తెలుగులో ఆశా భోస్లే పాటలు- ఆ ఒక్క సాంగ్ 90's కిడ్స్కు బాగా తెలుసు!
8 దశాబ్దాల సంగీత ప్రయాణం- 12వేలకు పైగా పాటలు- తెలుగులోనూ ఆశా భోస్లే సాంగ్స్!

Published : April 12, 2026 at 5:39 PM IST
Asha Bhosle Telugu Songs : 11ఏళ్లకే సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రముఖ గాయని ఆశా భోస్లే సినీరంగంలో సరికొత్త మైలురాళ్లు అందుకున్నారు. 1943లో మరాఠీ సినిమా మజాబ్తో ఆమె ప్రస్థానం మొదలైంది. అప్పట్నుంచి కెరీర్లో ఓపీ నయ్యర్, ఆర్డీ బర్మన్, శంకర్ జై కిషన్, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి పనిచేసిన ఆశ ప్రతి తరానికి దగ్గరయ్యారు. సుదీర్ఘ ఎనిమిది దశాబ్దాల ప్రయాణంలో 12 వేలకు పైగా పాటలు పాడారు.
మరాఠీ, హిందీతోపాటు తెలుగులోనూ ఆమె కొన్ని పాటలకు తన గాత్రం అందించారు. 90ల్లో ఆశ ఆనేక పాటలు పాడారు. ఈ క్రమంలో ఆమె ప్రముఖులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కీరవాణీతో కలిసి పసి చేశారు. ఆమె ఎస్పీబీతో కలిసి పాడిన పాటలే ఎక్కువగా ఉన్నాయి. అనేక పాటలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోనూ 'గాన కోకిల'గా చోటు సంపాదించుకున్నారు. మరి ఆమె తెలుగులో పాడిన పాటల్లో కొన్నింటిపై ఓ లుక్కేద్దామా?
ఆశా భోస్లే ఆలపించిన ప్రముఖ తెలుగు పాటలు
- బాలకృష్ణ హీరోగా వచ్చిన అశ్వమేధం సినిమాలో ఓ ప్రేమ పాటకు ఆశ భోస్లే స్వరం అందించారు. ఆమె లెజెండరీ ఎస్పీ బాలుతో ఈ పాట పాడారు
- విక్టరీ వెంకటేశ్ - సౌందర్య జంటగా నటించిన పవిత్ర బంధం సినిమాలో ఇస్సలకిడి అమ్మమ్మో ఎంవేది అనే పాట పాడారు. ఇందులోనూ మేల్ ట్రాక్ ఎస్పీ బాలుదే!
- మోహన్లాల్- ఐశ్వర్యారాయ్ కాంబోలో మణిరత్నం తెరకెక్కించిన ఇద్దరు సినిమాలో వెన్నెల వెన్నెల వెళ్లి రా అనే పాటకు తన గాత్రం అందించారు
- ఆర్డీ బర్మన్ సంగీతం అందించిన చిన్ని కృష్ణుడు సినిమాలో జీవితం సప్తసాగరం పాట పాడారు
- అంతులేని కథ సినిమాలో నుంచి ఒక వేణువు వినిపించెను పాటకు గాత్రం అందించారు. ఈసినిమాకు ఆర్డీ బర్మన్ సంగీతం అందించారు
- మంచి మనసులు సినిమాలోని ఎవర్గ్రీన్ సాంగ్ జాబిల్లి కోసం ఫీమేల్ వెర్షన్ కోసం ఆశ తన గాత్రం అందించారు
- మోహన్ బాబు- జయప్రద ప్రధాన పాత్రలు పోషించిన పాలు నీళ్లు సినిమాలో ఇది మౌనగీతం పాట పాడారు
- సీతాకాలం ప్రేమకు సినిమాలో ఎస్పీబీతో డ్యూయెట్ ఓ ప్రేమ పాట ఆలపించారు. ఇదే సినిమాలో టైటిల్ సాంగ్ కూడా పాడారు
- వీటితోపాటు అన్నమయ్య సినిమాలోని (అన్నమయ్య సంకీర్తనలు) అల్బమ్ రికార్డింగ్ కోసం ఆశా భోస్లే పనిచేశారు
- 2007లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా చందమామ. ఇందులో నవదీప్, శివ బాలాజీ, కాజల్, సింధు మేనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో నాలో ఊహలకు పాట పాడింది ఆశా భోస్లేనే! ఈ పాట 90's కిడ్స్కు బాగా గుర్తుండి ఉంటుంది. అప్పట్లో ఈ పాట సూపర్ హిట్ అయ్యింది
కాగా, ఆశా భోస్లే 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గోవర్లో జన్మించారు. తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్, ప్రముఖ శాస్త్రీయ గాయకుడు, నటుడు. తల్లి శేవంతి మంగేష్కర్. దివంగత గాయనీ లతా మంగేష్కర్, ఆశా భోస్లే సోదరే. తండ్రి వారసత్వంగా అందించిన సంగీతం ఆమెకు ప్రపంచ స్థాయిలో గుర్తింపునిచ్చింది. ఆమె సంగీతం ప్రస్థానం 11వ ఏటనే మొదలైంది. మరాఠీ చిత్రం మజాబాల్లో పాట పాడారు. అలా ఇప్పటివరకు ఆశా భోస్లే వెయ్యికి పైగా బాలీవుడ్ చిత్రాల్లో 12 వేలకుపైగా పాటలు పాడారు. భారతీయ భాషల్లోనే కాకుండా ఆమె విదేశీ భాషల్లోనూ పాటలు పాడారు.
'ఆమె పాటలు శాశ్వతంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి'- ఆశా భోస్లేకు ప్రముఖుల సంతాపం

