పాతకాలం నాటి "కంద కోడిగుడ్డు పులుసు" - ఈ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
కందగడ్డ, కోడిగుడ్లతో ఓసారి ఇలా ట్రై చేయండి - కడుపు నిండా కమ్మగా తినేస్తారు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 19, 2026 at 11:16 AM IST
Kanda Kodiguddu Pulusu : ఇండ్లలో వివిధ రకాల వంటలు చేస్తుంటారు. రోటీన్కి భిన్నంగా ఏదైనా రెసిపీ చేయాలని మీరు ప్లాన్ చేస్తున్నారా? అందుకే మీకోసం ఇవాళ పాతకాలం నాటి కంద కోడిగుడ్డు పులుసు రెసిపీని తీసుకొచ్చాం. ఈ పద్ధతిని పాటిస్తూ ఓసారి ఇంట్లో చేశారంటే ఇళ్లంతా ఘుమఘుమలాడాల్సిందే. అంతేకాక తిన్నవారు సూపర్ అనాల్సిందే. మరి ఈ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు ఓ లుక్కేయండి.
ఘుమఘుమలాడే "మష్రూమ్ కర్రీ" - కొత్త వాళ్ల కోసం సింపుల్ పద్ధతి!

కావాల్సిన పదార్థాలు :
- కందగడ్డ - 300 గ్రాములు
- ఆయిల్ - 6 టేబుల్ స్పూన్లు
- ఉడికించిన కోడిగుడ్లు - 5
- పసుపు - సరిపడా
- దాల్చినచెక్క - 1
- లవంగాలు - 4
- యాలకులు - 2
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- ఎండుకొబ్బరి ముక్కలు - 3 టేబుల్ స్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు - 8
- అల్లం ముక్క - 1
- నువ్వులు - 1 టేబుల్ స్పూన్
- గసగసాలు - అర టేబుల్ స్పూన్
- ఉల్లిపాయలు - 2
- ఉప్పు - రుచికి సరిపడా
- కరివేపాకు - కొద్దిగా
- పచ్చిమిర్చి - 2
- కారం - అర టేబుల్ స్పూన్
- చింతపండు - 50 గ్రాములు
- బెల్లం - 1 టేబుల్ స్పూన్
- కొత్తిమీర - కొంచెం
- గరంమసాలా - 2 చిటికెడ్లు

తయారీ విధానం :
- ముందుగా చేతులకు నూనె రాసి 300 గ్రాముల కందగడ్డను పొట్టు తీసి మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కంద ముక్కలు పసుపుఉప్పు కలిపిన నీళ్లలో వేసి బాగా కడిగి పక్కనుంచాలి. అలాగే రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి తరిగి ఉంచాలి.
- అలాగే స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు, సరిపడా నీళ్లు పోయాలి. ఇప్పుడు మూతపెట్టి మంటను హై ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
- అదేవిధంగా ఓ గిన్నెలో 50 గ్రాముల చింతపండు, సరిపడా నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. పదిహేను నిమిషాల తర్వాత రసం తీసి పక్కనుంచాలి.

- అనంతరం స్టవ్ ఆన్ చేసి పాన్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఐదు ఉడికించిన ఎగ్స్కు గాట్లు పెట్టి ఇందులో వేయాలి. ఆపైన రెండు చిటికెడ్ల పసుపు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత వీటిని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇదే నూనెలో ఒక దాల్చినచెక్క, నాలుగు లవంగాలు, రెండు యాలకులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, మూడు టేబుల్ స్పూన్ల ఎండుకొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇందులోనే ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు, ఒక అల్లం ముక్క యాడ్ చేసి వేగనివ్వాలి.
- అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, అర టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీజార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి.

- ఇదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి.
- ఆనియన్స్ వేగిన తర్వాత ఉడికించిన కంద ముక్కలు, రెండు చిటికెడ్ల పసుపు, అర టేబుల్ స్పూన్ కారం వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి.

- ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ , తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసి రెండు నిమిషాల పాటు మగ్గించాలి. అనంతరం వేయించిన ఎగ్స్, ఒక కప్పు వేడి నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసి కలపాలి.
- చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగు, రెండు చిటికెడ్ల గరం మసాలా యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు ఉడికించాలి.
- పది నిమిషాల తర్వాత చూస్తే కంద కోడిగుడ్డు పులుసు రెడీ అయినట్లే!
నోట్లో వేసుకోగానే కరిగిపోయే "షీర్ కుర్మా" - రంజాన్ మాసంలో ఇలాగే చేస్తుంటారు!
బెండకాయలతో ఇంటిల్లిపాదీకి నచ్చే "పచ్చడి"- ఇలా మిక్సీ పట్టి చేస్తే సూపర్ టేస్ట్!

