చింతపండు లేకుండానే "చేపల పులుసు" - ఇలా చేసి తింటే జిందగీ ఖుష్ అయిపోద్ది!
నోరూరించే చేపల పులుసు - ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 2, 2026 at 4:47 PM IST
Fish Pulusu without Tamarind : చేపలు పులుసు పేరు చెబితే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఉప్పు, మసాలాలు, కారం పట్టించి చింతపండు రసంలో ఉడికించడం వల్ల రుచి అద్దిరిపోతుంది. అందుకే మెజార్టీ పీపుల్ ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఇది చేయాలంటే కచ్చితంగా చింతపండు వాడాలి. కానీ ఇది లేకుండానే ఈ కర్రీ చేయుచ్చని మీకు తెలుసా? లేదంటే మాత్రం ఓసారి ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో చేశారంటే అద్దిరిపోతుంది.
కర్ణాటక స్పెషల్ "క్యాబేజీ కుర్మా" - ఒక్కసారి తిన్నారంటే అదరహో అనాల్సిందే!

కావాల్సిన పదార్థాలు :
- చేప ముక్కలు - 2 కేజీలు
- పసుపు - 1 టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నిమ్మరసం - 1 టీ స్పూన్
- పచ్చిమిర్చి - 8
- ఆయిల్ - 6 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు - కొద్దిగా
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 4 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయ పేస్ట్ - ఒక కప్పు
- ధనియాల పొడి - 2 టీ స్పూన్లు
- కారం - 6 టీ స్పూన్లు
- జీలకర్ర పొడి - ఒకటిన్నర టీ స్పూన్
- మామిడికాయలు - 2
- కొత్తిమీర - కొంచెం

తయారీ విధానం :
- ఈ రెసిపీ ముందుగా గిన్నెలో రెండు కేజీల చేప ముక్కలు వేసి శుభ్రంగా కడగాలి. అనంతరం ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు, రెండు టీ స్పూన్ల కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి.
- అలాగే రెండు మామిడికాయలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో తరిగి ఉంచిన మామిడికాయ ముక్కలు, సరిపడా నీళ్లు పోసి మూతపెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఆ తర్వాత ముక్కలను గుజ్జుగా చేసి గిన్నెలోకి తీసుకోవాలి.
- అలాగే కావాల్సిన పరిమాణంలో ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి. అనంతరం వీటిని మిక్సీజార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి.

- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో ఆరు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి.
- ఇవి వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, నాలుగు టేబుల్ స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి వేగనివ్వాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, నాలుగు టీ స్పూన్ల కారం, రెండు టీ స్పూన్ల ధనియాల పొడి, ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసి ఫ్రై చేయాలి.

- మసాలాలు బాగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఆరు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు చేప ముక్కలు వేసి కలపాలి. అనంతరం మూతపెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
- 5 నిమిషాల అనంతరం ఉడికించిన మామిడికాయ గుజ్జు, కొద్దిగా కొత్తమీర వేసి కలిపి మూతపెట్టాలి. ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

- అంతే చింతపండు లేకుండానే ఘుమఘుమలాడే చేపల పులుసు తయారైనట్లే!
- ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి ఈ విధంగా ట్రై చేయండి.
కమ్మని "కీరదోసకాయ పచ్చడి" - ఇలా చేస్తే నోటికి పుల్లగా, కారంగా!
పసందైన "పనీర్ పాయసం" - ఇంట్లోనే ఇలా తియ్యని వేడుక చేసుకోండి!

