చోరీకి వచ్చి ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కుపోయిన దొంగ
చోరీ కోసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం గుండా ఇంట్లోకి వెళ్లేందుకు దొంగ విఫలయత్నం- ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కుపోయి యజమానికి అడ్డంగా దొరికిపోయిన వైనం

Published : January 6, 2026 at 2:11 PM IST
Thief Trapped In Exhaust Fan Hole: ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం గుండా ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడాలనుకున్నాడు ఓ దొంగ. కానీ అతడి ప్లాన్ అట్టర్ ఫ్లాఫ్ అవుతుందని ఊహించలేకపోయాడు. ఇంట్లోకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం గుండా లోనికి ప్రవేశించే క్రమంలో అందులోనే చిక్కుకుపోయాడు. తీరా ఇంటి యజమాని వచ్చి చూసే సరికి ఆ దొంగ కాళ్లు ఇంటి లోపల, తల బయట ఉండిపోయింది. ఇది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాజస్థాన్ కోటాలోని బోర్ఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన జరిగింది.
అసలు విషయం ఏంటంటే!
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, కోటా జిల్లాకు చెందిన సుభాశ్ కుమార్ (ఇంటి యజమాని), అహిర్ ప్రతాప్ నగర్ ఫస్ట్లో నివసిస్తున్నారు. ఆయన తన కుటుంబంతో కలిసి ఖాతు శ్యామ్జీని సందర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో జనవరి 4వ తేదీ తన ఇంటికి చేరుకున్నారు. అయితే తన ఇంటి గేటు బయట స్కూటర్ను పార్క్ చేస్తున్న సమయంలో వంటగది ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో చిక్కుకున్న ఓ యువకుడిని గమనించాడు. ఆ సమయంలో యువకుడి కాళ్లు వంటగదిలో, తల బయట ఉండడం చూశాడు. వెంటనే అప్రమత్తమైన ఇంటి యజమాని బోర్ఖేడా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, యజమాని సహాయంతో ఆ దొంగను అతికష్టం మీద బయటకు తీశారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు డిగోడ్కు చెందిన 25 ఏళ్ల పవన్ వైష్ణవ్గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు కున్హాడి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బృందావన్ విహార్లో నివాసం ఉంటున్నాడు. ఈ ఘటనలో పవన్ వైష్ణవ్కు మరొకరు సహకరించారు. యజమాని రాకను చూసిన రెండో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఇప్పుడు పోలీసులు అతని కోసం వెతుకున్నారు.
దొంగతనానికి నిందితులు ఉపయోగించిన కారును చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ కారుపై పోలీస్ అని రాసి ఉన్న స్టిక్కర్ ఉంది. అంతేకాకుండా, కారు లోపల తెల్లటి కర్టెన్స్ ఉన్నాయి. సాధారణంగా ఉన్నతాధికారులు వాడే వాహనాల మాదిరిగా ఆ కారును సిద్ధం చేశారు. పోలీసుల కళ్లు గప్పడానికే నిందితులు ఇలాంటి కారును వాడుతున్నట్లు గుర్తించారు.
చోరీకీ వచ్చి, తప్ప తాగి నిద్రపోయిన దొంగ!
అంతకుముందు కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ ఇంటిలో దొంగతనానికి వెళ్లిన వ్యక్తి తప్ప తాగి అదే ఇంట్లో నిద్రపోయాడు. తెల్లవారు జామున ఇంటికి చేరుకున్న యజమానికి దొంగను చూసి అవాక్కయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని నజీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గతేడాది ఆగస్టులో వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం, మద్యానికి బానిసైన ఓ దొంగ పూటుగా తాగి మర్యంపుర్ రైల్వే లైన్లోని పక్కపక్కనే ఉన్న ఇద్దరు అన్నదమ్ముల ఇళ్లలోకి చొరబడ్డాడు.
తొలుత వినోద్ కుమార్ అనే వ్యక్తి ఇంటి కిటీకీలను బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు. ముందుగా లాకర్ని తెరిచి అందులోని విలువైన వస్తువులను కాజేశాడు. అక్కడితో ఆగకుండా రెండిళ్లకూ మధ్యన ఉన్న తలుపును విరగ్గొట్టి, అనిల్ కుమార్ ఇంట్లోకి ప్రవేశించాడు. బీరువా తెరిచి అందులోని బంగారు నగలను అపహరించాడు. అయితే, అప్పటికే అలసిపోయిన నిందితుడు తాగిన మైకంలో ఆ ఇంట్లోనే నిద్రపోయాడు.
మరోవైపు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న అనిల్ తెల్లవారుజామున తన ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి నిద్రిస్తుండటం చూసి షాక్ అయ్యాడు. అప్రమత్తమై ఇళ్లంతా వెతకగా బంగారం, విలువైన వస్తువులు కనిపించలేదు. అనుమానం వచ్చి నిద్రపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి చూడగా, కనపడకుండా పోయిన నగలు, నగదు అతడి వద్దే ఉన్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు దొంగకు దేహశుద్ధి చేసి చివరకు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
'అక్కడ పొలం పని జరగాలంటే తుపాకీ పట్టాల్సిందే బ్రో!'- ఎందుకలా? ఏం జరిగింది?
బ్రాండెడ్ జీన్స్ దొంగ- అన్నీ లేడీస్కు సంబంధించినవే- ఏకంగా మొత్తం కార్టన్ చోరీ!

