బిహారీ స్టైల్ "చికెన్ మసాలా కర్రీ" - ఇలా చేస్తే ఇంట్లో పండగే!
అద్దిరిపోయే రుచితో చికెన్ కర్రీ - ఒక్కసారి తింటే ఫేవరెట్ లిస్టులో చేరడం పక్కా!
Bihari Chicken Curry (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 31, 2025 at 12:08 PM IST
Bihari Chicken Curry : చికెన్తో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. అయితే ఓసారి ఇలా బిహారీ స్టైల్ చికెన్ మసాలా కర్రీ ట్రై చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలాడాల్సిందే. ఈ విధంగా ఇంట్లో చేసి పెడితే పిల్లలు,పెద్దలు ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
నోటికి కొత్త రుచినిచ్చే "కాకరకాయ ఉల్లి కారం" - చేదు అస్సలే ఉండదు!

కావాల్సిన పదార్థాలు :
- చికెన్ - అర కిలో (500 గ్రాములు)
- కారం - అర టేబుల్ స్పూన్
- పసుపు - ఒకటిన్నర టీ స్పూన్
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- ఆయిల్ - 9 టేబుల్ స్పూన్లు
- లవంగాలు - 12
- జాపత్రి - 1
- యాలకులు - 7
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- దాల్చినచెక్క - 2
- మిరియాలు - అర టీ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- ఆవాలు - అర టీ స్పూన్
- ఎండుమిర్చి - 2
- ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
- పచ్చిమిర్చి - 3
- వెల్లుల్లి - 3
- అల్లం - కొద్దిగా
- జీలకర్ర పొడి - 1 టీ స్పూన్
- ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
- కారం - 1 టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం :
- ముందుగా గిన్నెలో అర కిలో చికెన్, అర టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు వేయాలి. అలాగే కొద్దిగా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కలపాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. అనంతరం మూతపెట్టి గంట సేపు పక్కనుంచాలి.
- ఇంకోవైపు మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి పాన్లో ఏడు లవంగాలు, ఒక జాపత్రి, మూడు యాలకులు వేయాలి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక దాల్చినచెక్క, అర టీ స్పూన్ మిరియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీజార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

- అలాగే గిన్నెలో మూడు పచ్చిమిర్చి, ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్కలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
- మరోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలు వేయాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో ఉంచి మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ వేయించాలి. అనంతరం చికెన్ ముక్కలను తీసి ప్లేట్లో వేయాలి.
- ఇదే కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత రెండు ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు, నాలుగు యాలకులు వేయాలి. అదేవిధంగా ఒక దాల్చిన చెక్క, ఐదు లవంగాలు వేసి వేగనివ్వాలి. ఇందులోనే కప్పు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత మూతపెట్టి మగ్గించాలి.
- ఆనియన్స్ మగ్గుతున్నప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి అల్లంవెల్లుల్లి మిశ్రమం, రెండు వెల్లుల్లి వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూతపెట్టి 12 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.

- ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేయాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో అర కప్పు నీళ్లు పోసి కలపాలి.
- ఆయిల్ పైకి తేలిన తర్వాత వేయించిన చికెన్ ముక్కలు, ఒకటిప్పావు టేబుల్ స్పూన్ల గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి, కప్పుప్పావు వేడి నీళ్లు పోసి మూతపెట్టి 20 నిమిషాల పాటు ఉడికించాలి.

- ఇరవై నిమిషాల తర్వాత చివరన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అంతే బిహారీ స్టైల్ చికెన్ మసాలా కర్రీ రెడీగా ఉంటుంది!
పిజ్జా చేయడం చాలా ఈజీ అని తెలుసా? - మైదా, ఓవెన్ అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు!

