ఏప్రిల్ 1 నుంచి E20 పెట్రోల్ విక్రయం తప్పనిసరి- కేంద్రం కీలక ఆదేశం
దేశంలో మినిమం RON 95 కలిపిన ఈ20 పెట్రోల్ విక్రయం తప్పనిసరి- ఏప్రిల్ 1 నుంచే అమలు- కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం

Published : February 25, 2026 at 3:58 PM IST
E20 Petrol Sale From April 1 : దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 2026 ఏప్రిల్ 1 నుంచి 20శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20), కనీసం రిసెర్చ్ ఆక్టేన్ నంబర్ (ఆర్ఓఎన్) 95 కలిగిన ఇంధనాన్ని మాత్రమే విక్రయించాలని కేంద్రం ఆదేశించింది. 2026 ఫిబ్రవరి 17న చమురు మంత్రిత్వశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిర్దేశిత ప్రమాణాల ప్రకారం, 20 శాతం వరకు ఇథనాలు మిశ్రమం, కనీసం రాన్ 95 కలిగిన పెట్రోల్ను మాత్రమే చమురు సంస్థలు దేశవ్యాప్తంగా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో, కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు పరిమిత కాలంపాటు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇథనాల్ ఎందుకు కలపాలి?
ఇథనాల్ను చెరకు, మొక్కజొన్న, ఇతర ధాన్యాల నుంచి తయారు చేస్తారు. అందుకే దీనిని పునరుత్పాదక ఇంధన వనరు అని చెప్పవచ్చు. పైగా దీనిని దేశీయంగా తయారు చేయవచ్చు. సాధారణ పెట్రోల్ కంటే ఇది తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. దేశంలో చమురు దిగుమతులు తగ్గించడంతోపాటు, కాలుష్య ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ను తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం చెరకు, మొక్కజొన్న, సహా అగ్రికల్చర్ సర్ప్లస్కు డిమాండ్ను పెంచి, రైతులకు ఆర్థికంగా బాగా మేలు చేస్తుంది.
వాహనాలపై ప్రభావం?
2023-25 నుంచి భారతదేశంలో తయారైన మెజారిటీ వాహనాలు ఈ20 ఇంధనంతో నడిచేలా రూపొందించారు. కనుక వాటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అయితే పాత వాహనాల విషయంలో మైలేజీ (3 -7 శాతం) స్వల్పంగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. రబ్బరు, ప్లాస్టిక్ భాగాలు త్వరగా అరిగిపోయే అవకాశం ఉంది.
RON 95 ఎందుకు కలపాలి?
ఈ20 కలిపిన పెట్రోల్ వాడినప్పుడు, ఇంజిన్ దెబ్బతినకుండా కనీసం RON 95 కలపాలనే నిబంధన విధించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్ఓఎన్ అంటే 'రిసెర్చ్ ఆక్టేన్ నంబర్'. ఇది ఇంధనం 'ఇంజిన్ నాకింగ్'ను ఎంత వరకు తట్టుకోగలదో తెలియజేస్తుంది. 'నాకింగ్' అంటే- ఇంజిన్ లోపల ఇంధనం అసమానంగా మండటం వల్ల వచ్చే శబ్దం, శక్తి కోల్పోవడం, కాలక్రమేణా ఇంజిన్ పాడవ్వడాన్ని నాకింగ్ అని అన్నారు. ఆక్టేన్ సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, ఇంధనం అంత స్థిరంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, అధిక ఒత్తిడిలో కూడా ఇంధనం అదుపు తప్పకుండా స్థిరంగా ఉండడమే 'హై ఆక్టేన్'. ఇథనాల్ సహజంగానే అధిక్ ఆక్టేన్ విలువను (సుమారు RON 108) కలిగి ఉంటుంది. కనుక పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల ఇంజిన్ నాకింగ్ను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.
లక్ష్యం ఇదే!
భారత్ 2022 జూన్ నాటికి 10 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. దానిని ఐదు నెలల కంటే ముందే చేరుకుంది. దీనితో ప్రభుత్వం 20 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని 2030 నుంచి 2026కు మార్చింది. ప్రస్తుతం దేశంలోని మెజారిటీ పెట్రోల్ బంకుల్లో ఈ20 పెట్రోల్ అందుబాటులో ఉంది. చమురు మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2014-15 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్కు బదులుగా ఇథనాల్ వాడడం వల్ భారతదేశం రూ.1.40 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసింది.
మొక్కజొన్నకు ఫుల్ డిమాండ్!
కేంద్రం ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలపాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఇథనాల్ పరిశ్రమ యాజమాన్యాలు మొక్కజొన్నలను అత్యధికంగా కొనుగోలు చేస్తున్నాయి. నూకలు, చెరకు పిప్పి తదితర ప్రత్యామ్నాయాలు ఉన్నా, మక్కలపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. 2023-2024లో చెరకు, వరిని అధిగమించి, మొక్కజొన్న మొత్తం ఇథనాల్ ఉత్పత్తిలో 42.74 శాతం వాటాను పొందింది.
రోజుకు రూ.7 తో నెలకు రూ.5వేల పెన్షన్ - ఈ స్కీమ్ గురించి తెలుసా?
PAN ట్రాన్సాక్షన్ లిమిట్ పెంపు!- డిపాజిట్లు, ఆస్తులు, వాహనాల కొనుగోలుకు ఊరట!- ఏప్రిల్ 1 నుంచే అమలు!

