'మాకు 140 కోట్ల జనాభా ఉన్న భారత్ మద్దతు ఉంది'- జేడీ వాన్స్కు నెతన్యాహు కౌంటర్
జేడీ వాన్స్ వ్యాఖ్యలను తప్పుబట్టిన నెతన్యాహు- 140 కోట్ల జనాభా ఉన్న భారత్ నుంచి అపారమైన మద్దతు లభిస్తోందని నెతన్యాహు కామెంట్స్- కానీ ట్రంప్పై మాత్రం ప్రసంశలు

Published : July 6, 2026 at 6:44 AM IST
India Israel relations : అమెరికా- ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు, స్నేహంపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'ప్రపంచంలో ఇజ్రాయెల్కు ఉన్న ఏకైక శక్తిమంతమైన మిత్రదేశం అమెరికా మాత్రమే' అని యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తాము అంతర్జాతీయంగా ఒంటరి కాలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అండ ఉందంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా 140 కోట్ల జనాభా ఉన్న భారత్ తమకు అత్యంత నమ్మకమైన మిత్రదేశమని నెతన్యాహు పేర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'ఫాక్స్ న్యూస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు ఈ కామెంట్స్ చేశారు.
"జేడీ వాన్స్ అంటే నాకు గౌరవం ఉంది. ఆయనతో మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అంతమాత్రాన ఆయన చెప్పే ప్రతిదానితో నేను ఏకీభవించలేను.వైట్ హౌస్ చరిత్రలోనే డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కు లభించిన అత్యంత గొప్ప స్నేహితుడు, ఆ మాటపై నేను పూర్తిగా కట్టుబడి ఉంటాను"
- ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు
వాన్స్ చేసిన కామెంట్స్ ఇటీవల వైట్హౌస్లో జరిగిన ఒక అధికారిక మీడియా ప్రతినిధుల సమావేశంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాట్లాడారు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలను, కుదురుతున్న ఒప్పందాలను ఇజ్రాయెల్ నాయకులు తీవ్రంగా విమర్శించడాన్ని తప్పుపట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విదేశాంగ విధాన నిర్ణయాలపై ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేయడం వాన్స్కు నచ్చలేదు. ఈ క్రమంలోనే ఆయన ఇజ్రాయెల్ను ఉద్దేశించి కీలక కామెంట్స్ చేశారు. 'నేను ఇజ్రాయెల్ కేబినెట్లో మంత్రిగా ఉంటే ఈ ప్రపంచంలో నాకు మిగిలి ఉన్న ఏకైక ఏకైక శక్తివంతమైన, పెద్ద మిత్రదేశమైన అమెరికాపై విమర్శలు చేసేవాడిని కాదు' అని జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో నెతన్యాహును ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు.
భారత్ గురించి ప్రస్తావిస్తూ
ఇజ్రాయెల్కు అంతర్జాతీయంగా ఉన్న మిత్రుల గురించి వివరిస్తూ భారత్ ను ప్రత్యేకంగా నెతన్యాహు ప్రస్తావించారు. తమకు అమెరికాతో పాటు మరికొన్ని మిత్రదేశాలు ఉన్నాయని అందులో భారత్ ఉందని చెప్పుకొచ్చారు. భారత్ చిన్న దేశమేమీ కాదుని, దాదాపు 140 కోట్ల జనాభా ఉన్నారన్నారు. అక్కడ తమకు ఎంతటి అపారమైన, అఖండమైన మద్దతు ఉందో మాటల్లో చెప్పలేనని చెప్పారు. తాను. నేను వ్యక్తిగతంగా నిర్వహించే ఫేస్బుక్ ఖాతాను ఒక్కసారి చూస్తే చాలు ఇజ్రాయెల్కు మద్దతుగా భారతీయుల నుంచి కామెంట్లు, సందేశాలు వరదలా ముంచెత్తుతాయని వివరించారు.
సాంకేతిక, సైనిక రంగాల్లో ఇజ్రాయెల్ బలంసోషల్ మీడియాలో ఇజ్రాయెల్పై ఎంత వ్యతిరేక ప్రచారం జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉన్నాయని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ వద్ద ఉన్న అత్యాధునిక సాంకేతికత కారణంగానే ప్రపంచ దేశాలు తమతో స్నేహం చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని, తమ ఏఐ, సైబర్ టెక్నాలజీ ప్రపంచంలోనే అత్యంత అత్యుత్తమమైనది, అందుకే ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ అవసరం ఎంతైనా ఉందని నెతన్యాహు అన్నారు. అంతర్జాతీయంగా ఎందరో దేశాల అధినేతలు నాకు వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తున్నారని, ఇజ్రాయెల్తో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలని ఆశిస్తున్నామంటూ కాల్స్ వస్తున్నాయన్నారు. అంతేకాదు, ఇజ్రాయెల్ సైన్యం అనుసరించే వ్యూహాలు, యుద్ధ నైపుణ్యాలను తమతో పంచుకుంటారా? అని వారు కోరుతున్నారని నెతన్యాహు వెల్లడించారు.
"చాలా మంది ప్రపంచ నేతలు నాకు ఫోన్ చేసి ఇలా అడుగుతున్నారు.’మా దేశంలో ప్రజల అభిప్రాయాలతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మనం కొన్ని ఒప్పందాలు చేసుకుందామా ? అలాగే మీ సైన్యం అనుసరించే కొన్ని వ్యూహాలను, పద్ధతులను మాకు నేర్పించగలరా? మీ ఏఐ, సైబర్ నైపుణ్యాలను మాతో పంచుకోగలరా?' అని అడుగుతున్నారు"
- ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కొత్త టోల్ విధానం- మిత్రదేశాలకు ప్రత్యేక రాయితీలు!

