ETV Bharat / international

'ఇది మన ఉమ్మడి విశ్వాసానికి ప్రతీక'- భారత్​- ఆస్ట్రేలియా ఫోరమ్​లో ప్రధాని మోదీ

మూడు దేశాల పర్యటనలో రెండో విడతగా ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ- ఆ దేశ ప్రధానిని కలిసి ఇండియా, ఆస్ట్రేలియా ఫోరమ్​లో పాల్గొన్న మోదీ- వాణిజ్యం, పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు

India-Australia CEO Forum PM Modi
India-Australia CEO Forum PM Modi (DD News)
author img

By ETV Bharat Telugu Team

Published : July 9, 2026 at 7:36 AM IST

3 Min Read
Choose ETV Bharat

India-Australia CEO Forum PM Modi : మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. గురువారం మెల్‌బోర్న్‌లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా సీఈఓ ఫోరంలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు కలిసి భారత్‌, ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, మీరందరూ ఇక్కడ ఉడడం మన ఉమ్మడి విశ్వాసానికి, ఆకాంక్షలకు ప్రతీక అని తెలిపారు. అలాగే భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మోదీతో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్​ సెల్ఫీ తీసుకున్నారు.

ప్రపంచం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు, సరఫరా గొలుసు అంతరాయాలు, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో భారత్‌, ఆస్ట్రేలియా సహజమైన, విశ్వసనీయ భాగస్వాములుగా కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. 2022లో రికార్డు సమయంలో కుదిరిన భారత్‌-ఆస్ట్రేలియా ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) ఇరు దేశాల ఆర్థిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతులు రెట్టింపు అయ్యాయని, రెండు దేశాల వ్యాపార సంస్థలకు కొత్త మార్కెట్లలో అవకాశాలు లభించాయని ప్రధాని మోదీ వెల్లడించారు.

పెన్షన్‌ ఫండ్లకు ప్రత్యేక ఆహ్వానం
ఆస్ట్రేలియాలోని పెన్షన్‌ ఫండ్లు ప్రస్తుతం నాలుగు ట్రిలియన్‌ డాలర్లకు పైగా ఆస్తులను నిర్వహిస్తున్నాయని మోదీ తెలిపారు. భారత్‌లో పెన్షన్‌ పొదుపులను పవిత్రమైన బాధ్యతగా భావిస్తామని, ఆస్ట్రేలియా పెన్షన్‌ ఫండ్లకు భారత్‌లో భద్రమైన, స్థిరమైన, సుస్థిరమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పెట్టుబడిదారులు ఉంచిన విశ్వాసంతో పాటు వారి మూలధనం కూడా మరింతగా పెరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య సహజమైన భాగస్వామ్యం ఉందని ప్రధాని అన్నారు. విద్యార్థుల పరస్పర రాకపోకలను కేవలం చదువుకే పరిమితం చేయకుండా, భవిష్యత్‌ ప్రతిభను తీర్చిదిద్దే భాగస్వామ్యంగా మార్చుకోవాలని సూచించారు.

హరిత ఇంధన రంగంలో అపార అవకాశాలు

"ఇంధన రంగంలో ఇప్పటికే అనేక ఆస్ట్రేలియా కంపెనీలు పనిచేస్తున్నాయి. భారత్‌లో జలవిద్యుత్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌, సౌర ప్యానెల్లు, విండ్‌ టర్బైన్‌ల తయారీకి బలమైన పారిశ్రామిక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడం, 2070 నాటికి 'నెట్‌ జీరో' ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడం భారత్‌ లక్ష్యం. ఈ ప్రయాణంలో ఆస్ట్రేలియా సాంకేతికత, పెట్టుబడులు, సహజ వనరులు కీలక పాత్ర పోషించగలవు. 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నాం. యురేనియం నిల్వలు అధికంగా ఉన్న ఆస్ట్రేలియా ఈ లక్ష్య సాధనలో కీలక భాగస్వామి అవుతుంది. అలాగే పోర్టులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రైల్వేలు, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆస్ట్రేలియా సంస్థలకు విస్తృత అవకాశాలు ఉన్నాయి"
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు
మోదీ, అల్బనీస్‌ మూడో వార్షిక శిఖరాగ్ర సమావేశానికి కూడా సంయుక్త అధ్యక్షత వహించనున్నారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, ఇంధనం, ప్రజల మధ్య సంబంధాలు వంటి పరస్పర ప్రయోజన రంగాల్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చలతో పాటు ఆ దేశ గవర్నర్‌ జనరల్‌ సామ్‌ మోస్టిన్‌ను కూడా ప్రధాని మోదీ కలవనున్నారు. అలాగే మెల్‌బోర్న్‌లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి నిర్వహించే భారీ సభలో ఆయన ప్రసంగించనున్నారు.

ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం
బుధవారం రాత్రి మెల్‌బోర్న్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి భారతీయ ప్రవాసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆస్ట్రేలియన్‌-ఇండియా ఆర్కెస్ట్రా ఆలపించిన 'మా తుఝే సలామ్‌' సంగీత ప్రదర్శన, ఆస్ట్రేలియా సంప్రదాయ డిడ్జెరిడూ వాయిద్యంతో భారతీయ తబలా సమ్మేళనం, కథక్‌ నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సంగీత సమ్మేళనం రెండు దేశాల సాంస్కృతిక అనుబంధాన్ని ప్రతిబింబించిందని మోదీ కొనియాడారు.

వెయ్యేళ్ల పురాతన ప్రంబనన్ ఆలయానికి మోదీ- త్రిమూర్తుల గుడిలో పూజలు- అద్భుతమంటూ కితాబు

భారత్​, ఇండోనేసియా కలిస్తే 'కుచ్​ కుచ్' కాదు- 'బహుత్ కుచ్'​ జరుగుతుంది: ప్రధాని మోదీ