'ముంజ్' హస్తకళకు దేశవిదేశాల్లో డిమాండ్- 500మంది మహిళలకు ఉపాధి- నెలకు రూ.20వేల ఆదాయం!
ఈ కళకు జర్మనీ నుంచి మంచి గిరాకీ - 500 మంది మహిళలకు స్వయం ఉపాధి!

Published : December 19, 2025 at 12:09 PM IST
Uttarakhand Munj Crafts : ప్రతి ప్రాంతానికి ప్రత్యేక వేషధారణ, ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆలయాలు ఉన్నట్లే, హస్తకళలు కూడా ఉంటాయి. అలాగే, సహజ వనరులకు నిలయమైన ఉత్తరాఖండ్ కూడా ఒక ప్రత్యేకమైన హస్తకళల సంప్రదాయాన్ని కలిగి ఉంది. దానిలో ఒకటి ముంజ్ కళ. జనపనార ఉత్పత్తులు, లోహపు కళలు, చెక్క చెక్కడాలు మొదలైన హస్తకళలతో ఇక్కడి కళాకారులు అందరినీ ఔరా! అనిపిస్తున్నారు. అసలు వస్తువులను ఎలా తయారుచేస్తారు? కళాకారులు దీని ద్వారా ఎంత సంపాదిస్తున్నారు? తదితర విషయాలు తెలుసుకుందాం.
తెహ్రీ, అల్మోరా, బాగేశ్వర్ వంటి జిల్లాలకు చెందిన కళాకారులు తమ నైపుణ్యాలకు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. అటువంటి కళారూపాలలో ఒకటి ముంజ్ కళ. ఒకప్పుడు ఈ కళ అంతరించిపోయే దశలో ఉండేది. అయితే, కొంతమంది మహిళల ధైర్యం దీనికి పునరుజ్జీవం పోసింది. నేడు, ఈ కళ ఉత్తరాఖండ్లోని 500 మంది మహిళలకు సాధికారత కల్పిస్తూ, వారిని స్వయం సమృద్ధిగా మార్చి, విదేశాలలో కూడా వారికి గుర్తింపు తెచ్చిపెడుతోంది. జనపనార ఉత్పత్తులు (సంచులు, చెప్పులు), లోహపు కళలు (రాగి కళ), సంప్రదాయ వస్త్రాలు (పిథోరా, ఉన్ని శాలువలు), తదితర కళలతో సహా ఇక్కడి హస్తకళలు హిమాలయ ప్రకృతి సౌందర్యాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.

ముంజ్ కళకు అధిక గిరాకీ
ఈ హస్తకళ ప్రస్తుతం వారణాసిలో ప్రసిద్దిచెందుతుంది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆదివాసీ (గిరిజన) మార్కెట్ను ఏర్పాటుచేశారు. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన వర్గాల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. వివిధ ఉత్పత్తులలో, ఉత్తరాఖండ్ ముంజ్ కళకు అధిక గిరాకీ ఉంది. ఇది ఉత్తరాఖండ్కు చెందిన మహిళలు తయారుచేసే ఒక హస్తకళ. ఈ కళ ఓ విధంగా అంతరించిపోయే దశలో ఉండేది అని చెప్పుకోవచ్చు, కానీ 2014 తర్వాత దాని దశ మారింది. ఈ పనిలో నిమగ్నమైన మహిళలు ముంజ్ ఉత్పత్తులను తయారు చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని చెబుతున్నారు. ముంజ్ గడ్డితో వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేస్తారు. ప్రారంభంలో, దీనికి స్థానికంగా మాత్రమే డిమాండ్ ఉండేది, కానీ ఇప్పుడు అది అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకుంది. ఈ పని ద్వారా మహిళలు సాధికారత పొంది, స్వయం సమృద్ధిగా మారుతున్నారు.

500 మంది మహిళలకు ఉపాధి
ఉత్తరాఖండ్ నుంచి వారణాసికి వచ్చిన రీటా 2002లో ఈ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించారు. కానీ ఆ సమయంలో ఈ కళ గురించి చాలా తక్కువ మందికి తెలుసని రీటా అన్నారు. 2014లో పరిస్థితులు మారినప్పుడు, రీటా చేసిన ప్రయత్నం దాదాపు 500 మంది మహిళలను భాగస్వాములను చేస్తూ ఒక ఉద్యమంగా మారింది.

"నేను ఉధమ్ సింగ్ నగర్ నుంచి వారణాసికి వచ్చాను. నేను చేతివృత్తులలో, ప్రత్యేకంగా ముంజ్ కళలో ప్రావీణ్యం పొందాను. ఈ కళ మా పూర్వీకుల నుంచి వచ్చింది. ఇది దాదాపుగా అంతరించిపోయింది. మేము దీనిని పునరుద్ధరిస్తున్నాము. ప్రభుత్వంతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ సంస్థల నుంచి కూడా మాకు సహాయం లభిస్తుంది. గతంలో, కేవలం మా బృందం మాత్రమే పనిచేసేది. ఇప్పుడు, ఎక్కువ మంది చేరారు. 500 మంది మహిళలు పనిచేస్తూ, ప్రతి నెలా 15,000 నుంచి 20,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా మేం ప్రదర్శనలలో పాల్గొంటాం"
- రీటా
జర్మనీ నుంచి కూడా గిరాకీ
తమ ఉత్పత్తులకు దేశవిదేశాలలో కూడా గిరాకీ ఉంటుందని రీటా తెలిపారు. "గతంలో డబ్బు కోసం మా కుటుంబాలను అడగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. మేము పెన్ హోల్డర్లు, ఉంగరాలు, పిల్లల వస్తువులు, ఇలా మరెన్నో తయారు చేస్తాం. మా ఉత్పత్తులు దిల్లీ, డెహ్రాడూన్, అనేక రాష్ట్రాలలో అమ్ముడవుతున్నాయి. విదేశాలలో కూడా మా ఉత్పత్తులకు గిరాకీ ఉంది. జర్మనీ నుంచి కూడా ఆర్డర్లు వస్తాయి. ఉన్న సమస్య ఏమిటంటే, ఈ ఉత్పత్తులను తయారు చేయడానికి మా శ్రమకు తగిన ధర లభించడం లేదు. ఒక వస్తువు ధర రూ.500 అయితే, ప్రజలు రూ.300 కూడా చెల్లించడానికి సిద్ధంగా లేరు. మార్కెటింగ్ విషయంలో సహాయం చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆర్డర్లను పొందుతున్నాం. మాకు సొంత నెట్వర్క్ ఉంటే తద్వారా మేం ఆన్లైన్ ఆర్డర్లను నిర్వహించుకోగలుగుతాం. గత సంవత్సరంలో దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశాం. ఆయన కూడా మాకు మద్దతు ఇస్తున్నారు" అని రీటా చెప్పారు.

అమ్మమ్మల నుంచి ముంజ్ కళ
మహిళలను ఈ పనిలో భాగస్వాములను చేసి వారికి ఉపాధి కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అనితా దేవి చెప్పారు. దీనిని తయారు చేయడానికి, మేం నదులు, వాగులలో ముడిసరుకు కోసం వెతకాలి. మేం దానిని సేకరించి, శుభ్రపరిచి, ఆపై ఆరబెడతాము. దానిని పాడవకుండా చూసుకోవాలి. మేం దానిని ఒక సంవత్సరం పాటు సేకరిస్తాం. ఒక ముంజ్ హస్తకళా ఉత్పత్తిని తయారు చేయడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుంది అని అనితా వివరించారు. "నేను ఈ కళను మా పెద్దలను, మా అమ్మమ్మలను చూసి నేర్చుకున్నాను. మేం ఈ పనిలో మహిళలను భాగస్వాములను చేస్తున్నాం. వారు ఉపాధి పొంది, ముందుకు సాగుతున్నందుకు మేం సంతోషిస్తున్నాం. ఈ ఉత్పత్తులను తయారు చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది" అని అనితా దేవి తెలిపారు.

ఈ ప్రదర్శనలో ఉన్న వస్తువులు చాలా కొత్తగా అనిపించాయని ప్రదర్శనకు వచ్చిన వారు చెప్పారు. "ఇక్కడి చేతితో తయారు చేసిన వస్తువులు నాకు చాలా కొత్తగా ఉన్నాయి. ఈ ఉత్పత్తులన్నీ చూడటానికి చాలా బాగున్నాయి. పర్యావరణానికి కూడా ఈ వస్తువులు మేలు చేసేవే. ఈ పనిలో మహిళలు పాలుపంచుకోవడం మంచి విషయం. మా చిన్నతనాన్ని గుర్తుచేశాయి. మేం చిన్నతనంలో ఇలాంటివి తయారు చేసేవాళ్లం. వీటిని పండుగలు, వేడుకల్లో ఉపయోగిస్తారు. గుడికి వెళ్లేటప్పుడు ఇందులో పూజా సామగ్రిని తీసుకువెళ్లవచ్చు. ప్రతి ఆచారంలోనూ కుశ గడ్డిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పెళ్లిళ్లలో, సంప్రదాయకంగా వధువుకు ఈ బుట్టలలో బహుమతులు ఇచ్చేవారు" అని సందర్శకులు అంచల్, నిరూప తెలిపారు.
జంతువుల ఎముకలతో కళాఖండాలు తయారీ- దేశవిదేశాల్లో వాటికి ఫుల్ డిమాండ్- ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
కలియుగ 'విశ్వకర్మ'.. ఉలితో శిలలకు ప్రాణం.. కళాఖండాలకు ప్రపంచమే ఫిదా!

