ETV Bharat / bharat

NCERT వివాదం- బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం: కేంద్ర విద్యాశాఖ మంత్రి

న్యాయవ్యవస్థను అగౌరవపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​- ఆర్​ఎస్ఎస్​ పాత్రపై విచారణ చేయాలని కాంగ్రెస్ డిమాండ్

Education Minister Dharmendra Pradhan
Education Minister Dharmendra Pradhan (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : February 26, 2026 at 5:05 PM IST

3 Min Read
Choose ETV Bharat

Education Minister On NCERT Row : ఎన్​సీఈఆర్​టీ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో 'న్యాయవ్యవస్థలోని అవినీతి' గురించి ఒక అధ్యాయం చేర్చడంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద అంశాన్ని పిల్లల పాఠ్యాంశంగా రూపొందించిన వారిని బాధ్యులుగా చేస్తామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గురువారం పేర్కొన్నారు. ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవం ఉందని, ఆ వ్యవస్థను అగౌరవపరిచే ఉద్దేశం ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థను అప్రతిష్ఠపాలు చేసే ఒక సంఘటిత కుట్ర జరిగినట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈ కీలక ప్రకటన చేయడం గమనార్హం.

బీజేపీ స్టాండ్ ఇదే!
మరోవైపు బీజేపీ కూడా ఈ అంశంపై స్పందించింది. ఎన్​సీఈఆర్​టీ పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ఉన్న వివాదాస్పద అధ్యయాన్ని 'సున్నితమైన అంశంగా' అభివర్ణించింది. తాము దేశ న్యాయవ్యవస్థను గౌరవిస్తామని, దాని నిష్పాక్షిక పనితీరు పట్ల గర్విస్తున్నామని పేర్కొంది.

"ఇది చాలా సున్నితమైన అంశం. పార్టీ ప్రతినిధిగా నేను ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నాను. భారత్​లోనే కాకుండా ప్రపంచం మొత్తంలో భారత న్యాయవ్యవస్థ అంత స్వతంత్రమైనది, అర్హత కలిగినది మరెక్కడా లేదని నేను చెబుతాను. భారత న్యాయవ్యవస్థ పట్ల మనందరికీ ఎంతో గౌరవం, గర్వం ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరి హృదయంలోని భావన."
- సంబిత్ పాత్ర, బీజేపీ జాతీయ ప్రతినిధి

బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు, ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అండగా ఉంటుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని సంబిత్ పాత్ర గుర్తుచేశారు.

ఆ పుస్తకంపై నిషేధం
వివాదాస్పద ఎన్​సీఈఆర్​టీ 8వ తరగతి సామాజిక శాస్త్ర పుస్తకంలో అవినీతి, భారీగా పేరుకుపోయిన కేసులు, సరిపడా సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం వంటివి న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లుగా పేర్కొన్నారు. అంతేకాదు న్యాయవ్యవస్థలో అవినీతి అనే సబ్​ఛాప్టర్​ను చేర్చారు. ఇదే తీవ్ర వివాదానికి దారి తీసింది. అందుకే ఈ పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు పూర్తిస్థాయి నిషేధం విధించింది. అంతేకాదు ఫిజికల్​, డిజిటల్ రూపంలో ఉన్న అన్ని కాపీలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.

తాము రూపొందించిన 8వ తరగతి పాఠ్యపుస్తకంలో 'అనుచిత కంటెంట్​ ఉండడం'పై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్​ (ఎన్​సీఈఆర్​టీ) క్షమాపణలు చెప్పింది. సదరు పాఠ్యాంశాన్ని తొలగిస్తామని పేర్కొంది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్​, "వారు తుపాకీతో కాల్చారు. న్యాయవ్యవస్థ రక్తమోడుతోంది" అంటూ ఎన్​సీఈఆర్​టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

RSS పాత్రపై విచారణ చేయాలి!
మరోవైపు ఎన్​సీఈఆర్​టీ పాఠ్యపుస్తకాల్లో 'న్యాయవ్యవస్థలోని అవినీతి' అంశాన్ని చేర్చడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ సమర్థించారు. గత దశాబ్ద కాలంగా పాఠ్యపుస్తకాల రూపకల్పనలో 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్​' (ఆర్​ఎస్​ఎస్​) సాగించిన 'దుర్మార్గపు, ద్వేషపూరిత చర్యల'పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

"ఎన్​సీఈఆర్​టీ పాఠ్యపుస్తకాల్లో న్యాయవ్యవస్థపై ఉన్న విమర్శనాత్మక ప్రస్తావనల పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం సరైనదే. నిజానికి గత దశాబ్దకాలంగా ఈ పుస్తకాలను తిరిగి రాసిన తీరు సిగ్గుచేటు. ఇది ఆర్​ఎస్​ఎస్ చేస్తున్న దుర్మార్గపు, కుట్రపూరితమైన పని. వాస్తవానికి ఈ మొత్తం ముఠాపై విచారణ జరగాలి."
- జైరాం రమేశ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎక్స్​ పోస్ట్

వారికి షోకాజ్ నోటీసులు
పిల్లల పాఠ్యపుస్తకంలో 'న్యాయవ్యవస్థలో అవినీతి' అనే ఉప-అధ్యాయాన్ని చేర్చినందుకు విద్యామంత్రిత్వశాఖ కార్యదర్శికి, ఎన్​సీఈఆర్​టీ డైరెక్టర్​ దినేశ్ ప్రసాద్ సక్లానీకి సుప్రీంకోర్టు గురువారం షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కార చర్యలు, ఇతర చట్టాల కింద వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని కోరింది.

వాస్తవానికి ఇప్పటికే ఎన్​సీఈఆర్​టీ క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ అంశంపై సుమోటోగా చేపట్టిన విచారణను నిలిపివేయడానికి నిరాకరించింది. అంతేకాదు ఈ ఉత్తర్వులు ఉల్లంఘించే ఏ ప్రయత్నమైనా న్యాయపరిపాలనలో నేరుగా జోక్యం చేసుకున్నట్లు, కోర్టు ధిక్కారచర్యలు చేపట్టినట్లే భావిస్తామని హెచ్చరించింది.

సదరు వివాదాస్పద అధ్యాయాన్ని ఆమోదించిన టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్స్ కమిటీకి సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించాలని సుప్రీంకోర్టు ఎన్​సీఈఆర్​టీని ఆదేశించింది. ముఖ్యంగా ఆ పాఠ్యాంశ రూపకల్పన బృందంలోని సభ్యుల పేర్లు, వారి అర్హతలు, ఇతర వివరాలను అందజేయాలని స్పష్టం చేసింది.

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు పూర్తి బాధ్యత వహించడం తప్పనిసరి: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఎప్​స్టీన్​​ ఫైల్స్​తో అమెరికా ఒత్తిడి- ట్రేడ్​ డీల్ వల్ల మన రైతులే బలి : రాహుల్ గాంధీ