పచ్చికారంతో నోరూరించే "ఆలూ కర్రీ"! - సరికొత్త రుచిలో భలే కమ్మగా!
- రొటీన్ బంగాళాదుంప కర్రీని పక్కన పెట్టేయండి - ఇంటిల్లిపాదీ మెచ్చే ఈ రెసిపీని తప్పకుండా ట్రైచేయండి - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవడం పక్కా!

Published : January 5, 2026 at 9:48 AM IST
Aloo Curry with Pachi Karam : కొన్ని కూరలు ఎండుకారంతో చేసిన దానికంటే పచ్చికారంతో చేసినవి భలే రుచికరంగా ఉంటాయి. ఇప్పుడు మీ అందరి కోసం అలాంటిదే ఒక అద్భుతమైన రెసిపీని తీసుకొచ్చాం. అదే, పచ్చికారంతో నోరూరించే "ఆలూ కర్రీ". నార్మల్గా బంగాళాదుంపతో చేసే వంటకాలంటేనే ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు. అయితే, అందరూ మెచ్చే ఆలూ కర్రీనే ఎప్పటిలాకాకుండా కాస్త మార్చి ఇలా చేశారంటే మరింత టేస్టీగా అద్దిరిపోతుంది. వావ్ సూపర్ అంటూ పిల్లల నుంచి పెద్దల వరకు లొట్టలేసుకుంటూ తింటారు. ఇది అన్నంతోపాటు చపాతీ, రోటీల్లోకి భలే రుచికరంగా ఉంటుంది. అలాగే, ఈ కర్రీని ఎలాంటి హడావుడి లేకుండా చాలా తక్కువ టైమ్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- అరకిలో - ఆలుగడ్డలు
- నాలుగైదు టేబుల్స్పూన్లు - నూనె
- ఒక టీస్పూన్ - జీలకర్ర
- రెండు కప్పులు - సన్నని ఉల్లిపాయ తరుగు
- అర టీస్పూన్ - పసుపు
- రుచికి తగినంత - ఉప్పు
- రెండు టీస్పూన్లు - ధనియాలపొడి
- ఒక టీస్పూన్ - జీలకర్రపొడి
- కొద్దిగా - కసూరిమేథి
- కొంచెం - కొత్తిమీర తరుగు

తయారీ విధానం :
- నోరూరించే ఈ రుచికరమైన కర్రీ తయారీకి ముందుగా పచ్చి బంగాళాదుంపలను పీలర్ లేదా చాకుతో పైన పొట్టును తొలగించుకోవాలి.
- ఆపై వాటిని శుభ్రంగా కడిగి మీడియం సైజ్లో క్యూబ్స్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- తర్వాత కట్ చేసిన ఆలూ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని అవి మునిగేంత వరకు వాటర్ పోసి, ఒక టీస్పూన్ ఉప్పు వేసి కలిపి మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.
- ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, బంగాళాదుంపలను మరీ మెత్తగా కాకుండా70 శాతం ఉడికే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది.
- ఆలూ ఉడికేలోపు రెసిపీలోకి అవసరమైన ఒక స్పెషల్ పచ్చిమిర్చి పేస్ట్ను సిద్ధం చేసుకోవాలి.
స్పైసీ స్పైసీగా అద్దిరిపోయే "చికెన్ రసం" - ఈ సీజన్లో తప్పక ట్రై చేయాల్సిందే!

పచ్చిమిర్చి మసాలా పేస్ట్ కోసం :
- పచ్చిమిర్చి - రుచికి తగినన్ని
- వెల్లుల్లి రెబ్బలు - పదిహేను
- కొత్తిమీర - రెండు కప్పులు
- అల్లం - రెండు అంగుళాల ముక్క
- పుదీనా - కొద్దిగా
- దాల్చిన చెక్క - రెండు చిన్న ముక్కలు
- యాలకులు - నాలుగు
- వేయించిన పల్లీలు - నాలుగైదు టేబుల్స్పూన్లు
- లవంగాలు - ఐదారు

- ఇందుకోసం మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లు రెబ్బలు, అల్లం ముక్క, మీ రుచికి తగినన్ని పచ్చిమిర్చి, కాడలతో సహా కొత్తిమీర, కాస్త పుదీనా, వేయించిన పల్లీలు వేసుకోవాలి.
- అలాగే, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులతో పాటు కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద ఉడుకుతున్న బంగాళాదుంప ముక్కలు 70 శాతం వరకు ఉడికాయనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వేడి నీళ్లను వడకట్టి పక్కన ఉంచాలి.
- అనంతరం కర్రీ తయారీకి స్టవ్ మీద మరో పాన్ ఉంచి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత జీలకర్ర, సన్నని ఉల్లిపాయ తరుగు వేసి బాగా వేయించుకోవాలి.
- ఆనియన్స్ మంచిగా వేగాయనుకున్నాక పసుపు వేసి కలపాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మసాలా పేస్ట్ను యాడ్ చేసుకుని కలుపుతూ బాగా ఫ్రై చేయాలి.
- పచ్చిమిర్చి పేస్ట్ చక్కగా వేగి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు అందులో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసుకుని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను యాడ్ చేసుకుని మసాలా మిశ్రమం ఆలూ ముక్కలకు పట్టేలా ఒకసారి బాగా కలపాలి.

- అనంతరం పాన్పై మూత ఉంచి లో-ఫ్లేమ్లో మూడ్నాలుగు నిమిషాలు మగ్గనివ్వాలి.
- అలా ఉడికించిన తర్వాత మూత తీసి గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలపాలి.
- ఆపై పాన్ మీద మూత ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఆ మిశ్రమం నుంచి లైట్గా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆ విధంగా ఉడికించుకున్నాక చివర్లో కొద్దిగా కసూరి మేథి, కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపితే చాలు.
- అంతే, పచ్చికారంతో సూపర్ టేస్టీగా ఉండే "ఆలూ కర్రీ" మీ ముందు ఉంటుంది!
మనసు దోచే "మునగాకు చట్నీ" - అన్నం, టిఫెన్స్లోకి అద్దిరిపోతుంది!
పక్కా కొలతలతో "క్యారెట్ పచ్చడి" - ఆరు నెలలు నిల్వ - అన్నంతో పాటు టిఫెన్స్లోకి కిర్రాక్!

