టెహ్రాన్లోనే ఖమేనీ అంత్యక్రియలు- ఇరాన్ కొత్త సుప్రీంను అంతం చేస్తామంటూ ఇజ్రాయెల్ వార్నింగ్
టెహ్రాన్లో మూడు రోజుల పాటు ఖమేనీ అంత్యక్రియలు- ఇరాన్కు వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్- సుప్రీం ఎవరైనా తమ టార్గెట్లో ఉంటారంటూ హెచ్చరిక

Published : March 4, 2026 at 3:39 PM IST
Khamenei Funeral : అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ట్రెహాన్లోనే బుధవారం రాత్రి నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇరాన్లోని మషాద్ నగరంలోని ఇమాన్ ఖోమేనీ ప్రార్థనా స్థలంలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలకు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ అంత్యక్రియల ఊరేగింపు తేదీ, సమయాన్ని నిర్ణయించిన తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఖమేనీ తండ్రి సమాధి వద్దే ఖననం చేయనున్నట్లుగా సమాచారం.
ఖమేనీ స్థానంలో ఎవరూ వచ్చిన హతమారుస్తాం : ఇజ్రాయెల్
ఇరాన్ సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు ముజ్తజా హొస్సేనీ ఖమేనీ ఎన్నికైనట్లు వార్తలు రావడంపై ఇజ్రాయెల్ స్పందించింది. ఖమేనీ స్థానంలో ఇరాన్ సుప్రీంగా ఎవరు వచ్చినా వాళ్లని హతమారుస్తామని హెచ్చరించింది. తదుపరి ఇరాన్ సుప్రీం లీడర్ను కచ్చితంగా టార్గెట్ చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ను నాశనం చేయాలనే ప్రణాళికను చేసే వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అమెరికాతో పాటు స్వేచ్ఛా ప్రపంచ దేశాలను బెదిరించే, ఇరాన్ ప్రజలను అణచివేసే ఏ నాయకుడు అయినా సరే నిస్సంపదేహంగా అంతం చేస్తామన్నారు. ఆ వ్యక్తి ఎవరైనా, ఎక్కడ దాక్కున్నా సరే వదిలిపెట్టేదని హెచ్చరించారు. అమెరికా భాగస్వాములతో కలిసి ఇరాన్ పాలక వ్యవస్థ సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తామని అన్నారు. ఇరాన్ ప్రజలు ఆ ప్రభుత్వాన్ని మార్చుకునే పరిస్థితులు సృష్టిస్తామని కూడా తెలిపారు.
ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబాను దేశ సుప్రీం నేతగా ఇరాన్ అసెంబ్లీలోని కీలక నేతలు ఎన్నుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ)తో బలమైన సంబంధాలు ఉన్నాయి. త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈక్రమంలో ఇజ్రాయెల్ హెచ్చరికలు చేయడం గమనార్హం.
'వారికి మద్దతు ఇస్తే శిక్ష తప్పదు'
ఇస్లామిక్ రిపబ్లిక్ను లక్ష్యంగా చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులపై ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ స్పందించారు. ఆ దాడుల ప్రచారానికి మద్దతుగా మాట్లాడిన ఏమైనా చేసినా శిక్ష పడుతుందని బెదిరించారు. శత్రువులతో సహకరించిటన్లు తేలితే మరణశిక్షణ విధించే అవకాశం ఉందని తెలిపారు
బీరూట్లో హెజ్బొల్లా లక్ష్యాలపై దాడులు
ఇక లెబనాన్ రాజధాని బీరూట్లోని హెజ్బొల్లా లక్ష్యాలపై కొత్త దాడులు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ రక్షణ దళం(ఐడీఎఫ్) తెలిపింది. పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తామని తెలిపాయి. దాడులకు ముందు బీరూట్లోని రెండు భవనాలపై ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు లక్ష్యంగా పెట్టుకున్న భవనాల మ్యాప్ను విడుదల చేశాయి. ఆ ప్రాంత ప్రజలు కనీసం 300 మీటర్ల దూరంలో ఉండాలని సూచించింది. అలాగే ఇరాన్ సైన్యం వినియోగిస్తున్న రష్యా తయారీ Mi-17 హెలికాప్టర్పై దాడి చేసిన దృశ్యాలను కూడా ఐడీఎఫ్ విడుదల చేసింది. అలాగే, ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నిర్వహిస్తున్న సైనికులపై వైమానిక దాడులు జరిపినట్లు తెలిపింది.
ఇరాన్లో వెయ్యిమందికిపైగా మృతి
ఈ ఘర్షణలు కారణంగా గత 24 గంటల్లో 219 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి 1,274 మందిని ఆసుపత్రులకు తరలించగా, అందులో 96 మంది ఇంకా చికిత్స పొందుతున్నారని పేర్కొంది. మరోవైపు అమెరికా- ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో ఇరాన్లో 1,097 మంది ప్రాణాలు కోల్పోయినట్లు యూఎస్కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

