డయాబెటిస్తో కిడ్నీలు దెబ్బతింటాయా?
- షుగర్ వ్యాధిగ్రస్తులు కిడ్నీల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు - కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యానికి మంచిదని సూచన

Published : January 5, 2026 at 3:16 PM IST
Diabetics Suffer from Silent Kidney Damage : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న తీవ్రమైన ఆరోగ్య సమస్య "డయాబెటిస్". ఈ వ్యాధి ఉన్నవారికి షుగర్ అదుపులోనే ఉన్నా కూడా, ఏళ్లు గడుస్తున్న కొద్దీ శరీరంలోని కీలకమైన అవయవాలను క్రమంగా దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. కళ్లు, గుండె, కిడ్నీలు.. ఇలా ప్రతి అవయవమూ కాలం గడుస్తున్న కొద్దీ షుగర్ ప్రభావానికి లోనవుతూ ఉంటుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మూత్రపిండాలకు ఎక్కువ నష్టం కలుగుతుందని చెబుతున్నారు. ఈ పరిస్థితిని డాక్టర్లు 'డయాబెటిక్ నెఫ్రోపతి' అని పిలుస్తారు. ఈ సమస్య బయటకు కనిపించకుండా లోలోపలే జరుగుతుంది కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
డయాబెటిస్, కిడ్నీ వ్యాధికి కారణమా? : డయాబెటిస్ను సరిగ్గా నియంత్రించకపోతే, అది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి (CKD) దారితీస్తుందంటున్నారు నిపుణులు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, అవి కిడ్నీలలోని చిన్న రక్తనాళాలను దెబ్బతీస్తాయని చెబుతున్నారు . దీనివల్ల కిడ్నీలు వ్యర్థాలను వడపోసే సామర్థ్యాన్ని కోల్పోతాయని వివరిస్తున్నారు. ఈ క్రమంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలూ కనిపించవని తెలియజేస్తున్నారు. అందుకే, చాలా మందికి తమ కిడ్నీలు దెబ్బతింటున్నాయని తెలియదని వివరిస్తున్నారు. సాధారణ మూత్ర, రక్త పరీక్షల ద్వారా కిడ్నీ సమస్యలను ముందే గుర్తించి చికిత్స చేయవచ్చని సూచిస్తున్నారు. మధుమేహం ఉన్నవారికి మూత్రపిండాల వైఫల్యం, అథెరోస్క్లెరోటిక్ హృదయ సంబంధ వ్యాధులు, గుండె వైఫల్యం, అకాల మరణాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని American Diabetes Association అధ్యయనం పేర్కొంది.
ఎంత శాతం మందికి కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం : డయాబెటిస్ ఉన్నవారిలో దాదాపు 40% మందికి కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని Journal of Laboratory and Precision Medicine అధ్యయనం పేర్కొంది.
సోడియం స్థాయిలు కిడ్నీలపై ప్రభావం : క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడంతో పాటు, జీవనశైలిలో మార్పులు కూడా ముఖ్యమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా, ఉప్పు వినియోగంపై శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రోజుకు 5 గ్రాముల (సుమారు ఒక టీస్పూన్) కంటే తక్కువ ఉప్పు మాత్రమే తీసుకోవాలని World Health Organization అధ్యయనం పేర్కొంది. కానీ, చాలా మంది ప్రాసెస్ చేసిన ఆహారాల ద్వారా తెలియకుండానే ఎక్కువ ఉప్పు తీసుకుంటున్నారని తెలిపింది.
వీటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది :
- ప్రాసెస్ చేసిన స్నాక్స్
- డబ్బాలో నిల్వ ఉంచిన పదార్థాలు
- బ్రెడ్, చీజ్
- ఫాస్ట్ ఫుడ్
తక్కువ సోడియం ఎలా తీసుకోవాలి :
లేబుల్ చదవండి : ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను కొనేటప్పుడు వాటిలో ఎంత సోడియం ఉందో చూసి, తక్కువ సోడియం ఉన్నవాటిని ఎంచుకోవాలంటున్నారు నిపుణులు.
ఇంట్లోనే వండుకోండి : తాజా పదార్థాలతో ఇంట్లో వంట చేయడం వల్ల ఉప్పు స్థాయిలను మనం నియంత్రించవచ్చని చెబుతున్నారు.
ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండండి : తాజా పండ్లు, కూరగాయలు, లీన్ మీట్, తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
ప్రత్యామ్నాయాలను వాడండి: రుచి కోసం ఉప్పునకు బదులుగా మూలికలు, మసాలా దినుసులను వాడండి. ఈ క్రమంలో ఉప్పు తగ్గించడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. తద్వారా కిడ్నీలపై ఒత్తిడి తగ్గి వ్యాధి తీవ్రత తగ్గుతుందంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజంతా 'నీరసంగా' అనిపిస్తోందా? - అయితే మీలో 'ఆ సమస్య' ఉండొచ్చంటున్న నిపుణులు!
చలికాలంలో బరువు పెరుగుతున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు!

