అమ్మమ్మ స్టైల్ "నాటు చిక్కుడు పచ్చడి" - ఈ రెసిపీ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది!
నాటు చిక్కుడు పచ్చడి - వేడి వేడి అన్నంలో 'ఒక్క ముద్దచాలు' అనిపిస్తుంది!

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 2, 2026 at 12:27 PM IST
CHIKKUDUKAYA PACHADI : చిక్కుడు కాయ కర్రీలో మధ్యలో వచ్చే గింజలు ఎంతో రుచిగా ఉంటాయి. నాటు చిక్కుళ్లలో ఈ గింజలు ఎక్కువగా దొరుకుతుంటాయి. వీటి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి నాటు చిక్కుళ్లు మీకెపుడైనా దొరికితే ఓ సారి ఇలా నిల్వ పచ్చడి తయారు చేసి పెట్టుకోండి. కర్రీ చేయడానికి టైం లేనపుడు చాలా టేస్టీగా తినేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన పద్ధతిలో ఓ సారి చట్నీ ట్రై చేసి చూడండి.
"పండు మిర్చి, టమోటా నిల్వ పచ్చడి" - అప్పటికప్పుడు సింపుల్గా ఇలా చేసుకోవచ్చు!

కావల్సిన పదార్థాలు :
- చిక్కుడు కాయలు - పావు కేజీ
- వెల్లుల్లి - 20
- పసుపు - అర స్పూన్
- మెంతి పొడి - అర స్పూన్
- కల్లుప్పు - రుచికి సరిపడా
- ఆవాలు - అర స్పూన్
- జీలకర్ర - అర స్పూన్
- పచ్చి శనగపప్పు - అర స్పూన్
- మినపగుండ్లు - అర స్పూన్
- ఎండు మిర్చి - 2
- కరివేపాకు - 1 రెమ్మ
- చింతపండు - 50 గ్రాములు
- కారం - 3 స్పూన్లు
- నువ్వుల నూనె - 150 గ్రాములు
- ఇంగువ - కొద్దిగా

తయారీ విధానం :
- ముందుగా చిక్కుడు కాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోవాలి. చిక్కుడు కాయలను నేరుగా ఫ్రై చేస్తాం కాబట్టి పుచ్చులు లేకుండా జాగ్రత్త పడాలి. నాణ్యమైన చిక్కుళ్లు పావుకేజీ దొరికినా చాలు!

- ఇపుడు స్టవ్పై కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడి కాగానే తడి లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడు కాయలను నూనెలో వేయించాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాలి. లేదంటే అవి చిట్లి వేడి నూనె మీదపడే ప్రమాదం ఉంది. చిక్కుళ్లను మధ్యస్థంగా వేయించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.

- ఇపుడు అదే కడాయిలో మిగిలిన నూనెలో తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినపగుండ్లు, ఎండుమిర్చి వేసుకుని చిటపటలాడించాలి. ఆ తర్వాత సగం వెల్లుల్లి పాయలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుని 2 నిమిషాల తర్వాత ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

- ఇపుడు పచ్చడి తయారీ కోసం చిక్కుడు కాయలను ఓ గిన్నెలోకి తీసుకుని మిగిలిన వెల్లుల్లి పాయలు కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే రెడీ చేసుకున్న పోపు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు పేస్ట్ వేసుకోవాలి. (చింతపండును ఉడికించి పేస్ట్ తయారు చేసుకుని తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా కలుపుకోవాలి. ఆ తర్వాత కారం, మెంతి పిండి, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే! ఇలా రెడీ చేసుకున్న పచ్చడి వేడి వేడి అన్నంలోకి ఎంతో కమ్మగా ఉంటుంది. వేయించిన చిక్కుళ్లలో గింజలు పంటికి తగులుతుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది.
టేస్టీ "మునగాకు కారం పొడి" - ఇడ్లీ, దోసె, వేడి వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది!
గోంగూర నిల్వ పచ్చడి ఇలా పెడితే ఏడాదంతా నిల్వ ఉంటుంది - ఆరబెట్టే అవసరమే లేదు!

