త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్- లీటర్పై ఏకంగా రూ.28 పెంపు!
ధరల పెంపును కొట్టిపారేయలేమంటున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు- లీటర్పై రూ.25 నుంచి 28 వరకు పెరిగే అవకాశం !

Published : May 1, 2026 at 7:47 PM IST
Petrol Price Hike : దేశంలోని వాహనదారులు, సామాన్యులకు త్వరలో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఐదు నుంచి 7 రోజుల్లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. నాలుగేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచిన చమురు సంస్థలు ప్రస్తుతం తీవ్రనష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో లీటర్ పెట్రోల్పై 4 నుంచి 5 రూపాయలు, వంట గ్యాస్ 40 నుంచి 50 రూపాయలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడం మొదలుపెట్టిన తర్వాత పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. దీనితో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీనితో గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, దిగ్భందనం మాత్రం కొనసాగుతోంది. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో హర్మూజ్ గుండా చమురు రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దీనితో గతేడాది చమురు బ్యారెల్ ధర 70 డాలర్లు ఉండగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఈ వారం ఏకంగా 126 డాలర్లను తాకింది. ప్రస్తుతం కాస్త శాంతించినా 110 డాలర్లకు పైనే పలుకుతోంది. ఈ ప్రభావం భారతదేశంపై కూడా చూపే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇంతకు ముందు, చమురు పరిశ్రమ తరఫున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్, దేశీయ ఎల్పీజీ ధరలను పెంచడం లేదని తెలిపింది. అయితే ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కమర్షియల్ ఎల్పీజీ, పారిశ్రామిక డీజిల్, 5 కేజీల ఎల్పీజీ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు విక్రయించే జెట్ ఇంధన ధరలను పెంచాయి. అయితే వంట గ్యాస్ ధరలు పెంచబోమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ కమర్షియల్ గ్యాస్, విమాన ఇంధన ధరలు భారీ పెరగడంతో సామాన్య ప్రజల్లో భయాందోళన వ్యక్తం అవుతోంది.
ధరల పెంపు తప్పదా?
అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు భగ్గుమంటున్న వేళ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపును తోసిపుచ్చలేమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2022 ఏప్రిల్ నుంచి దేశంలో రిటైల్ ఇంధన ధరల్లో పెద్ద మార్పు లేదు. ఈ కాలంలో చమురు ధరలు కొన్ని నెలలు పెరగగా, మరికొన్ని సార్లు తగ్గాయి. ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లాభాలను ఆర్జించగా, ఆ లాభాలను ధరలు పెరిగినప్పుడు వచ్చే నష్టాలను పూడ్చుకోవడానికి ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం దిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు రూ.94.77 కాగా, డీజిల్ ధర రూ.86.67గా ఉంది.
నష్టాలు వస్తున్నాయ్!
అయితే చమురు ధరల పెరుగుదల వల్ల దేశీయ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్పై సుమారు 20 రూపాయలు, డీజిల్పై ఏకంగా 100 రూపాయల మేర నష్టపోతున్నాయని చమురు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. వాస్తవానికి పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వాణిజ్య ఎల్పీజీ, ఇండస్ట్రియల్ డీజిల్, విమాన ఇంధన ధరలను చమురు సంస్థలు ఇప్పటికే పెంచాయి. కానీ సామాన్యులపై భారం పడే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను మాత్రం తాత్కాలికంగా పెంచలేదు. అయితే, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినందున, త్వరలోనే లీటర్ ఇంధనంపై 25 నుంచి 28 రూపాయల వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రికార్డు స్థాయిలో ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లు- ఎంతంటే?
ఒకటో తేదీన వినియోగదారులకు బిగ్ షాక్- రూ.993 పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

