సిసలైన "మిరియాల చారు"! - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోవాల్సిందే!
- ఈ పద్ధతిలో 'మిరియాల చారు' చేయండి - ఘాటు ఘాటుగా, భలే రుచిగా!

Published : October 23, 2025 at 3:31 PM IST
Miriyala Charu Recipe : వెదర్ కూల్గా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో ఘాటుఘాటుగా ఏదైనా రసం పోసుకుని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్లో ఎక్కువ మందిని జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు తరుచూ ఇబ్బంది పెడుతుంటాయి. దాంతో ఏమి తిన్నా నోటికి అంత టేస్టీగా అనిపించదు. ఈ క్రమంలోనే చాలా మంది రకరకాల రసం రెసిపీలు ట్రై చేస్తుంటారు. అందులో భాగంగానే కొంతమంది "మిరియాల రసం" చేసుకుంటుంటారు.
కానీ, అంత పర్ఫెక్ట్గా కుదరదు. అలాంటి వారు ఓసారి ఈ పద్ధతిలో మిరియాల చారు చేసుకుని చూడండి. మంచి రుచికరంగా ఉండి వేడివేడిగా అద్దిరిపోతుంది. చల్లని వేళ ఘాటు ఘాటుగా గొంతులోకి పోతుంటే ఆ కిక్కే వేరబ్బా అనుకోవాల్సిందే! రుచి మాత్రమే కాదు.. జలుబు, దగ్గు, గొంతునొప్పి సమస్యల నుంచి కూడా రిలీఫ్ లభిస్తుంది. పైగా దీన్ని చాలా తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారైనా ఈ కొలతలతో కమ్మగా చేసుకోవచ్చు. మరి, ఈ హెల్దీ అండ్ టేస్టీ మిరియాల చారుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- మిరియాలు - ఒక చెంచా
- వెల్లుల్లి రెబ్బలు - పది
- జీలకర్ర - ఒక చెంచా
- చింతపండు - నిమ్మకాయంత
- టమాటా - ఒకటి
- నూనె - చెంచా
- పసుపు - పావుచెంచా
- ఎండుమిర్చి - మూడు
- ఆవాలు - పావుచెంచా
- కరివేపాకు - రెండు రెబ్బలు
- కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు
- ఉప్పు - రుచికి తగినంత
- ఇంగువ - పావుచెంచా
చల్లని వేళ కరకరలాడే "పనీర్-కార్న్ వడలు" - తక్కువ టైమ్లో అప్పటికప్పుడు రెడీ!

తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ చారు తయారీకి ముందుగా ఒక గిన్నెలో చింతపండును తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆపై అందులో అరలీటర్ మంచి నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి.
- చింతపండు నానేలోపు మిక్సీ జార్ తీసుకుని అందులో మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసుకుని వీటన్నింటిని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కనుంచాలి.
- ఇప్పుడు మంచిగా నానిన చింతపండు నుంచి రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం చారు తయారీకి స్టవ్ మీద కాస్త మందంగా ఉండే గిన్నె పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత అందులో ఆవాలు, పసుపు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
- అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా మగ్గనివ్వాలి. టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసి బాగా కలిపి మరిగించుకోవాలి.
- ఆ మిశ్రమం బాగా వేడెక్కి మరుగుతున్నప్పుడు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు-వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.

- అలాగే, రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు, సన్నని కొత్తిమీర తరుగు, ఇంగువ వేసి కలిపి బాగా మరిగించి దింపేసుకుంటే చాలు.
- అంతే, ఘాటు ఘాటుగా ఘుమాయించే కమ్మని "మిరియాల చారు" నిమిషాల్లోనే రెడీ అవుతుంది!
- మరి, నచ్చితే మీరు ఎప్పుడూ చేసుకునే టమాటా రసం, చింతపండు రసం వంటివి కాకుండా ఓసారి ఇలా 'మిరియాల రసం' చేయండి. చల్లని వేళ ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు.

కమ్మని "ఉసిరికాయ రోటి పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అమృతమే - అప్పటికప్పుడు చేసుకోవచ్చు!
చింతపండు రసంతో "ఉల్లిపాయ కర్రీ" - వేడివేడి అన్నంలోకి అదుర్స్!

