మినప్పప్పుతో "మైసూర్ బోండాలు" - టిఫెన్ సెంటర్ మాదిరి రుచిగా ఉంటాయి!
-పిండి పులియబెట్టకుండానే టేస్టీ "బోండాలు" - తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!

Published : January 9, 2026 at 9:32 AM IST
Minapa Bonda Recipe in Telugu : మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా మంది ఇష్టంగా తినే వాటిల్లో 'మైసూర్ బోండా' ఒకటి. అయితే, ఎక్కువ మంది వీటిని మైదా, గోధుమపిండి వంటి వాటితో తయారు చేసుకుంటుంటారు. అలాకాకుండా ఓసారి ఇలా మినప్పప్పుతో "మైసూర్ బోండాలు" వేసుకుని చూడండి. ఇవి తినేటప్పుడు సన్నని ఉల్లిపాయ, పచ్చికొబ్బరి ముక్కలు పంటికి తగులుతూ భలే టేస్టీగా ఉంటాయి. వీటి తయారీకి బియ్యప్పిండి, వంటసోడా వంటివి అవసరం కూడా లేదు. అలాగే, ఇవి నూనెను కూడా అంతగా పీల్చుకోవు! టిఫెన్ సెంటర్ స్టైల్లో క్రిస్పీగా, సూపర్ టేస్టీగా ఉండే ఈ బోండాలను పిల్లలైతే ఒకటికి రెండు చాలా ఇష్టంగా తింటారు. మరి, లేట్ చేయకుండా నోరూరించే ఈ మినప బోండాలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- మినప్పప్పు - రెండు కప్పులు
- జీలకర్ర - రెండు టీస్పూన్లు
- మిరియాలు - రెండు టీస్పూన్లు
- పచ్చిమిర్చి - ఆరేడు
- ఉల్లిపాయలు - రెండు(పెద్ద సైజ్వి)
- సన్నని పచ్చికొబ్బరి ముక్కలు - కొన్ని
- సన్నని అల్లం తురుము - ఒకట్రెండు చెంచాలు
- కరివేపాకు - కొద్దిగా
- ఉప్పు - రుచికి తగినంత
- నూనె - వేయించడానికి సరిపడా
రాగిపిండితో కరకరలాడే "చెక్కలు" - పండక్కి పావుగంటలోనే తయార్!

తయారీ విధానం :
- ఈ రుచికరమైన బోండాల తయారీకి ముందుగా ఒక గిన్నెలో మినప్పప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి మూడు గంటలపాటు నానబెట్టాలి.
- పప్పు నానేలోపు రెసిపీలోకి అవసరమైన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలను వీలైనంత సన్నగా తరుక్కొని పక్కనుంచాలి. అలాగే, సన్నని అల్లం తురుమును రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- మూడు గంటల అనంతరం బాగా నానిన మినప్పప్పున మరోసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆపై అందులో అవసరం మేరకు తగినన్ని నీళ్లను(నాలుగు చెంచాల వరకు) కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి.

- తర్వాత గ్రైండ్ చేసుకున్న మినప పిండిని ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై అందులో జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన మిరియాల పొడి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని పచ్చిమిర్చి తరుగు, సన్నని ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు వేసుకోవాలి.
- అలాగే, కొన్ని సన్నగా కట్ చేసుకున్న పచ్చికొబ్బరి ముక్కలు, కరివేపాకు తరుగు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని పదార్థాలన్నీ పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి.

- అనంతరం బోండాల తయారీకి స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చేతితో కొద్దికొద్దిగా తీసుకుంటూ కాగుతున్న నూనెలో బోండాల్లా వేసుకోవాలి.
- పాన్లో వేయించడానికి సరిపడినన్ని వేసుకున్నాక వెంటనే కదపకుండా కాసేపు కాలనివ్వాలి. ఆ తర్వాత చిల్లుల గరిటెతో అన్ని వైపులా తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుని అర నిమిషం పాటు ఉంచాలి. ఇలా చేయడం ద్వారా టిష్యూ పేపర్ అదనపు నూనెను పీల్చేస్తుంది.

- ఆపై వేడి వేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. అంతే, క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే "మినప్పప్పు బోండాలు" అప్పటికప్పుడు రెడీ అవుతాయి!
- మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ పద్దతిలో మైసూర్ బోండాలు చేసుకుని చూడండి. టిఫెన్ సెంటర్ స్టైల్లో భలే రుచికరంగా ఉండే వీటిని ఇంటిల్లిపాదీ చాలా ఇష్టంగా తింటారు.
- ఒకవేళ తక్కవ క్వాంటిటీలో ఈ బోండాలు చేసుకోవాలనుకుంటే మినప్పప్పుతో పాటు ఇతర పదార్థాలను తగ్గించి తీసుకుంటే సరిపోతుంది.

చిట్కాలు :
- ఇక్కడ మినప పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేయవద్దు. చాలా తక్కువగా నీళ్లు వేసుకుని పిండిని కాస్త గట్టిగానే ఉండేలా(వడల పిండి మాదిరిగా) ప్రిపేర్ చేసుకోవాలి.
- అలాగే, ఈ రెసిపీలో మీరు ఒకవేళ జీలకర్ర వద్దనుకుంటే దాని ప్లేస్లో వాముని అయినా యూజ్ చేయొచ్చు.
శనగపిండి లేకుండానే కరకరలాడే "జంతికలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!
రెండు ఉల్లిపాయలతో క్రిస్పీ "కట్ లెట్స్" - 5 నిమిషాల్లో ఈవెనింగ్ స్నాక్ రెడీ!

