ETV Bharat / international

వెయ్యేళ్ల పురాతన ప్రంబనన్ ఆలయానికి మోదీ- త్రిమూర్తుల గుడిలో పూజలు- అద్భుతమంటూ కితాబు

ఇండోనేసియాలో బిజీ బిజీగా గడుపుతున్న నరేంద్ర మోదీ- 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రంబనన్ ఆలయ సందర్శన- గుడి ఏరియల్ వ్యూ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్

PM Modi Prambanan Temple Visit
PM Modi Prambanan Temple Visit (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : July 8, 2026 at 12:19 PM IST

4 Min Read
Choose ETV Bharat

PM Modi Prambanan Temple Visit : భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి దాదాపు 1,000 సంవత్సరాల పురాతన చారిత్రక ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శించారు. త్రిమూర్తులైన శివుడు, విష్ణువు, బ్రహ్మలు కొలువైన ఈ గుడిలో మోదీ పూజలు చేశారు. అనంతరం ఇరు దేశాధినేతలు కలిసి ప్రంబనన్ ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రంబనన్ హిందూ దేవాలయాల సముదాయానికి సంబంధించిన అద్భుతమైన వైమానిక దృశ్యాలను (ఏరియల్ వ్యూ) 'ఎక్స్‌'లో షేర్‌ చేశారు మోదీ. ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడానికి 'అద్భుతమైన ప్రంబనన్ ఆలయం!' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ప్రధాని మోదీ ప్రంబనన్ ఆలయ సందర్శన ఈ విశాలమైన గుడి ప్రాంగణంలో భారత్ సాయంతో చేపట్టే పరిరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి మార్గం సుగమం చేసింది. ఇది యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద భారత సాంస్కృతిక దౌత్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఇదే ప్రాజెక్ట్‌పై ప్రధాని మోదీ, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రభోవోల మంగళవారం విస్తృత ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ పరిరక్షణ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు నాయకులు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ) పరస్పరం మార్చుకున్నారు.

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా దేశ సాంస్కృతిక వారసత్వపు ఛాయలే కనిపిస్తాయ్ : మోదీ
యోగ్యకార్తాలోని ప్రంబనన్ ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అక్కడ భారతదేశ సాంస్కృతిక వారసత్వపు ఛాయలు కనిపిస్తాయని పేర్కొన్నారు. ఆగ్నేయాసియాలో భారత వారసత్వానికి ప్రంబనన్ ఆలయం రెండో అతిపెద్ద గుర్తింపని తెలిపారు. ఈ ఆలయంలో శివుడు, దుర్గాదేవి, గణేషుడి విగ్రహాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ గుడిలో శతాబ్దాలుగా పూజలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఈరోజు తాను కూడా ప్రంబనన్ ఆలయాన్ని దర్శించుకున్నానని చెప్పారు. అక్కడ పూజలు చేసే అవకాశం తనకు లభించిందన్నారు. గుడి పునరుద్ధరణ పనులు పూర్తైన తర్వాత తాను మళ్లి ఈ గుడి వస్తానని వాగ్దానం చేశారు.

"నేను ఇండోనేసియా వచ్చి ఇది మూడో రోజు. అయినా ఇక్కడి సంభాషణల్లో, గాలిలో సాంస్కృతిక పరిమళం అలముకుంది. భారతదేశంలో మనం ప్రతి క్షణం అనుభవించే పరిమళం ఇది. ఈ సాంస్కృతిక వారసత్వ పరిమళం ఇరుదేశాల ప్రజలను ఒకరికొకర్ని అనుసంధానిస్తుంది. ఈ వారసత్వాన్ని పరిరక్షించిన ఇండోనేసియా ప్రజలకు, నాయకులకు ధన్యవాదాలు. ప్రంబనన్ గుడిలో పరమశివునితో అనుసంధానమయ్యే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. హట్కేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉన్న వాద్‌నగర్‌లో నేను జన్మించాను. సోమనాథ్ జ్యోతిర్లింగం ప్రపంచంలోనే మొదటి జ్యోతిర్లింగం. అది గుజరాత్‌లో ఉంది. నేను ఎంపీగా గెలుపొందిన నియోజకవర్గం వారణాసిలో కాశీ విశ్వనాథుడి ఆలయం ఉంది. ఆయన ఆశీస్సులు నాకు నిరంతరం లభిస్తున్నాయి. ప్రంబనన్ ఆలయ పునురుద్ధరణ పనులను ప్రారంభించే అవకాశం నాకు లభించింది. దీనిని నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను." అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

గుడి చరిత్ర ఏంటంటే?
జావా ద్వీపంలో ఉన్న ప్రంబనన్ ఆలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించారు. ఇది ఇండోనేసియాలో అతిపెద్ద హిందూ గుడి. కంబోడియాలో ఉన్న అంగ్‌కోర్‌వాట్ తర్వాత ఆగ్నేయాసియాలో ఇదే పెద్ద దేవాలయం. దాదాపు 40 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ గుడి ప్రాంగణంలో మొదట సుమారు 240 ఆలయాలు ఉండేవి. ఈ గుడి నిర్మాణాన్ని హిందూ మాతారామ్ రాజవంశానికి చెందిన రాజు రాకై పికాతన్ ప్రారంభించగా, ఆయన వారసుడు లోకపాల పూర్తి చేశారు. ఇక్కడి శివ, విష్ణు, బ్రహ్మ ఆలయాలలో 47 మీటర్ల ఎత్తున్న ప్రధాన శివాలయం అత్యంత ప్రముఖమైనది. ఈ ఆలయ గోడలపై చెక్కిన రామాయణ గాథ శిల్పాలు భారత్-ఇండోనేసియాల ప్రాచీన నాగరికత బంధానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఈ గుడిని యూనెస్కో 1991లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

పర్యటనలో కీలక ఘట్టాలతో వీడియో
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ తన ఇండోనేసియా పర్యటనలో ముఖ్యాంశాలను ప్రదరిస్తూ ఓ వీడియోను పంచుకున్నారు. ఇండోనేసియాలో తనకు లభించిన ఘన స్వాగతం, ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ప్రవాస భారతీయులతో తాను జరిపిన సమావేశాలలోని కీలక ఘట్టాలను ఆ వీడియోలో పొందుపర్చారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ఇండోనేసియా పిల్లలు భారత్, ఇండోనేసియా జెండాలను ఊపుతూ 'స్వాగతం మోదీజీ', 'ఐ లవ్ యూ మోదీజీ' అంటూ నినాదాలు చేస్తూ ప్రధానికి స్వాగతం పలకడంతో ఈ వీడియో ప్రారంభమైంది. జకార్తాలోని అధ్యక్ష భవనంలో ఘన స్వాగత కార్యక్రమం, గౌరవ వందనం, సైనిక కవాతు, ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. అలాగే ఈ సమావేశాలు సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ వీడియోలో ఉన్నాయి. కాగా, ఇండోనేషియా పర్యటన ముంగించుకున్న మోదీ, ఆస్ట్రేలియాకు బయలుదేరారు.

భారత్​, ఇండోనేసియా కలిస్తే 'కుచ్​ కుచ్' కాదు- 'బహుత్ కుచ్'​ జరుగుతుంది: ప్రధాని మోదీ

'రామాయణం, మహాభారతం మన బంధానికి పునాది'- ఇండోనేసియా పార్లమెంటులో మోదీ కీలక వ్యాఖ్యలు