ETV Bharat / international

ఇరాన్​ సైనిక స్థావరాలపై విరుచుకపడిన అమెరికా- అతిపెద్ద దాడి ముందుందని ట్రంప్ వార్నింగ్

మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా- ప్రతీకార దాడులతో విరుచుకుపడ్డ ఇరాన్​, అమెరికా

US Wave Of Strikes Iran
పశ్చిమాసియా ఉద్రిక్తత (Screengrab/X@CENTCOM)
author img

By ETV Bharat Telugu Team

Published : September 2, 2026 at 7:23 AM IST

3 Min Read
Choose ETV Bharat

US Wave Of Strikes Iran : పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతీకార దాడులతో అమెరికా, ఇరాన్​ దళాలు విరుచుకుపడ్డాయి. ఇరాన్​ సైనిక స్థావరాలు, రాడార్, కమ్యూనికేషన్​ వ్యవస్థపై వైమానిక దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్​ కమాండ్​ పేర్కొంది. వీటితో పాటు సిరిక్‌లో జరుగుతున్న ఒక వివాహ వేడుకపై అమెరికా దళాలు దాడులు చేశాయి. సుమారు 50,000 మందికి పైగా అమెరికా సైనికులు ప్రస్తుతం పశ్చిమాసియా అంతటా విస్తరించి ఉన్నారని అమెరికా సెంట్రల్ కమాండ్​ తెలిపింది. కమాడంర్​ ఇన్​ చీఫ్​ విడుదల చేసే ఎలాంటి ఆదేశాల కోసమైన సిద్ధంగా ఉన్నామని ఎక్స్ పోస్టులో వెల్లడించింది. మరోవైపు, యూఎస్​ దాడులను ఇరాన్​ తీవ్రంగా ఖండించింది. దాడులకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.

అతిపెద్ద దాడి ముందుంది: ట్రంప్‌
కాగా,హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ లక్ష్యాలపై వాషింగ్టన్ కొత్తగా దాడులు ప్రారంభించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. జలసంధిలో సముద్ర మైన్‌లను అమర్చడానికి ఇరాన్ ప్రయత్నించినందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు ట్రంప్ ట్రూత్ సోషల్​ పోస్టులో పేర్కొన్నారు. అతిపెద్ద దాడి జరగబోనుందని ఇరాన్‌ను హెచ్చరించారు. ఐఆర్‌జీసీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జోర్డాన్‌లోని తమ సైనిక స్థావరంపై ఇరాన్ ఎనిమిది క్షిపణులను ప్రయోగించినందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయని చెప్పారు. ప్రస్తుతం ఆ జలసంధిలో ఎలాంటి మైన్లు లేవని స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వం ఇరాన్‌ను, చర్చల టేబుల్ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోందంటూ వస్తున్న వార్తలను ట్రంప్ ఖండించారు. "హర్మూజ్ జలసంధిపై దాదాపు పూర్తి నియంత్రణ కలిగి ఉంటూ, వారి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతున్న ప్రస్తుత పరిస్థితులే నాకు ఎంతో మెరుగ్గా అనిపిస్తున్నాయి. వారు కేవలం అనివార్యమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అంతే" అని ట్రంప్​ పేర్కొన్నారు.

అమెరికా భీకర దాడులు
అంతకుముందు, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్​జీసీ) లక్ష్యంగా అమెరికా భీకర దాడులు చేసింది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్యనౌకలు సహా తమ సైనికులపై ఐఆర్​జీసీ చేసిన దాడులకు ప్రతీకార చర్యకు దిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఈ దాడులకు ప్రతీకారంగా జోర్డాన్‌లోని స్థావరాలపైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అమెరికా దళాలు అడ్డుకున్నాయి. బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపైనా ఇరాన్‌ డ్రోన్ దాడులకు దిగింది. తమ గగనతలం మీదుగా వచ్చిన ఓ డ్రోన్‌ను సైతం అడ్డుకున్నట్లు యూఏఈ వెల్లడించింది.

'మూల్యం చెల్లించుకోక తప్పదు'
ఇదిలా ఉండగా, సిరిక్‌లోని కుహెస్తాక్​లో వివాహ వేడుక జరుపుకొంటున్న ఇంటిపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఆ దాడుల్లో ఓ చిన్నారిసహా నలుగురు మృతిచెందినట్లు ఇరాన్‌ తెలిపింది. దాదాపు 50మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. గాయపడ్డ వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్​ బఘెయి తెలిపారు. మరోవైపు, అమెరికాకు గుణపాఠం చెబుతామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా మొజ్తబా ఖమేని హెచ్చరించారు. అంతకుముందు కిర్గిజిస్థాన్‌లో మాట్లాడిన ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియన్ జూన్ నాటి ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉంటే తాము తక్షణమే సానుకూలంగా స్పందిస్తామన్నారు.

కాగా, అమెరికా దాడులకు మూల్యం చెల్లించుకోక తప్పదని ఇస్మాయిల్​ బఘెయి హెచ్చరించారు. అదే సమయంలో జోర్డాన్‌లోని అమెరికా ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్ క్యాంప్ టిటిన్‌లపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి, డ్రోన్ హ్యాంగర్లను ధ్వంసం చేసినట్లు తెలిపారు. బహ్రెయిన్‌లోని షేక్ ఇసా అమెరికా బేస్‌పై కూడా దాడులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

'డ్రోన్ దాడులను అడ్డుకున్నాం'
ఇదిలా ఉండగా, ఇరాన్​ డ్రోన్​ దాడులను తమ దేశ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని కువైట్​ న్యూస్​ ఏజెన్సీ పేర్కొంది. జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థ 13 ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను గాల్లోనే కూల్చివేసినట్లు తెలిపింది. మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో బహ్రెయిన్​ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది.

ఉక్రెయిన్​పై రష్యా దాడి- భారతీయుడు సహా 12 మంది మృతి

నేపాల్ వరదలు- 1,003కు పెరిగిన మృతుల సంఖ్య- ఇంకా 4వేల మంది గల్లంతు!