లవర్ ఫ్యామిలీని ఇంప్రెస్ చేసేందుకు ప్రియుడి ప్లాన్- ఫేక్ యాక్సిడెంట్తో సినిమా లెవల్ స్కెచ్
కారుతో వెనుకనుంచి ఢీకొట్టి- ఆ తర్వాత హీరోలా ఎంట్రీ ఇచ్చిన యువకుడు

Published : January 7, 2026 at 5:29 PM IST
Youth Plan Fake Accident : ఈ కాలం కుర్రాళ్లు తమ ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. అయితే, కొన్ని సార్లు సీన్ రివర్స్ అవుతుంది. అలాంటి ఘటనే జరిగి ఓ ప్రియుడు కటకటాల పాలయ్యాడు. ప్రియురాలి తల్లిదండ్రులకు తనపై మంచి అభిప్రాయం ఏర్పడాలని, తనకు ఇచ్చి పెళ్లి చేయాలని సినిమా లెవల్లో ప్లాన్ వేశాడు ఓ వ్యక్తి. తీరా చూస్తే వారి ప్లాన్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యి, పోలీస్స్టేషన్ గుమ్మాన్ని తట్టింది. కేరళలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఎవరు వాళ్లు? యువతి తల్లిదండ్రులను మెప్పించడానికి వారు వేసిన ఆ బడా ప్లాన్ ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
పథనంతిట్టా జిల్లాలోని రాజిభవానికి చెందిన రంజిత్ రాజన్, ఎజాస్ అనే ఇద్దరు యువకులు మంచి స్నేహితులు. అయితే రంజిత్ రాజన్ కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రియురాలి తల్లిదండ్రులను ఇంప్రెస్ చేయడానికి, మిత్రుడైన ఎజాస్తో ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు రంజిత్. అదేంటంటే, 'రోడ్డుపై వెళ్తున్న ప్రియురాలి స్కూటర్ను, తన స్నేహితుడైన ఎజాస్ కారుతో వెనుకనుంచి ఢీకొట్టాలి. అప్పుడు రంజిత్ హీరో లెవల్లో ఎంట్రీ ఇచ్చి ఆమెను రక్షిస్తాడు. అనంతరం యువతి తల్లిదండ్రులు తనపై చూపే సానుభూతిని ఉపయోగించుకుని ఆమెను పెళ్లి చేసుకోవాలి' అని ప్రణాళిక రచించాడు.
భార్య అని చెప్పి, కారులో ఎక్కించుకుని!
డిసెంబర్ 23న సాయంత్రం ఆ యువతి కోచింగ్కు వెళ్లి స్కూటర్పై తిరిగి వస్తుంది. ఈ క్రమంలోనే ఇంటికి బయలుదేరిన యువతిని పధకం ప్రకారం ఫాలో అయిన ఎజాస్ కారుతో వెనుక నుంచి ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే మరో కారులో అక్కడికి చేరుకున్న రంజిత్, ఏమీ తెలియనట్లుగా యువతి వద్దకు వచ్చి సాయం చేశాడు. గాయాలతో ఉన్న ఆమెను తన కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అంతేకాకుండా ఘటన స్థలంలో గుమికూడిన స్థానికులకు ఆ యువతి తన భార్య అని చెప్పి తీసుకెళ్లాడు. కాగా, ఈ ప్రమాదంలో యువతి కుడి మోచేయి, చిటికెన వేలు విరిగిపోగా, మిగతా శరీర అవయవాలపై కూడా గాయాలయ్యాయి.
పోలీసుల ఏంట్రీతో అసలు కథ వెలుగులోకి!
ఇదిలా ఉండగా, విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని యువతి వాంగ్మూలాన్ని సేకరించారు. అయితే తనకు జరిగిన ప్రమాదంపై యువతి అనుమానం వ్యక్తం చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే రంజిత్ ఘటనా స్థలానికి వెళ్లడం పోలీసులకు మరింత అనుమానాన్ని రేకెత్తించింది. ప్రమాద స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు పోలీసులు. ఈ క్రమంలోనే కారు నడిపిన వ్యక్తిని ఎజాస్గా గుర్తించిన పోలీసులు, అతడి ఫోన్ కాల్స్ను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. రంజిత్, ఎజాస్ ఇద్దరూ స్నేహితులని, పధకం ప్రకారమే ఇలా చేశారని పోలీసుల విచారణలో తేలింది. యువతి కుటుంబీకులకు తనపై నమ్మకం కలిగించాలనే ఇలా చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్పారు.
హత్యాయత్నం కింద కేసు నమోదు!
దీంతో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, వారిద్దరినీ అరెస్టు చేశారు. నిందితులిద్దరూ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారని పథనంతిట్ట పోలీసులు పేర్కొన్నారు. యువతి కుటుంబం సానుభూతి పొందడం కోసమే నిందితులు ఇలా చేశారని వెల్లడించారు.
చోరీకి వచ్చి ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కుపోయిన దొంగ
ఏనుగుల బీభత్సం- ఒక్క రాత్రిలో ఆరుగురు మృతి- 6రోజుల్లో 15 మంది మరణం

