ETV Bharat / international

దుబాయ్​, రియాద్​, దోహాపై ఇరాన్​ క్షిపణి దాడులు- అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్​!

దక్షిణ ఇరాన్​లోని పాఠశాలపై ఇజ్రాయెల్-అమెరికా దాడులు- ఐదుగురు విద్యార్థినిలు మృతి- ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్​

Iran Israel War Death Toll
Iran Israel War Death Toll (Associate Press)
author img

By ETV Bharat Telugu Team

Published : February 28, 2026 at 5:21 PM IST

3 Min Read
Choose ETV Bharat

Iran Israel war updates : పశ్చిమాసియాలో ఇజ్రాయెల్​-ఇరాన్​ల యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇజ్రాయెల్-అమెరికా చేస్తున్నదాడులకు ప్రతీకారంగా ఇరాన్​ ప్రతిదాడులకు పాల్పడుతోంది. ముఖ్యంగా యూఏఈలోని అబుదాబి, దుబాయ్​, ఖతార్​లోని దోహా, సౌదీ అరేబియా రాజధాని రియాద్​లపై క్షిపణలతో దాడి చేసింది.

యూఏఈపై దాడి
అబుదాడిలోని ఒక నివాస ప్రాంతంలో క్షిపణి శకలాలు పడడంతో అక్కడ ఒక ఆసియాకు చెందిన ఒక పౌరుడు మరణించినట్లు యూఏఈ రక్షణమంత్రిత్వశాఖ ధ్రువీకరించింది. 'ఇలాంటి చర్యలు ప్రమాదకరమైన ఉద్రిక్తతలు దారితీస్తాయి. పౌరుల భద్రతను భంగపరిచే ఇలాంటి పిరికిపంద చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం' అని ప్రకటించింది. భారీ పేలుడు ధాటికి కిటికీలు పగిలిపోయాయని, ఆకాశంలో అగ్నిగోళాల్లాంటి క్షిపణులు దూసుకుపోవడం చూశామని పలువురు దుయాబ్ నివాసితులు చెప్పారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్​
అయితే ఇరాన్ దాడులు చేసిన ఈ నగరాలు అన్నీ, అమెరికా దళాలకు ఆశ్రయం కల్పిస్తున్నవే కావడం గమనార్హం. అబుదాబిలోని 'అల్ దఫ్రా' ఎయిర్​బేస్​, దుబాయ్​లోని 'జెబెల్​ అలీ' పోర్ట్​ (అమెరికా నౌకాదళానికి చెందిన అతిపెద్ద కేంద్రం), దోహాలోని 'అల్​ ఉదైద్​' ఎయిర్​ బేస్​ (యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయం), సౌదీలోని 'ప్రిన్స్ సుల్తాన్​' ఎయిర్ బేస్​- ఇలా అమెరికాకు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది.

బహ్రెయిన్​లోని 5వ ఫ్లీట్​పై దాడి
బహ్రెయిన్​ రాజధాని మనామాలో అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్​ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు చేసింది. "సర్వీస్ సెంటర్​పై క్షిపణిదాడి జరింది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అని బహ్రెయిన్​ నేషనల్ కమ్యునికేషన్ సెంటర్ తెలిపింది. అటు జోర్డాన్​లోనూ వార్ సైరన్లు మెగగా, కువైట్ తన గగనతలంలోకి వచ్చిన క్షిపణులను అడ్డుకున్నట్లు తెలిపింది.

సౌదీ, ఖతార్​లపై ఎటాక్
ఖతార్​ తమపై ఇరాన్ జరిపిన దాడులను విజయవంతంగా తిప్పికొట్టినట్లు పేర్కొంది. ఇరాన్ దాడుల వల్ల తమకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది. మరోవైపు సౌదీ అరేబియా ఈ "ఇరాన్ దురాక్రమణ"ను ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఇది యూఏఈ, బహ్రెయిన్​, ఖతార్​, కువైట్​, జోర్డాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. టెహ్రాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఇరాన్​పై 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'
శనివారం ఇజ్రాయెల్​, అమెరికాలు సంయుక్తంగా ఇరాన్​పై దాడులు ప్రారంభించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయమే లక్ష్యంగా దాడులు చేశాయి. అయితే ఆ సమయంలో ఖమేనీ అక్కడ లేరని అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్​పై పోరాటాన్ని ప్రారంభించామని పేర్కొనగా, పెంటగాన్ దీనికి 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' అని పేరు పెట్టింది. మరోవైపు ఇరాన్ నుంచి ఎదురవుతున్న అస్తిత్వ ముప్పును ఎదుర్కోవడమే లక్ష్యంగా తాము దాడులకు దిగామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.

40 మంది విద్యార్థులు మృతి!
మరోవైపు ఇజ్రాయెల్-అమెరికా చేసిన దాడుల్లో దక్షిణ ఇరాన్​లోని బాలికల పాఠశాలలో 40 మంది విద్యార్థులు మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్​ఎన్​ఏ వెల్లడించింది. హోర్మోజ్​గాన్ ప్రావిన్స్​లోని మినాబ్​ నగరంలో ఈ దాడి జరిగిందని ఐఆర్​ఎన్​ఏ పేర్కంది. వాస్తవానికి ఈ సిటీలో ఇరాన్​ పారామిలిటరీ లివల్యూషనరీ గార్డ్​కు చెందిన ఒక స్థావరం ఉంది. కాగా, విద్యార్థినిల మృతి వార్తపై ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు.

గగనతలాన్ని మూసేసిన పశ్చిమాసియా దేశాలు
యుద్ధవాతావరణం కారణంగా ఇజ్రాయెల్​, ఇరాన్​, ఇరాక్​, కువైట్​, బహ్రెయిన్​, ఖతార్​లు తమ గగనతలాన్ని మూసివేశాయి. దీనితో ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.