ట్రంప్ డ్రీమ్ మిలటరీ- ఏకంగా రూ.135లక్షల కోట్లు కేటాయింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన- 2027 సంవత్సరానికి అమెరికా సైనిక బడ్జెట్ను 1.5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయం

Published : January 8, 2026 at 7:19 AM IST
US Military Budget 2027 : అమెరికా రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన 'డ్రీమ్ మిలిటరీ' నిర్మాణం కోసం భారీగా నిధులను వెచ్చించేందుకు సిద్ధమయ్యారు. 2027 ఆర్థిక సంవత్సరానికి గానూ సైనిక బడ్జెట్ను 1.5 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.135 లక్షల కోట్లు. ప్రపంచ మార్కెట్లో డాలర్ మారకం విలువ రూ.89.85 నుంచి రూ.90 మధ్య ట్రేడ్ అవుతుంది ) పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా రక్షణ బడ్జెట్ 1 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, దీనిని ఏకంగా 50 శాతం పెంచుతున్నట్లు ఆయన వెల్లడించడం సంచలనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా సైనిక శక్తిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు.
'డ్రీమ్ మిలిటరీ' అవసరం
దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతమున్న ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడానికి అమెరికాకు ఒక బలమైన అవసరమని ట్రంప్ పేర్కొన్నారు. సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు, ఇతర ప్రతినిధులతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు, కార్యదర్శులు, ఇతర రాజకీయ ప్రతినిధులతో సుదీర్ఘమైన చర్చలు జరిపిన తర్వాత, దేశ ప్రయోజనాల దృష్ట్యా, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అనిశ్చితుల నేపథ్యంలో 2027 సంవత్సరానికి అమెరికా సైనిక బడ్జెట్ 1 ట్రిలియన్ డాలర్ల నుంచి 1.5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించాను. ఇది మనం ఎప్పటి నుంచో ఆశిస్తున్న 'డ్రీమ్ మిలిటరీ'ని నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుంది. శత్రువు ఎంతటివారైనప్పటికీ రక్షణ కల్పించడానికి ఈ భారీ బడ్జెట్ దోహదపడుతుందని ట్రంప్ అన్నారు.
భారీ మొత్తంలో నిధులు సమీకరణపై ట్రంప్ స్పష్టత
గతంలో అమెరికాను ఆర్థికంగా దెబ్బతీసిన 'దేశాలపై విధించిన టారిఫ్'ల వల్ల దేశానికి భారీగా ఆదాయం సమకూరిందని ఆయన చెప్పారు. ఈ ఆదాయంతో కేవలం సైన్యాన్ని ఆధునీకరించడమే కాకుండా, అప్పులను కూడా తీర్చనున్నట్లు వెల్లడించారు. ఆదాయం పెరగడం వల్ల సామాన్య ప్రజలకు గణనీయమైన స్థాయిలో డివిడెండ్లను ఆర్థిక ప్రయోజనాలు అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలనపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. బైడెన్ హయాంలో ఊహించని నష్టాలు జరిగాయని, తమ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే టారిఫ్ల ద్వారా అద్భుతమైన ఆదాయాన్ని సాధించామని చెప్పారు.
"గతంలో అమెరికాను దోచుకున్న ఇతర దేశాల నుంచి మనకు టారిఫ్ ఆదాయమే లేకపోతే నేను సైనిక బడ్జెట్ను 1 ట్రిలియన్ డాలర్ల వద్దే ఉంచేవాడిని. కానీ, ఈ టారిఫ్లతో వస్తున్న అపారమైన ఆదాయం వల్ల గతంలో ఊహించలేనంత ముఖ్యంగా మన దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన అధ్యక్షుడు, 'స్లీపీ' జో బైడెన్ పరిపాలనలో ఉన్నప్పటి కంటే చాలా ఎక్కువ సంపద చేకూరింది. దీనివల్ల మనం ఒకవైపు 1.5 ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటూనే, మరోవైపు బలమైన సైనిక శక్తిని నిర్మించగలుగుతున్నాం"
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇదిలా ఉండగా, ఇప్పటికే 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 901 బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్కు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది.ఈ బడ్జెట్తో సైనిక శక్తితో శాంతిని నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్య సాధన కోసం శత్రు నుంచి ముప్పులను దృష్టిలో పెట్టుకొని తగిన విధంగా సైనిక సామర్థ్యాలను పెంచుకోవాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సైన్యంపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం వంటి చర్యలకు ఈ బడ్జెట్ ప్రాధాన్యం ఇస్తుందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు.
సుంకాలతో USకు 600 బిలియన్ డాలర్ల ఆదాయం- ఇప్పటికే ఖజానాకు సగం!: ట్రంప్

