"అమెరికన్ జెయింట్స్"- యూఎస్ మాజీ అధ్యక్షులకు ట్రంప్ ఘన నివాళులు
దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ- జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, అబ్రహం లింకన్, రూజ్వెల్ట్లపై ప్రశంసలు

Published : July 4, 2026 at 5:18 PM IST
Trump Salutes American Giants : అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మౌంట్ రష్మోర్లోని బ్లాక్ హిల్స్పై చెక్కిన దిగ్గజ యూఎస్ మాజీ అధ్యక్షుల విగ్రహాలకు (ముఖాలకు) నివాళులర్పించారు. ఈ క్రమంలో తనకంటే ముందు అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన, అత్యంత ప్రభావవంతమైన నలుగురు ప్రెసిడెంట్లైన జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, అబ్రహం లింకన్, థియోడర్ రూజ్వెల్ట్ల సేవలను గుర్తు చేసుకున్నారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు (శుక్రవారం) దేశభక్తితో నిండిన జనసమూహాన్ని ఉద్దేశించి సౌత్ డకోటాలో ట్రంప్ ప్రసంగించారు.
ఈ వీరులు కాలాతీతమైన, శాశ్వతమైన వ్యక్తులు : ట్రంప్
"అమెరికా పితామహుడైన జార్జ్ వాషింగ్టన్కు, స్వాతంత్ర్య ప్రకటన రచయిత థామస్ జెఫర్సన్కు, దేశ ఐక్యతకు కారకుడు, గొప్ప విమోచకుడు అబ్రహం లింకన్కు, యూఎస్ను ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలిపిన థియోడర్ రూజ్వెల్ట్కు వందనాలు. ఈ నలుగురు మాజీ అధ్యక్షులు కార్యదక్షకులు, సాహసవంతులు, మంచి ఆశయం గలవారు. వారి నాయకత్వం అమెరికాలో ఒక గొప్ప ప్రమాణాన్ని నెలకొల్పింది. అది ఇప్పటికీ అమెరికాను ముందుకు నడిపిస్తోంది. ఇలాంటి వ్యక్తులు అమెరికాలోనే ఉంటారు. ఈ నలుగురి ముఖాల ప్రతిరూపాలు ఈ కొండచరియలపై చెక్కి ఉన్నాయి. వీరు మనం ఎవరో మనకు ఎప్పటికీ గుర్తు చేస్తూ ఉంటారు. ఈ వీరులు దేశంలో కాలాతీతమైన, శాశ్వతమైన, నిత్యమైన స్వభావానికి నిదర్శనం" అని ట్రంప్ పేర్కొన్నారు.
గొప్ప దేశాన్ని తయారుచేసేందుకు శ్రమిద్దాం!
జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, అబ్రహం లింకన్, థియోడర్ రూజ్వెల్ట్లను అమెరికా రూపశిల్పులుగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. అమెరికన్లకు స్వేచ్ఛను అందించిన వీరులుగా వారిని కొనియాడారు. అలాగే ఆ నలుగురు గొప్ప మేధస్సు గలవారని, అన్నింటికంటే ముఖ్యంగా వారు చరిత్రలో గొప్ప వ్యక్తులని ప్రశంసలు కురిపించారు. ఈ దిగ్గజాల్లానే విశాలమైన, ధైర్యమైన, సుసంపన్నమైన గొప్ప దేశాన్ని తయారుచేసేందుకు శ్రమిద్దామని అమెరికన్లకు పిలుపునిచ్చారు. అది అంత సులభం కాదని, కానీ మనం దాన్ని చేయబోతున్నామని చెప్పారు. మానవ చరిత్రలో ఇప్పటివరకు ఉనికిలో ఉన్న అత్యంత అసాధారణమైన దేశంగా అమెరికా నిలిచిందని అభిప్రాయపడ్డారు. ఆధునిక ప్రపంచాన్ని కలగని, సృష్టించిన దేశం యూఎస్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ల ఆవిష్కరణలను డొనాల్డ్ ట్రంప్ గుర్తు చేసుకున్నారు.
'ప్రపంచంలో అద్భుత ఆవిష్కరణలు చేసింది అమెరికన్లే'
"అమెరికన్లు రైలు మార్గాలను వేశారు. పెద్ద పెద్ద బిల్డింగ్లను నిర్మించారు. లైట్లు, టెలిఫోన్, విమానం, అసెంబ్లీ లైన్, టీవీ, మైక్రోచిప్, పర్సనల్ కంప్యూటర్, ఇంటర్నెట్, జీపీఎస్, స్మార్ట్ ఫోన్ వంటి వాటిని అమెరికన్లు కనుగొన్నారు. ఎయిర్ కండిషనింగ్ అనే ఒక వస్తువును సృష్టించారు. వ్యాధులను నయం చేయడానికి మానవ జన్యువును అన్వేషించారు. చంద్రునిపై అమెరికా జెండాను పాతారు. అమెరికన్లు తమ సంగీతంతో, సంస్కృతితో ప్రపంచ ప్రసార మాధ్యమాలను నింపేశారు. బేస్బాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్లో అదరగొడుతున్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికన్లే అత్యధిక ఒలింపిక్ పతకాలు, నోబెల్ బహుమతులు, ప్రపంచ రికార్డులను గెలుచుకున్నారు. సినీ రంగంలో ఉత్తమ చిత్రాలను నిర్మించారు. మంచి సంగీతాన్ని సృష్టించారు. ప్రపంచం ఇంతవరకు చూడని గొప్ప వినోదకారులను, క్రీడాకారులను తయారుచేశారు" అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఆ నలుగురు కొత్త తరం పౌరులను తీర్చిదిద్దారు : ట్రంప్
మానవ చరిత్రలోనే గొప్ప నాగరికత మునుపెన్నడూ లేనంత గొప్పగా మారిన ప్రదేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) అని ట్రంప్ కొనియాడారు. ఈ విశాలమైన దేశంలోని నేలలు, గ్రానైట్ కొండలు, కఠినమైన మైదానాలలో అమెరికా మాజీ అధ్యక్షులు ఒక ప్రత్యేకమైన అమెరికా భావాన్ని, ఒక కొత్త తరం పౌరులను తీర్చిదిద్దారని అన్నారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా దేశ వ్యవస్థాపకుల వారసత్వాన్ని కాపాడతామని వాగ్దానం చేశారు. భూమిపై ఎక్కడా అమెరికన్లు లాంటి వారు లేరన్నారు.
పాక్ కోస్ట్ గార్డ్స్ క్యాంపుపై భారీ దాడి- 30 మందికిపైగా మృతి చెందినట్లు బలూచిస్థాన్ ప్రకటన
'ఇరాన్ ప్రతినిధుల హత్యకు కుట్ర'- ఆ కథనాన్ని ఖండించిన ఇజ్రాయెల్

