన్ ఈజీ!
- చికెన్, మటన్ బిర్యానీలు రొటీన్ - ఇలా కీమాతో బిర్యానీ చేసుకుంటే టేస్ట్కు మైమరచిపోతారు!

Published : May 30, 2026 at 8:32 PM IST
How to Make Mutton Keema Dum Biryani : బిర్యానీకి ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉంటుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ దీనికి ఫ్యానే. అందుకే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు లాగించేస్తుంటారు. ఇక బిర్యానీ అంటే మెజార్టీ పీపుల్ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్తో చేసినవి మాత్రమే తింటుంటారు. కానీ కీమాతో కూడా అద్దిరిపోయే దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. రెగ్యులర్ బిర్యానీలతో పోలిస్తే దీని టేస్ట్ మరింత అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. కేవలం తక్కువ పదార్థాలతో తయారు చేసుకునే ఈ రెసిపీ తింటే టమ్మీ కూడా హ్యాపీ అయిపోతుంది. మరి లేట్ చేయకుండా కమ్మని, టేస్టీ కీమా దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
కీమా ఉడికించడానికి:
- మటన్ కీమా - 300 గ్రాములు
- పసుపు - అర టీస్పూన్
- ఉప్పు - 1 టీస్పూన్
- కారం - 1 టీస్పూన్
- యాలకులు - 3
- దాల్చినచెక్క - చిన్న ముక్క
- లవంగాలు - 2
రైస్ కుక్ చేయడానికి:
- బాస్మతీ బియ్యం - 1 గ్లాస్(300 గ్రాములు)
- ఉప్పు - రుచికి సరిపడా
- పచ్చిమిర్చి - 1
- బిర్యానీ ఆకు - 1
- యాలకులు - 2
- లవంగాలు - 2
- దాల్చినచెక్క - కొంచెం
- నిమ్మరసం - అర చెక్క
- నెయ్యి - 1 టీస్పూన్
- కొత్తిమీర, పుదీనా తరుగు - కొద్దిగా
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్

బిర్యానీ కోసం:
- నూనె - 4 టేబుల్స్పూన్లు
- ఉల్లిపాయలు - 3
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టేబుల్స్పూన్లు
- టమాటా - 1(పెద్దది)
- పెరుగు - 3 టేబుల్స్పూన్లు
- ధనియాల పొడి - ఒకటిన్నర టేబుల్స్పూన్లు
- కారం - 1 టీస్పూన్
- జీలకర్ర - అర టీస్పూన్
- గరం మసాలా - 1 టీస్పూన్
- పచ్చిమిర్చి - 2
- కొత్తిమీర, పుదీనా తరుగు - కొద్దిగా
- బిర్యానీ మసాలా - 1 టీస్పూన్
- నెయ్యి - 1 టేబుల్స్పూన్

తయారీ విధానం:
- ఓ గిన్నెలోకి బాస్మతీ బియ్యం తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి సరిపడా వాటర్ పోసి గంట సేపు నానబెట్టాలి. బాస్మతీ ఎంత తీసుకుంటే కీమా అంత తీసుకోవాలి.
- ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి మటన్ కీమా, పసుపు, ఉప్పు, కారం, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, అర కప్పు నీళ్లు పోసి మూత ఉంచి విజిల్ పెట్టాలి.
- స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ఉంచి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచాలి.
- ఈలోపు పదార్థాలను రెడీ చేసుకోవాలి. అందుకోసం ఉల్లిపాయలపై పొట్టు తీసేసి సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిలను కూడా సగానికి పొడుగ్గా చీల్చుకోవాలి. కొత్తిమీర, పుదీనాను సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాను మీడియం సైజ్లో ముక్కలుగా కట్ చేసి మిక్సీజార్లోకి వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి.

- స్టవ్ ఆన్ చేసి బిర్యానీ చేసుకోవడానికి అనువుగా ఉండే గిన్నె పెట్టి అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి.
- కాగిన నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి లో టూ మీడియం ప్లేమ్లో ఎర్రగా వేయించాలి. అంటే ఫ్రైడ్ ఆనియన్స్ మాదిరి వేయించాలి.
- ఉల్లిపాయలు చక్కగా వేగాక సగం తీసి పక్కన ఉంచాలి. మిగిలిన ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు మగ్గించాలి.
- అల్లం కూడా మగ్గినాక గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ వేసి కలుపుతూ మగ్గించాలి. టమాటా పేస్ట్ మగ్గి నూనె పైకి తేలినాక పెరుగు వేసి లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి.

- పెరుగు కూడా వేగి ఆయిల్ సెపరేట్ అయ్యాక ఉడికించిన కీమాను నీళ్లతో సహా వేసి కలుపుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మధ్యమధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి.
- కీమా ఉడికి అంటే నూనె పైకి తేలి గ్రేవీలాగా ఉన్నప్పుడు మూత పెట్టి గిన్నెను పక్కన ఉంచాలి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వొద్దు.
- అదే స్టవ్ మీద మరో గిన్నె పెట్టి 2 లీటర్ల నీరు పోసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, పచ్చిమిర్చి చీలికలు, బిర్యానీ ఆకు, నిమ్మరసం, నూనె, కొత్తిమీర, పుదీనా తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మరిగించాలి.
- వాటర్ మరుగుతున్నప్పుడు జల్లి గరిటెతో మసాలా దినుసులు, కొత్తిమీర తరుగు మొత్తం తీసేసి నానబెట్టుకున్న బాస్మతీ బియ్యాన్ని వేసి కలిపి ఉడికించాలి.
- రైస్ 90 శాతం అంటే బియ్యం ఉడికి లైట్గా పలుకు ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.

- ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కీమాలో కొద్దిగా తీసుకుని ఓ గిన్నెలోకి వేసుకోవాలి. మిగిలిన కీమాను గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలా సెట్ చేసుకోవాలి.
- ఆ కీమా మీద ఉడికించిన అన్నాన్ని సగం మేర లేయర్గా వేసుకోవాలి. అనంతరం రైస్ మీద పక్కన తీసిన కీమా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకోవాలి.
- మరోసారి ఆ కీమా మీద మిగిలిన రైస్ను వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర, పుదీనా తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా, నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. చివరగా రైస్ ఉడికించిన నీటిని ఓ పావు కప్పు అన్ని పోసి గిన్నెను సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసుకోవాలి. కావాలంటే నేతిలో వేయించిన జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. అలాగే బిర్యానీ మంచి కలర్లో కనిపించడానికి చిటికెడ్ ఎల్లో ఫుడ్ కలర్ను కొన్ని నీళ్లలో కలిపి పోసుకుంటే సరి.
- చివరగా దాని మీద మూత ఉంచి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
- కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే పొడిపొడిగా ఉండి సూపర్ టేస్టీ అయిన మటన్ కీమా దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరి. నచ్చితే మీరూ ట్రై చేయండి.

అద్దిరిపోయే "చికెన్-గోంగూర బిర్యానీ" - ఇలా ప్రిపేర్ చేసుకోండి!

