సరికొత్తగా "ఎండు రొయ్యల పచ్చడి" - ఆ రుచికి మైమరచిపోతారు!
ఎండు రొయ్యలతో ఇలా పచ్చడి ట్రై చేయండి - ఇంటిల్లిపాదీ సూపర్ అనాల్సిందే!

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 2, 2026 at 12:12 PM IST
Endu Royyala Pachadi in Telugu : ఎండు రొయ్యలతో కర్రీ లేదా ఫ్రై ఎక్కువగా చేస్తుంటారు. లేదంటే టమోటా, వంకాయ, గోంగూర వంటి వాటితో కలిపి కాంబినేషన్ కర్రీలు చేస్తారు. అందుకే ఇవాళ మీకోసం ఓ కొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే ఎండు రొయ్యల పచ్చడి. చికెన్, మటన్ తిని బోర్ కొట్టినవారికీ ఇది సరికొత్త రుచినిస్తుంది. ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు! రొయ్యలంటే నచ్చని పిల్లలూ కూడా దీనిని ఇష్టంగా తినేస్తారు. పైగా దీన్ని చాలా తక్కువ సమయంలోనే రెడీ చేసుకోవచ్చు. మరి ఇందుకు కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా?
కమ్మని "కీరదోసకాయ పచ్చడి" - ఇలా చేస్తే నోటికి పుల్లగా, కారంగా!

కావాల్సిన పదార్థాలు :
- ఎండు రొయ్యలు - ఒక కప్పు
- ఆయిల్ - 6 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయలు - 2
- అల్లం ముక్కలు - 1 టీ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 1 టీ స్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- ఎండుమిర్చి - 6
- చింతపండు - కొద్దిగా
- పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు
- కొత్తిమీర - కొంచెం
- ఉప్పు - రుచికి సరిపడా
- మామిడికాయ - 1

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా కప్పు ఎండు రొయ్యలను తీసుకొని తల, తోక భాగం తీసేసి క్లీన్ చేసుకోవాలి. అలాగే కావాల్సిన పరిమాణంలో పచ్చికొబ్బరిని, రెండు ఉల్లిపాయలు, ఒక మామిడికాయను తరిగి ఉంచాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత కప్పు ఎండు రొయ్యలు వేసి వేయించాలి. ఆ తర్వాత వీటిని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.

- ఇదే పాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆనియన్స్ వేగాక ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు, ఒక టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేయాలి.
- ఇందులోనే ఆరు ఎండుమిర్చి, కొద్దిగా చింతండు వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి. అనంతరం కప్పు పచ్చికొబ్బరి తురుము, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేయాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి మూతపెట్టి మగ్గించాలి.

- అనంతరం మిక్సీజార్ వేయించిన రొయ్యలు, కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలుఎండుమిర్చి మిశ్రమం యాడ్ చేసి కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి.
- ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. నూనె వేడైన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

- అంతే ఘుమఘుమలాడే ఎండు రొయ్యల పచ్చడి సిద్ధంగా ఉంటుంది!
- వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసి తిన్నారంటే ఇంకో రెండు ముద్దలూ ఎక్కువగానే తింటారు.
- అనంతరం ఈ పచ్చడి గ్లాస్జార్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది!
- మరి మీకు ఈ రెసిపీ నచచ్చితే ఓసారి ట్రై చేయండి.
కర్ణాటక స్పెషల్ "క్యాబేజీ కుర్మా" - ఒక్కసారి తిన్నారంటే అదరహో అనాల్సిందే!
పసందైన "పనీర్ పాయసం" - ఇంట్లోనే ఇలా తియ్యని వేడుక చేసుకోండి!

