పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్- రూ.5లక్షల వరకు ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్
ఈపీఎఫ్లో కొత్త డిజిటల్ వ్యవస్థ ప్రారంభం- ఈనెల 15 నాటికి పీఎఫ్ చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ

Published : July 8, 2026 at 1:30 PM IST
EPFO New Digital System : పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్. ఈపీఎఫ్ఓ కొత్త డిజిటల్ వ్యవస్థను ప్రారంభించింది. ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ను రూ.5 లక్షల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నాటికి పీఎఫ్ చందాదారాల ఖాతాల్లో వడ్డీ జమ చేయనున్నట్లు తెలిపింది. గతంలో చందాదారులు తమ ఖాతాల్లో వడ్డీ జమ కావడానికి సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు వేచి చూడాల్సి ఉండేది.
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం కీలక ప్రకటన చేశారు. "కొత్త కేంద్రీకృత ఐటీ ప్లాట్ఫారమ్ అందుబాటులోకి వచ్చింది. అందువల్ల వడ్డీ జమ ప్రక్రియకు పట్టే సమయం గణనీయంగా తగ్గింది. ఈ జులై 15 నాటికి 34 కోట్ల మంది పీఎఫ్ చందాదారాల ఖాతాల్లో 8.25 శాతం మేర వడ్డీ జమ అవుతుంది. మొత్తం రూ.1.44 లక్షల కోట్ల ఈపీఎఫ్ వడ్డీ జమ చేస్తాం. గతంలో ఇదే మొత్తాన్ని సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జమ చేసేవాళ్లం. ఇప్పుడు ఈ ప్రక్రియ ఆటోమేటిక్ కావడం వల్ల ప్రాసెసింగ్ సమయం చాలా తగ్గింది" అని అన్నారు.
ఈపీఎఫ్ఓ తన 'సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్' (CITES) ప్రాజెక్టు కింద సభ్యుల రికార్డులన్నింటినీ ఒకే జాతీయ డేటాబేస్కు విజయవంతంగా బదిలీ చేసింది. సంస్థ అందించే సేవలను ఆధునీకరించడం, ఆటోమేషన్, నిబంధన ఆధారిత ప్రాసెసింగ్, పాదర్శకత, సమర్థ్యాన్ని పెంచేలో ఒక ఏకీకృత ప్లాట్ఫారమ్ను తీసుకురావడమే లక్ష్యంగా దీనిని తీసుకువచ్చింది. గతంలో ప్రాంతీయ కార్యాలయాలు ప్రత్యేకంగా డేటాబేస్లను నిర్వహించేవి. దీని వల్ల వడ్డీ జమ ప్రక్రియ ఆలస్యం అయ్యేది. కానీ ఇప్పుడు కేంద్రీకృత డేటాబేస్ అందుబాటులోకి రావడంతో సభ్యుల సర్వీస్ అభ్యర్థనలను కేవలం ఆ ఖాతా ఉన్న ప్రాంతీయ కార్యాలయం నుంచే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఈపీఎఫ్ఓ అధికారిక కార్యాలయం నుంచైనా ప్రాసెస్ చేయవచ్చు.
ఈ కొత్త యూనిఫైడ్ పోర్టల్లో చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్, క్లెయిమ్ స్థితి, పెన్షన్ రికార్డులు, పొందిన ప్రయోజనాల వివరాలను సులభంగా చూసుకోవచ్చు. అయితేకాదు క్లెయిమ్లను ప్రాసెస్ చేయడానికి ముందే, లోపాలను గుర్తించడానికి ఆటోమేటెడ్ ప్రీ-వ్యాలిడేషన్ నిర్వహణ అయిపోతుంది. ఇది రిజెక్షన్ రేటును తగ్గించి, మొదటిసారికే క్లెయిమ్ ఆమోదం పొందడానికి వీలు కల్పిస్తుంది.
కేవైసీ పూర్తి చేసిన ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ క్లెయిమ్లను ఆటో-సెటిల్మెంట్ చేస్తుంది. కాగా ఈ ఆటో-సెటిల్మెంట్ పరిమితిని తాజాగా రూ.1 లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచింది. క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయంలో ఏమైనా వివరాలు కావాల్సి వస్తే, సభ్యులు నేరుగా ఆన్లైన్లోనే తమ సమాధానాలు ఇవ్వవచ్చు. ఇకపై ఉద్యోగులు జాబ్ మారినప్పుడు ఆధార్తో అనుసంధానమైన పీఎఫ్ ఖాతాలు ఆటోమేటిక్గా బదిలీ అవుతాయి. అంతేకాదు పాక్షిక విత్డ్రావల్ నిబంధనలను సరళీకరించారు. ఖాతా ఏ ప్రాంతీయ కార్యాలయంలో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఈపీఎఫ్ఓ సేవలను పొందే సదుపాయం కల్పించారు.
పీఎఫ్ కొత్త రూల్స్
కొత్త నిబంధనల ప్రకారం, నెలకు రూ.15000లోపు జీతం ఉన్నవారికి మాత్రమే 12 శాతం చొప్పున, గరిష్ఠంగా రూ.1800 వరకు కంట్రిబ్యూషన్ కట్ అవుతుంది. అంతకంటే ఎక్కువ జీతం ఉండి, నెలకు రూ.1800 కంటే ఎక్కువ పీఎఫ్ కట్ చేసుకోవాలంటే, అది పూర్తిగా ఉద్యోగి ఇష్టం. ఒకవేళ ఒక ఉద్యోగి జాబ్ మానేసి, పీఎఫ్ ఖాతాలోని పూర్తి డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే 12 నెలలు ఆగాల్సిందే. అది కూడా ఈ కాలంలో సదరు వ్యక్తి నిరుద్యోగిగా ఉన్నట్లు నిరూపించుకోవాలి. గతంలో కేవలం 2 నెలల గ్యాప్ ఉంటే సరిపోయేది. ఇక ఆటో-సెటిల్మెంట్ రూల్స్ కూడా మారాయి. అత్యవసర వైద్యం, పెళ్లి, విద్య, ఇంటి నిర్మాణం లాంటి అవసరాల కోసం ఆటో-క్లెయిమ్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఈ క్లెయిమ్ను ఎంప్లాయర్ అనుమతి అవసరం లేకుండానే కంప్యూటర్ సిస్టమ్ ఆటోమేటిక్గా ఆమోదిస్తుంది.
మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారా? - "నామినీ" రోల్ ఏంటో తెలుసా?
ఒకటికి మించి ఎక్కువ "లోన్స్" తీసుకున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే చక్కగా మేనేజ్ చేయొచ్చట!

