పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ - రూ.20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చేతికి రూ.40 లక్షలు!
- తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని చూస్తున్నారా? - ఈ స్కీమ్ సూపర్ ఆప్షన్!

Published : March 2, 2026 at 12:53 PM IST
Kisan Vikas Patra Scheme: రిస్క్ లేకుండా తక్కువ పొదుపుతో ఎక్కువ రాబడి లభించే స్కీమ్స్లలో పెట్టుబడి పెట్టాలని చాలా మంది ఆశిస్తుంటారు. కానీ ఎందులో పెట్టాలో తెలియక తికమకపడుతుంటారు. అలాంటి వారి కోసం అద్భుతమైన స్కీమ్ ఒకటి ఉంది. అదే కిసాన్ వికాస్ పత్ర. నిజానికి ఈ స్కీమ్ ఎప్పటి నుంచో అమల్లో ఉన్నా చాలా మందికి సరైన అవగాహన లేదు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బులు మెచ్యూరిటీ తర్వాత డబులవుతాయి. వడ్డీ కూడా అధికమే. మరి ఈ స్కీమ్లో చేరేందుకు ఎవరు అర్హులు? ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎలా అప్లై చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
స్మాల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీంగా కేంద్ర ప్రభుత్వం 1988లో కిసాన్ వికాస్ పత్ర పథకం తీసుకొచ్చింది. ముఖ్యంగా అన్నదాతల్లో దీర్ఘకాల పెట్టుబడిని ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. అందుకే దీనికి కిసాన్ వికాస్ పత్రగా నామకరణం చేశారు. అయితే, కేవలం రైతులకు మాత్రమే కాకుండా అర్హులైన పౌరులందరికీ ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించేలా మార్గదర్శకాలు రూపొందించారు. మార్కెట్తో సంబంధం లేకుండా ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి కచ్చితమైన రాబడి లభిస్తుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ దేశంలోని అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది.
ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాలు:
- కిసాన్ వికాస్ పత్ర స్కీమ్లో చేరాలనుకునేవారు భారత పౌరులై ఉండాలి. అలాగే 18 సంవత్సరాల వయసు పూర్తైన వారు అర్హులు.
- ఒక వ్యక్తి తన పేరు మీద ఎన్ని అకౌంట్లనైనా ఓపెన్ చేయవచ్చు. అలాగే ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ ఖాతాను తెరవచ్చు. మైనర్ల పేరు మీద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
- కనిష్ఠంగా రూ.1,000 వరకు మదుపు చేయొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. అయితే డిపాజిట్ రూ.50 వేలకు మించితే సదరు వ్యక్తి పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అదే రూ.10 లక్షలు అంత కంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలంటే.. మీ పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఐటీఆర్ డాక్యుమెంట్ల వంటి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందించాల్సి ఉంటుంది.
- కేవీపీలో వడ్డీ రేటు ప్రతి సంవత్సరం మారుతుంటుంది. ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ వడ్డీ రేటు 7.5% శాతంగా ఉంది.
- ఈ స్కీం కాలపరిమితి సైతం ఎప్పటికప్పుడు మారుతుంటుంది. ప్రస్తుతం మెచ్యూరిటీ పీరియడ్ 115 నెలలుగా ఉంది. అంటే మీరు డిపాజిట్ చేసిన తేదీ నుంచి 9 సంవత్సరాల 7 నెలల తర్వాత మెచ్యూర్ అవుతుంది.
- సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఖాతాదారులు మరణించినప్పుడు, కోర్టు సందేశాల మేరకు ముందుగానే డిపాజిట్లను ఉపసంహరించుకునేందుకు కిసాన్ వికాస్ పత్ర పథకంలో అవకాశం ఉంటుంది. అయితే, అప్పటి వరకు లభించిన వడ్డీని మాత్రమే చెల్లిస్తారు.
- ఒకవేళ ఖాతాదారుడు అనుకోకుండా మరణిస్తే.. ఆ ఖాతాను నామినీకి లేదా చట్టపరమైన వారసులకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకవేళ జాయింట్ ఖాతా అయితే, రెండో భాగస్వామికి కేటాయిస్తారు.
- కేవీపీలో చేసిన డిపాజిట్లకు సర్టిఫికెట్ లభిస్తుంది. దీన్ని తనఖా పెట్టి రుణాలు పొందొచ్చు. రుణ వడ్డీరేటు కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది.
ఎంత పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది: ఈ పథకం ద్వారా మీరు పెట్టే పెట్టుబడికి రెట్టింపు ఆదాయం లభిస్తుంది. ఉదాహరణకు మీరు రూ.50వేలు ఇన్వెస్ట్ చేస్తే 115 నెలల తర్వాత మీ అకౌంట్లోకి 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తారు. అదే మీరు రూ.20లక్షలు పెడితే రూ.40 లక్షలు చేతికి వస్తాయి. కాబట్టి రిస్క్ లేకుండా మీరు పెట్టిన దానికి డబుల్ ఆదాయం పొందవచ్చు.
"క్రెడిట్ కార్డు" వాడుతున్న వ్యక్తి చనిపోతే - దానిపై ఉన్న బిల్లు ఎవరు కట్టాలి?
రోజుకు రూ.417 పొదుపుతో కోటి రూపాయల ఆదాయం - రిస్క్ కూడా ఉండదు!

